- వేతనాలు, ప్రాసెసింగ్ చార్జీలు పెంపు
- వేలాదిమందికి లబ్ధి
- చేనేతల సంక్షేమానికి సీఎం చంద్రబాబు పెద్దపీట
- రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌళిశాఖల మంత్రి సవిత వెల్లడి
అమరావతి (చైతన్యరథం): వేలాది మంది నేతన్నలకు లబ్ధి చేకూర్చే విధంగా వేతనాలు, ప్రాసెసింగ్ చార్జీలను పెంచే కీలక నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకున్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యుఎస్ సంక్షేమం, చేనేత, టెక్సటైల్స్ శాఖల మంత్రి ఎస్.సవిత తెలిపారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయం పబ్లిసిటీ సెల్లో ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ సాంప్రదాయ చేనేత రంగాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. రాష్ట్రంలో దాదాపుగా 1,036 చేనేత సహకార సంఘాలున్నాయని, వాటిలో 89 వేల మగ్గం నేత కార్మికులు ఉన్నారన్నారు. వీరందరికీ ఆర్థికంగా ఊతం ఇచ్చే విధంగా, వారి జీవనోపాధి మెరుగుపడే విధంగా వేతనాలు, ప్రాసెసింగ్ ఛార్జీలను గణనీయంగా పెంచామన్నారు. ఆప్కో కు ఉత్పత్తులను సరఫరా చేసే ప్రాథమిక చేనేత కార్మికుల సహకార సంఘాలు (పీహెచ్డబ్ల్యూసీఎస్) కింద పనిచేసే నేత కార్మికులకు వేతనాలు, ఛార్జీల పెంపు వర్తిస్తుందన్నారు. బ్లీచింగ్ ఛార్జీలు బండిల్కు రూ.129 నుంచి రూ.148లకు (15%), డైయింగ్ ఛార్జీలు బండిల్కు రూ.362 నుంచి రూ.434లకు (20%), బెడ్షీట్ నేత మజూరీ రూ.83 నుంచి రూ.100లకు (20%), టవల్ నేత మజూరీ రూ.31 నుంచి రూ.40లకు (30%) పెంచామని మంత్రి తెలిపారు. ఫలితంగా ఒక్కో నేతన్నకు నెలకు అదనంగా రూ.3 వేల ఆదాయం రానున్నదన్నారు. ఈ విధంగా వేతనాలు, ప్రాసెసింగ్ ఛార్జీల పెంపుదలతో నేతన్నలకు ఆర్థిక భరోసా కలగడమే కాకుండా నేతన్నల సంక్షేమం, అభివృద్ధిపై కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తుందన్నారు.
నేతన్నల సంక్షేమానికి ప్రాధాన్యత
దేశంలోను, రాష్ట్రంలోను గ్రామీణ ఉపాధిలో వ్యవసాయం తర్వాత చేనేత రంగంపైనే ఎక్కువ మంది ఆధారపడి ఉన్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నేతన్నల సంక్షేమానికి పెద్ద పీట వేస్తోందన్నారు. అధికారంలోకి రాగానే నేతన్నలకు చేదోడుగా ఉండేందుకు ఎగ్జిబిషన్లు, విక్రయదారులు, కొనుగోలుదారుల సమావేశాలు ఏర్పాటు చేశామని, ఆధునిక డిజైన్లపై నేతన్నలకు శిక్షణ కార్యక్రమాలను కూడా నిర్వహించామని ఆమె తెలిపారు. అదే విధంగా ఎన్నికల సమయంలో చేనేతలకు 50 సంవత్సరాలకే పింఛన్ ఇస్తామన్న హామీని నిలపెట్టుకున్నామన్నారు. ప్రతి నెలా రూ.4 వేల చొప్పున దాదాపు 92,274 మంది నేతన్నలకు పింఛన్ అందజేస్తున్నామన్నారు. నేతన్న మగ్గాలకు ఉచితంగా విద్యుత్ అందజేస్తున్నామన్నారు. మర మగ్గాలకు 500 యూనిట్లు, చేతి మగ్గాలకు 200 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితంగా అందజేస్తున్నామని తెలిపారు. గృహ నిర్మాణ పథకం కింద కూడా నేతన్నలకు రూ.50 వేలు అదనంగా అందజేస్తున్నట్లు మంత్రి సవిత చెప్పారు.
