- మరింత ఉజ్వలంగా సంస్థ భవిష్యత్
- విద్య, ఐటీశాఖల మంత్రి లోకేష్ ఆకాంక్ష
- 34వ ఫౌండేషన్ డేలో ప్రత్యేక అతిథిగా పాల్గొన్న మంత్రి
- పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్క నాటిన యువనేత
అమరావతి (చైతన్యరథం): దృఢమైన నాయకత్వం, విలువలతో రాజీపడని వైఖరితో హెరిటేజ్ సంస్థ ప్రస్థానం మరింత విజయవంతంగా సాగాలని విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ ఆకాంక్షించారు. హెరిటేజ్ సంస్థ 34వ ఫౌండేషన్ దినోత్సవానికి గురువారం ప్రత్యేక అతిథిగా మంత్రి లోకేష్ హాజరయ్యారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్క నాటారు. అనంతరం ఎక్స్లో తన ఆనందాన్ని పంచుకున్నారు. హెరిటేజ్ ఫౌండేషన్ దినోత్సవానికి ప్రత్యేక అతిథిగా హాజరు కావడం గౌరవంగా భావిస్తున్నానన్నారు. దార్శనిక ముఖ్యమంత్రి చంద్రబాబు స్థాపించిన హెరిటేజ్ ఫుడ్స్.. ఇటు రైతులకు సాధికారత కల్పిస్తూ.. అటు వినియోగదారులకు అందుబాటు ధరలతో గేమ్-ఛేంజర్గా నిలిచింది. ఈ సంస్థ పూర్వ ఉద్యోగిగా చెప్పుకోవడం గర్వంగా భావిస్తున్నాను. నా పాత స్నేహితులు, సహోద్యోగులతో తిరిగి కలవటం ఆనందంగా ఉంది. ఈ సంస్థను నడిపిస్తున్న బలమైన నాయకత్వం, అత్యున్నత విలువలు నాకు ఇప్పటికీ ఉత్తేజం కలిగిస్తున్నాయి. వారి అంకితభావానికి బృందానికి అభినందనలు. నమ్ముకున్న విలువలతో రాజీ పడకుండా హెరిటేజ్ సంస్థ అభివృద్ధిలో దూసుకెళుతూ మన దేశ వృద్ధికి కూడా గణనీయంగా దోహదపడుతుందని నేను విశ్వసిస్తున్నాను. హెరిటేజ్ భవిష్యత్ మరింత ఉజ్వలంగా వెలగాలని కోరుకుంటున్నాను. ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజున జరిగిన ఈ కార్యక్రమాన్ని మరింత ప్రత్యేకంగా, చిరస్మరణీయంగా ఉంచుకునేందుకు తాను ఒక మొక్కను నాటానని ఎక్స్లో మంత్రి లోకేష్ పేర్కొన్నారు.