- ఏడాది ముందు ప్రజారోగ్య రంగంలో అన్నీ ప్రతికూల పరిస్థితులే
- నేడు భారీగా పెరిగిన వైద్య సిబ్బంది హాజరు, ఓపీ, ఐపీ సేవలు
- ఆరోగ్యాంధ్రప్రదేశ్ దిశగా వడివడిగా అడుగులు
- డిజిటల్ ఆరోగ్య సేవలు, ఎన్ఫోర్స్మెంట్పై దృష్టి
విజయవాడ (చైతన్యరథం): ఏడాది క్రితం అధికారంలోకొచ్చినప్పుడు గత ప్రభుత్వ నిర్వాకాలతో ప్రజారోగ్య రంగంలో నెలకొన్న ప్రతికూల పరిస్థితుల్ని అధిగమిస్తూ ఈ రంగంలో రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం గణనీయమైన మార్పు తేగలిగిందని వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. ఈనెల 12 నాటికి కూటమి ప్రభుత్వం ఏడాది కాలం పూర్తి చేసుకోనున్న సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రజారోగ్య రంగాన్ని గాడిలో పెట్టడానికి ఏడాదిగా వైద్యారోగ్య శాఖ చేసిన ప్రయత్నాల్ని, సాధించిన ఫలితాల్ని అంకెలతో సహా వివరించారు.
ఏడాది కాలంగా వైద్య సిబ్బందిలో క్రమశిక్షణ, జవాబుదారీతనాన్ని పెంచడానికి, కుంటుపడిన ప్రధాన ఆరోగ్య కార్యక్రమాల అమలులో వేగం పెంచి సత్ఫలితాల్ని సాధించడానికి, మౌలిక సదుపాయాల కల్పనకు, రోగ నిర్ధారణ పరీక్షల సామర్థాన్ని పెంచేందుకు, డిజిటల్ ఆరోగ్య సేవల్ని ప్రజలకందించడానికి కృషి చేసినట్లు మంత్రి వివరించారు.
మార్పునకు కేంద్రం గుర్తింపు
2024-25 సంవత్సరంలో కూటమి ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ కింద 30కి పైగా పథకాల్ని అమలు చేసిన తీరు, సాధించిన ఫలితాల్ని గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రూ.100 కోట్లను ప్రోత్సాహక బహుమతిగా విడుదల చేసిందని మంత్రి తెలిపారు. ఈ గుర్తింపు ప్రజారోగ్యం పట్ల కూటమి ప్రభుత్వ నిబద్ధత, పథకాల అమలులో అవలంబించిన భిన్న వైఖరికి అద్దం పట్టిందని, గతేడాదిలో ప్రభుత్వం తెచ్చిన మార్పునకు ఇది సాక్షాత్కారమని మంత్రి స్రత్యకుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ ఐదేళ్ల కాలంలో రాష్ట్రానికి ఇలాంటి గుర్తింపు లభించలేదని, ప్రజారోగ్యం పట్ల ఈ రెండు ప్రభుత్వాల భిన్న వైఖరులకు ఇదే నిదర్శనమని ఆయన అన్నారు.
ఇతర వ్యత్యాసాలు
గ్రామ స్థాయిలో ప్రజలకు ఆరోగ్య సేవలందించడానికి ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచనల మేరకు దేశవ్యాప్తంగా గ్రామాల్లో ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల నిర్మాణాన్ని చేపట్టారని, ఇందులో భాగంగా గత ప్రభుత్వం 3,000లకు పైగా ఈ మందిరాల్ని నిర్మించిందని, దీనికి భిన్నంగా కూటమి ప్రభుత్వం ఏడాదిలోనే 3,318 భవనాల నిర్మాణాలకు కేంద్ర అనుమతి పొంది రూ.1,065 కోట్లతో నిర్మాణాలకు శ్రీకారం చుట్టిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ప్రజారోగ్యానికి మేలు చేసే క్రిటికల్ కేర్ బ్లాకులు గత ప్రభుత్వ హయాంలో 14 మాత్రమే మంజూరు కాగా, కూటమి ప్రభుత్వం అదనంగా మరో 10 సాధించిందని మంత్రి తెలిపారు. ఈ విషయంలో గత ప్రభుత్వం రాష్ట్ర వాటా నిధుల్ని విడుదల చేయకుండా నిర్లక్ష్యం చేసిందని, ఈ బ్లాకులపై ఇప్పటి వరకు అయిన రూ.90 కోట్ల ఖర్చులో కూటమి ప్రభుత్వం గత ఏడాదిలోనే రూ. 62 కోట్లు ఖర్చు చేసి తన విశిష్టతను చాటుకుందని మంత్రి వివరించారు.
