- ‘మార్గదర్శి’ నమోదు ప్రక్రియ వేగవంతం చేయండి
- అధికారులకు లక్ష్యం నిర్దేశించిన సీఎం చంద్రబాబు
- రాజధాని భూసేకరణ పీ4కు కేస్ స్టడీగా పేర్కొన్న సీఎం
- ఇప్పటివరకు 70 వేల కుటుంబాలకు పీ`4 సాయం
అమరావతి (చైతన్య రథం): జీరో పావర్టీ పీ`4 లక్ష్యంలో భాగంగా ఈ ఏడాది ఆగస్ట్ 15నాటికి రాష్ట్రంలో 15 లక్షల కుటుంబాలను మార్గదర్శులు దత్తత తీసుకునేలా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఇందుకు అవసరమైన మార్గదర్శి రిజిస్ట్రేషన్, దత్తత ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. నాడు ఆర్థిక సంస్కరణల తర్వాత చేపట్టిన పీపీపీ విధానానికి కొనసాగింపుగానే నేడు పీ`4 విధానం తీసుకువచ్చామన్నారు. బుధవారం ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో జీరో పావర్టీ పీ`4పై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి… స్మార్ట్ ఏపీ ఫౌండేషన్ను స్వర్ణాంధ్ర పీ`4 ఫౌండేషన్గా మార్చాలని నిర్దేశించారు. అమరావతి పీ`4కి కేస్ స్టడీగా నిలుస్తుందని, రాజధాని నిర్మాణంలో 29 వేలమంది రైతులను భాగస్వాములు చేయడం ద్వారా వారికి సంపద సృష్టి జరిగేలా చేశామని గుర్తు చేశారు. ఇదే స్ఫూర్తితో ప్రతి బంగారు కుటుంబాన్ని మార్గదర్శి దత్తత తీసుకుని వారి ఉన్నతికి కృషి చేసేలా చూడాలన్నారు. ప్రతి 10 రోజులకు ఒకసారి పీ`4 పురోగతిని సమీక్షిస్తానని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మరోవైపు అధికారులు రూపొందించిన పీ`4 లోగో డిజైన్లను ముఖ్యమంత్రి పరిశీలించారు.
పీ`4కు భాగస్వాముల సహకారం
పీ`4 కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపించేందుకు మిలాప్, ప్రాజెక్ట్ డీప్, రంగ్దే, భార్గోవంటి సంస్థలు భాగస్వాములుగా సహకారం అందించేందుకు ముందుకువచ్చినట్టు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. రాష్ట్రంలో 19,15,771 బంగారు కుటుంబాలుగా నమోదు కాగా… వీరిలో ఇప్పటివరకు 70,272 కుటంబాలను మార్గదర్శులు దత్తత తీసుకున్నారని వివరించారు. వీరిలో అత్యధికంగా 26,340 బీసీ కుటుంబాలు, 14,024 ఎస్సీ కుటుంబాలు, 13,115 ఎస్టీ కుటుంబాలు ఉన్నాయని తెలిపారు.