- లబ్ధిదారులను ఆత్మీయంగా పలకరించిన హోం మంత్రి అనిత
- లబ్ధిదారుల యోగక్షేమాలు తెలుసుకుంటూ పింఛన్ల పంపిణీ
- సీఎం చంద్రబాబు హామీలన్నీ అమలు చేస్తున్నారని స్పష్టీకరణ
నక్కపల్లి (చైతన్యరథం): ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటినీ సీఎం చంద్రబాబు ఒక్కొక్కటిగా నేరవేరుస్తున్నారని హోం మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలోని నక్కపల్లి మండలం ఉద్ధండపురం గ్రామంలో శనివారం హోం మంత్రి వంగలపూడి అనిత పర్యటించారు. గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తరువాత గ్రామంలో ఇంటింటికీ వెళ్లి పింఛన్లను పంపిణీ చేశారు. గ్రామస్థులతో మాట్లాడి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఇటీవలే ఆపరేషన్ చేయించుకున్న టీడీపీ కార్యకర్త ఆవాల నాగేశ్వరరావును పరామర్శించారు. అనంతరం గోవింద్ ఇంటికి వెళ్లిన మంత్రి అనిత.. స్వయంగా టీ కాచి, ఆయన కుటుంబ సభ్యులకు అందించారు. ఈ సందర్బంగా, రెండో విడత ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా హోం మంత్రి అనిత మాట్లాడుతూ ప్రజలు పెట్టిన భిక్షతోనే తాను ప్రజలకు సేవ చేస్తున్నాన్నారు. 1వ తేదీ ఆదివారం సెలవు కావడంతో, ఒకరోజు ముందుగానే పింఛన్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. పాయకరావుపేట పట్టణంలో అన్న క్యాంటీన్కి శంకుస్థాపన చేశామని, త్వరలో నక్కపల్లి ప్రభుత్వ హాస్పటల్ వద్ద కూడా అన్న క్యాంటీన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. జూన్ నెల నుంచి తల్లికి వందనం పథకం అమలులోకి వస్తుందని, మహిళలకు ఉచిత బస్సు పథకం ఆగస్టు 15న ప్రారంభం కానుందని చెప్పారు. నియోజకవర్గంలో తాగు, సాగునీటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. గ్రామాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో నిరుద్యోగ యువతకు లక్ష ఉద్యోగావకాశాలు అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కష్టాల్లో ఉన్నా, ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామన్నారు.
ఉద్ధండపురం జాతీయ రహదారిపై జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణ కోసం సీసీ కెమెరాలు, స్టాప్ బోర్డ్స్ ఏర్పాటు చేయాలని అధికారులను హోం మంత్రి అనిత ఆదేశించారు.