రోగ నిర్ధారణ పరీక్షల సామర్థ్యం పెంపు
రోగ నిర్ధారణ పరీక్షల సామర్థ్యాన్ని పెంచే దిశగా కూటమి ప్రభుత్వం చేపట్టిన చర్యల్ని మీడియాకు మంత్రి సత్యకుమార్ యాదవ్ వివరించారు. గత ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో కేవలం 13 ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ లేబరేటరీల్ని ఏర్పాటు చేసే ప్రయత్నం చేయగా, కూటమి ప్రభుత్వ ఒక ఏడాదిలోనే అటువంటి మరో 13 కేంద్రాల్ని ఏర్పాటు చేసిందని మంత్రి తెలిపారు. సర్వజనాసుపత్రుల్లో ఈ సామర్థ్యాన్ని పెంచేందుకు కూటమి ప్రభుత్వం గత ఏడాదిలో 3,200లకు పైగా ఆధునిక పరీక్షా పరికరాల్ని ఏర్పాటు చేసిందని ఆయన చెప్పారు.
రోగ నిర్ధారణ పరీక్షల్ని ప్రజల ఇంటి వద్దే చేసే దిశగా కూటమి ప్రభుత్వం ప్రభావవంతమైన చర్యలు చేపట్టిందని, ఇందులో భాగంగా 104 సంచార వైద్య వాహనాల ద్వారా ఇళ్ల వద్దనే 47 పరీక్షలు చేస్తారని, ఈ దిశగా పైలెట్ ప్రాజెక్టు అమలు చేయబోతున్నామని మంత్రి స్రత్యకుమార్ యాదవ్ తెలిపారు.
రోగాల నివారణ దిశగా కృషి
రోగాల అనంతరం చికిత్స కంటే రోగాల నివారణ ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చన్న ఆలోచనతో రోగుల మరణాలకు ప్రధాన కారణమవుతున్న క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధుల నివారణకు కూటమి ప్రభుత్వం చేపట్టిన చర్యల్ని మంత్రి తెలిపారు. అదే రీతిన నవ సమాజ స్థాపనకు ప్రధాన కారకులయ్యే స్కూలు విద్యార్థుల ఆరోగ్య సమస్యల్ని ముందుగానే గుర్తించి తగు నివారణ చర్యల్ని చేపట్టేందుకు రాష్ట్ర వ్యాప్తంగా స్క్రీనింగ్ చేపట్టామని, ఈ కార్యక్రమాలు మంచి ఫలితాల్నిస్తున్నాయని మంత్రి వివరించారు.
కూటమి ప్రభుత్వం తెచ్చిన మార్పునకు ఇతర నిదర్శనాలు
గతేడాదిగా వైద్య రంగంలో కూటమి ప్రభుత్వం చేసిన కృషి వలన వచ్చిన మార్పునకు సంకేతంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈ కింది వివరాల్ని ఉదహరించారు.
1) ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య సిబ్బంది హాజరు 2023-24లో నమోదైన దానికంటే గతేడాదిలో 7.42 శాతం నుండి 14.20 శాతానికి పెరిగింది.
2) సిబ్బంది హాజరు మెరుగవడంతో ఓపీ సేవలు 8 శాతం మేరకు, ఐపి సేవలు 17.61 శాతం మేరకు పెరిగాయి
3) రోగ నిర్ధారణ పరీక్షల్లో 7.20 శాతం వృద్ధి నమోదైంది.
