అమరావతి (చైతన్యరథం): యోగాంధ్ర కార్యక్రమంలో భాగస్వాములయ్యేందుకు నమోదు చేసుకునే వారి సంఖ్య పది రోజుల్లోనే లక్ష్యసాధనలో సగానికి పైగా దాటింది. ఈ కార్యక్రమంలో 2 కోట్ల మందిని భాగస్వాములను చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా శుక్రవారం నాటికే ఇందులో పాల్గొనేందుకు సుముఖత వ్యక్తం చేస్తూ కోటిమందికి పైగా తమ పేర్లను నమోదు చేసుకున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21 నాటికి 2 కోట్ల లక్ష్యాన్ని చేరుకుంటామని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రారంభించిన ‘యోగాంధ్ర’ ప్రచార కార్యక్రమానికి ప్రజల నుండి రోజురోజుకూ పెరుగుతున్న స్పందనతో మొదటి 10 రోజుల్లో కోటి మందికి పైగా యోగా ఔత్సాహికులు పాల్గొనడానికి తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ప్రభుత్వం నెల రోజుల పాటు నిర్వహించే యోగాంధ్రలో 2 కోట్ల రిజిస్ట్రేషన్ల లక్ష్యానికి గాను, శుక్రవారం రాత్రికి సగం మార్కును దాటి 1,13,47,935 మంది స్వచ్ఛందంగా నమోదు చేసుకున్నారని వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, యోగాంధ్ర రాష్ట్ర నోడల్ అధికారి ఎంటీ కృష్ణబాబు శుక్రవారం రాత్రి మంత్రుల కమిటీకి నివేదించారు.
మే 21 నుండి మే 30 వరకు మొదటి 10 రోజులకు 69,92,478 నమోదు చేసుకోవాలని లక్ష్యాన్ని నిర్ణయించుకోగా, వాస్తవ రిజిస్ట్రేషన్లు 162 శాతం మేర పూర్తయ్యాయని కృష్ణబాబు నివేదించారు. ఈ కాలంలో మాస్టర్ ట్రైనర్ల నమోదు 408 శాతం కాగా, శిక్షకుల నమోదు 113 శాతం మేర జరిగిందని తెలిపారు. జిల్లా స్థాయిలో అధికారిక యంత్రాంగం కృషితో పాటు యోగాపై ప్రజల్లో పెరుగుతున్న ఆసక్తి, ఉత్సాహభరితమైన ప్రతిస్పందన ద్వారా ఇది సాధ్యమైందన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ముందు రాష్ట్రవ్యాప్తంగా యోగా అవగాహన కార్యక్రమాలు పెద్ద ఎత్తున కొనసాగిస్తున్నారు. జూన్ 21న విశాఖపట్నంలోని ఆర్కె బీచ్ నుండి భీమిలి బీచ్ వరకు జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రదర్శనలో భారీయెత్తున ప్రజలు భాగస్వాములవుతారని భావిస్తున్నట్లు ఆయన వివరించారు. విశాఖపట్నంలో నిర్వహించనున్న ఈ ప్రధాన కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిధిగా హాజరవుతారని ఆయన తెలిపారు.