- 15,000 మందికి పైగా బదిలీకి అవకాశం
- రెండేళ్ల తర్వాత ప్రక్రియపై సర్వత్రా ఆసక్తి
- ఒకే చోట ఐదేళ్లుగా చేస్తున్న వైద్యులకు తప్పనిసరి
- బదిలీ నిర్ణయాలపై శాఖాధిపతులే బాధ్యులు
అమరావతి(చైతన్యరథం): వైద్య ఆరోగ్య శాఖలో సాధారణ బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వివిధ కేడర్లలో వైద్యులు, పారా మెడికల్, ఇతర విభాగాల ఉద్యోగుల బదిలీలపై శనివారం రాత్రి ఉత్తర్వులు వెలువడ్డాయి. బదిలీల విషయంలో అనుసరించాల్సిన ప్రత్యేక విధివిధానాలు ప్రకటించడంతో ఈ ప్రక్రియ మొదలైంది. ఆదివారం నుంచి 20 రోజుల్లో బదిలీల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. లక్షకు పైగా సిబ్బంది కలిగిన వైద్య ఆరోగ్యశాఖలో 15,000 మందికి పైగా రెగ్యులర్ సిబ్బంది బదిలీ అయ్యే అవ కాశముందని ఉన్నతాధికారుల అంచనా. రెండేళ్ల తర్వాత వైద్యఆరోగ్య శాఖలో సాధారణ బదిలీలు చేపడుతున్నందున అన్ని వర్గాల ఉద్యోగుల్లో ఆసక్తి, ఉత్కంఠ నెలకొంది.
విస్తృత చర్చల అనంతరం ప్రత్యేక నిబంధనలు
మే 15న ఆర్థిక శాఖ జారీ చేసిన సాధారణ బదిలీల మార్గదర్శకాలలో ప్రత్యేక అవసరాల దృష్ట్యా ఆయా మంత్రిత్వ శాఖలు కొన్ని ప్రత్యేక నియమాలు రూపొందించుకునేందుకు వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఉన్నతాధికారులతో విస్తృతంగా చర్చించి కొన్ని ప్రతిపాదనలను ముఖ్యమంత్రి ఆమోదం కోసం ప్రతిపాదించారు. తదనంతరం క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలు, పరిష్కార మార్గాలపై గత శుక్రవారం చర్చించాక శనివారం విధివిధానాలు విడుదల చేశారు.
ఈ విడత బదిలీల్లో ప్రత్యేకాంశాలు
దీర్ఘకాలంగా ఒకే చోట పనిచేస్తున్న పరిపాలనా సిబ్బంది పలు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒకే చోట మూడేళ్ల కంటే ఎక్కువకాలం పని చేస్తున్న పాలనా సిబ్బందిని వేరే ప్రదేశాలకు బదిలీ చేయడం ఈ విడత నిబంధనల్లో ప్రధానాంశం. ఇలా చేయడం ఇదే మొదటిసారి. అదే విధంగా ఒకే చోట మూడు నుంచి తొమ్మిదేళ్లుగా పనిచేస్తున్న గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులు అదే స్టేషన్లో వేరే కార్యాలయాలకు బదిలీ చేస్తారు. ఖాళీలు లేని పక్షంలో ఇతర ప్రదేశాలకు మారుస్తారు. ఈ బదిలీల్లో వివిధ కారణాలతో వేరే పోస్టుల్లో(మిస్మ్యాచ్) పనిచేస్తున్న వారిని సరైన పదవుల్లో నియమించడానికి ప్రాధాన్యతనిస్తారు. ఒకే చోట ఐదేళ్లకు పైగా పనిచేస్తున్న ఇతర సిబ్బందిని తప్పనిసరిగా బదిలీ చేస్తారు. అడిషన్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(ఏడీఎంఈ) స్థాయి వైద్యులను పరిపాలనా అవసరాలకనుగుణంగా మారుస్తారు.
స్పష్టత కోసం స్పెషల్ మెమో
ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల్లో జిల్లా కేంద్రాల్లోని అడ్మినిస్ట్రేటివ్ యూనిట్లలో పనిచేస్తున్న పాలనా సిబ్బందిని బదిలీ చేయాలనే సాధారణ ప్రస్తావన ఉంది. ఈ ప్రతిపాదన దుర్వినియోగమయ్యే అవకాశముందని మంత్రి సత్యకుమార్ యాదవ్ దృష్టికొచ్చింది. ఈ నేపథ్యంలో పాలనా సిబ్బంది బదిలీ కోసం పరిగణలోకి తీసుకోవాల్సిన కార్యాలయాలు (అడ్మినిస్ట్రేటివ్ యూనిట్లు), బదిలీ చేయవలసిన పాలనా సిబ్బంది స్థాయి వివరాలపై స్పష్టతనివ్వాలని మంత్రి ఆదేశించారు. ఈ మేరకు మంత్రిత్వ శాఖ వివరణాత్మక మెమో విడుదల చేస్తుంది.
