- పల్నాడు జిల్లాలో మరో రెండు గిరిజన గురుకులాలు
- ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్
నరసరావుపేట (చైతన్యరథం): గిరిజన విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. రానున్న ఏడాది కాలంలో పల్నాడు జిల్లాలో మరో రెండు గురుకులాలు అందుబాటులోకి రానున్నట్లు పేర్కొన్నారు. నాణ్యమైన విద్యను పిల్లలకు అందిస్తేనే వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. బుధవారం నాడు మంత్రులు గొట్టిపాటి రవికుమార్, గిరిజన సంక్షేమ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పల్నాడు జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా నరసరావుపేట నియోజకవర్గంలోని పెద్దతురకపాలెంలో మొత్తం రూ.9.40 కోట్లతో నిర్మించిన అభివృద్ధి కార్యక్రమాలను మంత్రులు ప్రారంభించారు. రూ.8.20 కోట్లతో నిర్మించిన గిరిజన గురుకుల పాఠశాలను మంత్రులు గొట్టిపాటి, సంధ్యా రాణి, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు ప్రారంభించారు. అనంతరం పెద్దతురకపాలెం నుంచి గురుకులానికి రూ.1.20 కోట్లతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. అనంతరం మంత్రులు ఆశ్రమ పాఠశాలలోని వసతి గృహాలు, వంటశాల, తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థుల భవిష్యత్తు మెరుగుపరచాలన్నదే తమ సంకల్పమని, ప్రభుత్వం గిరిజన విద్యార్థులకు అన్ని విధాలా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట శాసనసభ్యులు అరవింద్ బాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు.