- ఆత్మకూరు నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందజేత
ఆత్మకూరు (చైతన్యరథం): రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం సామాజిక పింఛన్లను పెంచి అందజేస్తూ పేదలను ఆదుకుంటున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామానారాయణ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో పండుగ వాతావరణంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. సంగం మండలం వీర్లగుడిపాడు గ్రామంలో అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పింఛన్లు పంపిణీ చేశారు. అంతకుముందు స్థానిక ప్రజా ప్రతినిధులు, గ్రామస్థులు మంత్రికి మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. వీర్లగుడిపాడు గ్రామంలో లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేసిన మంత్రి ఆనం.. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ ఒకటో తేదీ ఆదివారం సెలవు కావడంతో ఒకరోజు ముందుగానే పింఛన్లు అందిస్తున్నామన్నారు. పేదల పట్ల తమ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనం అన్నారు. సచివాలయ సిబ్బంది, అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కలిసి లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి పింఛన్లను అందజేస్తున్నారు. భారత దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా నెలకు రూ.4 వేల రూపాయల చొప్పున సామాజిక పింఛన్లు కచ్చితంగా 1వ తేదీనే పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే. సీఎం చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం.. వృద్ధులకు రూ.4వేలు, వికలాంగులకు రూ.6వేలు, కిడ్నీ ఇతర వ్యాధిగ్రస్తులకు 10వేలు, పూర్తిగా మంచానికే పరిమితమైన వారికి రూ. 15 వేలు చొప్పున పింఛన్లు అందిస్తూ ఆ కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. జూన్ 12 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నూతన పింఛన్లను మంజూరు చేస్తున్నాం. రాష్ట్రంలో 74,600 మందికి, నెల్లూరు జిల్లాలో 3,492, ఆత్మకూరు నియోజకవర్గంలో 480 మందికి నూతనంగా పింఛన్లు మంజూరు చేస్తున్నాం. ఎన్టీఆర్ సామాజిక భరోసా పింఛన్లకు సంవత్సరానికి 33,600 కోట్లు ఖర్చు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అపార అనుభవం… పరిపాలనా దక్షతతో రాష్ట్రాన్ని గాడిలో పెడుతూ పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కొనియాడారు.