- అట్టహాసంగా మసులా బీచ్ ఫెస్టివల్ ప్రారంభోత్సవం
- తీరంలో కోలాహలంగా మొదలైన సంబరాలు
- ఆకట్టుకున్న అమరావతి ఐకానిక్ టవర్, 100 అడుగుల జాతీయపతాకం
మచిలీపట్నం (చైతన్యరథం): ఏపీలో బీచ్ టూరిజం అభివృద్ధికి కృషి చేస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మసూలా బీచ్ ఫెస్టివల్ ద్వారా అందుకు తొలి అడుగు వేశామని తెలిపారు. కృష్ణాజిల్లా మచిలీపట్నం సమీపంలోని మంగినపూడి తీరంలో ‘మసులా బీచ్ ఫెస్ట్-2025’ గురువారం అట్టహాసంగా ప్రారంభమైంది.
బీచ్ ఫెస్టివల్ను రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, రాష్ట్ర గనులు, భూగర్భవనరులు, ఎక్సైజ్ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు. ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు, శాసనసభ్యులు వర్ల కుమార్రాజా, కాగిత కృష్ణ ప్రసాద్, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, అధికారులు పాల్గొన్నారు. తొలుత బీచ్ ముఖ ద్వారం వద్ద ఏర్పాటు చేసిన గేట్ వే ఆఫ్ అమరావతి ఐకానిక్ టవర్ ని మంత్రులు ప్రారంభించారు. అనంతరం 100 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జ్యోతిప్రజ్వలనతో క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించారు. బీచ్ ఫెస్టివల్ కు పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలిరావటంతో మంగినపూడి తీరం జన సందోహంతో కిక్కిరిసింది. ఈ ఉత్సవాలను నాలుగు రోజులపాటు నిర్వహించనున్నారు. ఇందుకోసం అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు.
దక్షిణాదిలోనే పెద్దది: మంత్రి రవీంద్ర
ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ మచిలీపట్నం మంగినపూడి బీచ్లో ఇంత పెద్ద బీచ్ ఫెస్ట్ నిర్వహించడం గర్వంగా ఉందన్నారు. దక్షిణ భారత దేశంలోనే ఇది అతి పెద్ద ఫెస్ట్ అన్నారు. టూరిజం అభివృద్ధికి ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా అడుగులు వేస్తున్నాం. 2018లో బీచ్ ఫెస్టివల్ అత్యంత ఘనంగా నిర్వహించాం.. కానీ గత పాలకులు నాశనం చేశారు. బీచ్లోకి రావడానికి కూడా వీలు లేకుండా అడ్డుకున్నారు. ఏపీలో బీచ్ టూరిజం అభివృద్ధికి దీని ద్వారా తొలి అడుగు వేశాం. గేట్ వే ఆఫ్ అమరావతిగా బందరును మార్చేందుకు ఈ ఫెస్ట్ ద్వారా ముందుకుపోతాం. అమరావతిలోని అసెంబ్లీ నమూనాను ఫెస్టివల్కి వచ్చేవారికి కనువిందు చేసేలా ఏర్పాటు చేశాం. జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్యని స్మరించుకుంటూ.. అతి పెద్ద జాతీయ జెండా ఏర్పాటు చేసుకున్నాం. నాలుగు రోజుల పండుగలో అడ్వెంచర్ స్పోర్ట్స్, పారా గ్లైడిరగ్, బీచ్ కబడ్డీ, బీచ్ వాలీ బాల్, కయాకింగ్ సహా అనేక ఏర్పాట్లు చేశాం. దేశంలో అన్ని రుచులు ఒకే చోట అందించబోతున్నాం. స్వదేశీ దర్శన్ కింద నిధులు తీసుకొచ్చి టూరిజం అభివృద్ధికి అధికారులు సహకారం అందించాలి. హోటల్స్, రిసార్ట్ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చే వారికి ప్రభుత్వం అండగా ఉంటుంది. బందరు పోర్టు పూర్తి చేసి బందరు భవిష్యత్తుని మారుద్దాం. వేడుకలకు విచ్చేసిన వారికి మన ఆతిథ్యం ఎలా ఉంటుందో చూపిద్దామని మంత్రి కొల్లు రవీంద్ర పిలుపు ఇచ్చారు.