ఇటీవల జరిగిన బదిలీలు
2023 నుంచి సాధారణ బదిలీలపై నిషేధం అమలులో ఉంది. ఈ కారణంగా జూన్ 2024 నుంచి వివిధ చోట్ల పనిచేస్తున్న దంపతులను ఒక చోటకు చేర్చడం, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ సిబ్బంది పనిచేసే చోట సరైన చికిత్స అందుబాటులో లేనిపక్షంలో తగిన చికిత్స లభించే చోటకు మార్చేందుకు మాత్రమే వీలుగా ముఖ్యమంత్రి ఆమోదంతో బదిలీలు జరిగాయి. అదే స్ఫూర్తితో సాధారణ బదిలీలపై మే 15న ఆర్థిక శాఖ నిషేధాన్ని ఎత్తివేసినప్పటి నుంచి ఆరోగ్య మంత్రి దాదాపు 30 బదిలీ అభ్యర్థనలను ఆమోదించారు. ఇవి మొత్తం చేపట్టనున్న బదిలీల్లో కేవలం 0.20 శాతం.
ఆరోగ్య మంత్రి ఆమోదించిన కొన్ని బదిలీల వివరాలు
కడప జిల్లాలోని ఒక ప్రాథమిక చికిత్సా కేంద్రంలో పనిచేస్తూ మార్చి నెలలో వివాహమైన 12 రోజుల్లోనే భర్తను కోల్పోయిన ఒక డాక్టర్ క్లిష్ట పరిస్థితుల్లో కుటుంబానికి దగ్గరగా ఉండేలా బదిలీ చేయాలని చేసుకున్న విన్నపం, రాయచోటిలో పనిచేస్తూ తీవ్ర కిడ్నీ వ్యాధితో బాధపడుతూ డయాలసిస్ సదుపాయమున్న చోటకు బదిలీచేయాలన్న ఒక సీనియర్ అసిస్టెంట్ అభ్యర్థన, ముదిరిన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ బదిలీ కోసం చేసిన మరో వైద్యుని విన్నపం, శ్రీకాకుళం జిల్లాలోని ఒక ప్రాథమిక చికిత్సా కేంద్రంలో డాక్టర్గా పనిచేస్తూ ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న భర్తకు దగ్గరగా ఉండేందుకు నెల్లూరు జిల్లాకు బదిలీ చేయాలన్న ఒక మహిళా వైద్యురాలి విన్నపం ఇలా పలు అభ్యర్థనలు వచ్చాయి.
శాఖాధిపతులే బాధ్యులుగా ఆదేశాలు
గతంలో జరిగిన సాధారణ బదిలీలపై వివిధ రకాల విమర్శలొచ్చిన నేపథ్యంలో ప్రస్తుత బదిలీల ప్రక్రయలో జిల్లా స్థాయి అధికారులు తీసుకునే నిర్ణయాల్ని మంత్రిత్వ శాఖలోని ఆయా విభాగాధిపతులు పర్యవేక్షించాలని మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు. శుక్రవారం జరిగిన సమావేశంలో కిందిస్థాయిలో బదిలీల విషయంలో ఏవైనా పొరపాట్లు జరిగితే వాటికి విభాగాధిపతులు బాధ్యత వహించాల్సి ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. గతంలో లేని విధంగా ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఉంటుందన్న ఆలోచనతో జిల్లా స్థాయి అధికారులు అప్రమత్తతతో వ్యవహరించేలా మంత్రి వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఆదివారం నుంచి ప్రారంభమైన బదిలీల ప్రక్రియలో బదిలీల ద్వారా భర్తీ చేయాల్సిన స్థానాల వివ రాలు ప్రకటించడం, బదిలీలు కోరుకునే వారు అభ్యర్థనలు దాఖలు చేసుకోవడం, అభ్యర్థుల సర్వీసు వివరాల పరిశీలన, సీనియారిటీ ఆధారంగా జాబితా ప్రకటన, అభ్యంతరాల నమోదు..వాటి పరిశీలన, నియమాలను బట్టి ఉన్నతాధికారుల నిర్ణయం కోసం ప్రతిపాదనలు పంపించడం, బదిలీల ఆదేశాలు జారీచేయానికి నిర్ధిష్ట కాలపరిమితులతో వైద్యారోగ్య మంత్రిత్వ శాఖ షెడ్యూల్ను రూపొందించింది.