చేనేత, హస్తకళల నూతన డిజైన్ల పోటీలు
రాష్ట్రంలోని నేత కార్మికులతో పాటు హస్తకళాకారుల ప్రతిభను వెలికితీసే ఉద్దేశంతో నూతన డిజైన్ల కోసం పోటీలు నిర్వహించబోతున్నామని మంత్రి తెలిపారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్స్ ఆంధ్రప్రదేశ్ (ఎన్ఐడీ`ఏపీ) సహకారంతో ఆప్కో, లేపాక్షి ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ నెల 17 నుంచి 30 రోజుల పాటు నూతన డిజైన్లను కళాకారుల నుంచి స్వీకరిస్తున్నామన్నారు. పలు కేటగిరీల్లో ఉత్తమ డిజైన్లను ఎంపిక చేసి విజేతలకు రూ.5 లక్షల నగదు బహుమతులు అందజేయనున్నామని ఆమె తెలిపారు. ఆప్కో, లేపాక్షి పనితీరు మరింత మెరుగుపరచడానికి విశాఖపట్నంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎమ్)తో ఒప్పందం చేసుకున్నామన్నారు. ఆప్కో, లేపాక్షిలో జవాబుదారీతనం, పారదర్శకతను బలోపేతం చేయడం, లాభాల బాటలో పయనించేలా చేయడం ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యం అన్నారు. పబ్లిక్-ప్రైవేటు- పార్టనర్ షిప్ (పీపీపీ మోడల్ ద్వారా ఇతర రాష్ట్రాల్లో లేపాక్షి షోరూమ్లను ఏర్పాటు చేయబోతున్నామని మంత్రి సవిత తెలిపారు.
స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా మాట్లాడుతూ చేనేత జౌళి శాఖలను బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు పలు సూచనలు, ఆదేశాలు జారీచేసినట్లు తెలిపారు. విద్యుత్ మగ్గాలు, పలు కంపెనీలు రావడం వల్ల రాష్ట్రంలోని నేత కార్మికులు, హస్తకళాకారులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా వారిని ఆదుకోవాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉన్నట్లు ఆయన తెలిపారు. ఆ దిశలో నేతకార్మికుల కష్టానికి తగ్గట్టుగా వారికి ఆదాయం ఉండాలనే లక్ష్యంతో వేతనాలు, ప్రాసెసింగ్ చార్జీలు పెంచేందుకు రాష్ట్ర స్థాయి కమిటీని నియమించి, ఆ కమిటీ సూచనలు మేరకు తగు చర్యలు తీసుకున్నామన్నారు.
ఆప్కో, లేపాక్షి మేనేజింగ్ డైరెక్టర్ విశ్వ మాట్లాడుతూ ఐఐఎమ్, ఎన్ఐడీ`ఏపీతో తమ సంస్థ ఒప్పందం కుదుర్చుకుందని తెలిపారు. ఆప్కో నష్టాల నియంత్రణ, ఉత్తమ ఆర్థిక నిర్వహణపై ఐఐఎమ్ అధ్యయనం చేస్తుందని తెలిపారు. పీపీ విధానంలో లేపాక్షి షోరూమ్ల విస్తరణపై కూడా అధ్యయనం చేస్తుందని తెలిపారు. ప్రస్తుతం ఆప్కో కి 93, 19 లేపాక్షి కి 19 షోరూమ్లు ఉన్నాయన్నారు. ఒక సంస్థ ఉత్పత్తులు మరో సంస్థ షోరూముల్లో అందుబాటులో ఉండే విధంగా కుడా ఒప్పందం చేసుకున్నామని ఆయన తెలిపారు.