అద్భుత పర్యాటక కేంద్రంగా మంగినపూడి బీచ్: మంత్రి దుర్గేష్
మసులా బీచ్ ఫెస్టివల్ తో బందరు కొత్త రూపు సంతరించుకుందని, త్వరలో ఈ ప్రాంతాన్ని అద్భుత పర్యాటక కేంద్రంగా, సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక శ్రద్ధ వహిస్తామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడిరచారు. మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో పర్యాటక శాఖ, ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ, కృష్ణా జిల్లా అధికార యంత్రాంగం సంయుక్తంగా మచిలీపట్నం మంగినపూడి బీచ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్లీ కళా, సాంస్కృతిక వైభవం వెలుగొందేలా ‘మసులా బీచ్ ఫెస్టివల్ – 2025’ కు చేసిన ఏర్పాట్లు బాగున్నాయని ప్రశంసించారు. అంతేగాక అమరావతి ఐకానిక్ టవర్, అసెంబ్లీ ఆకారంలో తయారు చేసిన ముఖ ద్వారం (గేట్ వే ఆఫ్ అమరావతి) ఆకర్షణీయంగా ఉన్నాయన్నారు. వివిధ సముద్ర జీవుల్ని పోలిన ఆకారాలు, కయాకింగ్, కనోయింగ్ వంటి జలక్రీడలు, పారా గ్లైడిరగ్ తదితర గేమ్స్ ఆకట్టుకునే రీతిలో సందర్శకులను ఆకర్షించేలా ఏర్పాటు చేయించిన మంత్రి కొల్లు రవీంద్రను ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ కొనియాడారు. మసులా బీచ్ ఫెస్టివల్ మనసు దోచేలా ఉందన్నారు. రాష్ట్రంలో అన్ని బీచ్ ల గురించి మాట్లాడుతున్నారు.. అదే సందర్భంలో మంగినపూడి బీచ్ అభివృద్ధి గురించి మాట్లాడమని మంత్రి కొల్లు రవీంద్ర పలు సందర్భాల్లో తనను నిలదీశారని పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం మసులా బీచ్ ఫెస్టివల్కు మంత్రి కొల్లు రవీంద్ర అద్భుత ఏర్పాట్లు చేయడం ఆనందాన్నిచ్చిందన్నారు. సీఎం, డిప్యూటీ సీఎం, పీఎంల సహకారంతో మచిలీపట్నం బీచ్ను అద్భుత పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు.
రాష్ట్రానికి మరిన్ని పర్యాటక ప్రాజెక్టులు
ప్రపంచ పర్యాటకులను ఆకట్టుకునేలా కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో అఖండ గోదావరి, గండికోట పర్యాటక ప్రాజెక్టులను చేపట్టామని మంత్రి దుర్గేష్ అన్నారు. రాజమహేంద్రవరంలోని చారిత్రాత్మక హేవలాక్ వంతెనను ఆధునికీకరించి అద్భుతంగా తీర్చిదిద్దనున్నామన్నారు. బాపట్ల సమీపంలోని సూర్యలంక బీచ్ ను రూ.97 కోట్లతో అభివృద్ధి చేయనున్నామన్నారు. ఇటీవల న్యూఢల్లీిలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర షింగ్ షెకావత్ ను కలిసిన సందర్భంలో రాష్ట్రానికి మరిన్ని పర్యాటక ప్రాజెక్టులను కేటాయించేందుకు సుముఖంగా ఉన్నారన్నారు. దీనికి సంబంధించిన డీపీఆర్ లు సిద్ధం చేయమన్నారని తెలిపారు. అందులో ఒకటి మంగినపూడి ప్రాజెక్టు అని ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ తెలిపారు. ఈ అంశంలో పర్యాటక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్, ఎండీ సహకారం అందిస్తున్నారన్నారు.
పెట్టుబడులకు ఆసక్తి
పర్యాటక రంగానికి సీఎం చంద్రబాబునాయుడు పారిశ్రామిక హోదా కల్పించడంతో కూటమి ప్రభుత్వ ఏడాది కాలంలో ప్రఖ్యాత హోటల్స్, రిసార్ట్స్ రాష్ట్రానికి వచ్చాయని మంత్రి దుర్గేష్ వివరించారు. పారిశ్రామిక రంగానికి ఇచ్చే ప్రోత్సాహకాలు, రాయితీలన్నీ పర్యాటక రంగానికి ఇస్తామని చెప్పడంతో పెట్టుబడులకు పలువురు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారన్నారు. ఇప్పటికే విశాఖపట్నం, విజయవాడ, ఢల్లీిలో ఇన్వెస్టర్స్ సమ్మిట్లు నిర్వహించామన్నారు. రాష్ట్రానికి విశాల సముద్రతీరం, ప్రకృతి సౌందర్య ప్రాంతాలు, చారిత్రాత్మక ప్రదేశాలు, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఉన్నాయని ఇన్వెస్టర్లకు వివరించామన్నారు. తద్వారా 15కు పైగా ప్రసిద్ధ హోటల్స్ తో అతిథ్య రంగంలో పెట్టుబడులకు ఎంవోయూలు చేసుకున్నామన్నారు. రాబోయే రోజుల్లో పీపీపీ విధానంలో అన్ని పర్యాటక ప్రాంతాల్లో అందమైన హోటల్స్, రిసార్ట్స్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. భారతదేశంలోని అన్ని రాష్ట్రాల క్రీడాకారులను ఇక్కడికి రప్పించిన ఘనత మంత్రి కొల్లు రవీంద్రకే దక్కుతుందన్నారు. పింగళి వెంకయ్య చేత రూపకల్పన చేయబడిన మువ్వన్నెల జెండాను 100 అడుగుల ఎత్తు ఏర్పాటు చేసిన ఘనత, తద్వారా దేశభక్తిని కల్గించిన ఘనత మంత్రి కొల్లు రవీంద్రదే అన్నారు. ప్రతి ఒక్కరిలో జాతీయ భావం పెంపొందేలా ఆపరేషన్ సింధూర్ లో వినియోగించిన డ్రోన్ల మిషనరీ మోడల్ ప్రదర్శన ఏర్పాటు అద్భుతం అన్నారు.ఈ సందర్భంగా ఇంత మంచి కార్యక్రమంలో పాలు పంచుకునే అవకాశం కల్పించినందుకు గర్వంగా ఉందన్నారు.