4) ఈ మార్పుల కారణంగా ప్రభుత్వాసుపత్రుల సేవల పట్ల ప్రజల్లో సానుకూల అభిప్రాయం భారీగా పెరిగినట్లు ఐవిఆర్ఎస్ సర్వేల్లో వెల్లడైంది
5) ప్రభుత్వ వైద్యులు, ఇతర సిబ్బంది కొరతను తగ్గించేందుకు కూటమి ప్రభుత్వం 8,619 నియామకాల్ని చేపట్టి 2,362 మంది వైద్యుల్ని, 209 మంది ఇతర సిబ్బందిని ఇప్పటికే నియమించింది
6) ఎన్సీడీ 3.0 సర్వేలో భాగంగా రాష్ఠ్రంలో 18 ఏళ్ల వయసుకు మించి ఉన్న 4.1 కోటి జనాభాలో 2.71 కోట్ల మందికి నోటి, రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్కు సంబంధించి స్క్రీనింగ్ పరీక్షలు చేశారు.
7) రాష్ట్రంలోని 69 లక్షల మంది స్కూలు విద్యార్థుల్లో 58 లక్షల మందికి వివిధ లోపాల్ని గురించి సర్వే చేశారు.
8) గుండె పోటు వచ్చిన వారికి అత్యంత కీలకమైన మొదటి గంటలో టెనెక్టిప్లేస్ అనే ఇంజక్షన్ ఇచ్చి స్టెమీ ప్రోగ్రాం కింద 2,650 మంది విలువైన ప్రాణాల్ని కాపాడగలిగాం.
గత ప్రభుత్వ వారసత్వం
గత ప్రభుత్వ నిర్వాకాలు, అక్రమాలతో గాడి తప్పిన ప్రజారోగ్య వ్యవస్థను వారసత్వంగా స్వీకరించిన కూటమి ప్రభుత్వం పైన వివరించిన మార్పులను సాధించడం విశేషమని మంత్రి వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ వైఖరి, హామీల డాంబికం..అమలులో డొల్లతనం అన్న రీతిగా సాగిందని, దీంతో పాటు కేంద్ర ప్రభుత్వ నిధుల దారి మళ్లింపు, రాష్ట్ర వాటా నిధుల్ని విడుదల చేయకపోవడం వంటి చర్యలతో ప్రజారోగ్య రంగం పలు సమస్యలపాలైందని మంత్రి సత్యకుమార్ యాదవ్ వివరించారు. రూ.8,400 కోట్ల ఖర్చుతో 17 ప్రభుత్వ వైద్య కళాశాలల్ని ఒకే సారి నిర్మిస్తామంటూ డ్రామాలు ఆడి, అధికారం నుండి వైదొలిగే నాటికి అందులో కేవలం 14 శాతం మాత్రమే ఖర్చు చేసిందని, అదే రీతిన రూ.12,000 కోట్ల ఖర్చుతో నాడు-నేడు కార్యక్రమంపై నానా హంగామా చేసి పదవి నుండి వైదొలిగే నాటికి అందులో కేవలం 17 శాతం మాత్రమే ఖర్చు చేసిందని మంత్రి వివరించారు.
ఈ విధంగా గత ప్రభుత్వం, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యం పట్ల అవలంబించిన భిన్న వైఖరులను వివరిస్తూ, ఏడాది కాలంలోనే కూటమి ప్రభుత్వం తెచ్చిన మార్పును సోదాహరణంగా వివరించారు.
ఈ విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ఆలోచనల మేరకు ఆరోగ్యాంధ్రప్రదేశ్ను సాధించే దిశగా పయనిస్తున్నామని, రానున్న కాలంలో డిజిటల్ ఆరోగ్య సేవలు, ఆహార పదార్థాలు, నాణ్యమైన మందుల్ని ప్రజలకు సరఫరా చేసేందుకు ఎన్ఫోర్స్మెంట్ యంత్రాంగాన్ని పటిష్టం చేసే విషయంపై దృష్టి సారిస్తామని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడిరచారు వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, కమిషనర్ డాక్టర్ జి.వీరపాండియన్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు