అమరావతి (చైతన్యరథం): ఆపరేషన్ సిందూర్ లో భాగంగా జమ్మూకశ్మీర్ యుద్ధభూమిలో పోరాడుతూ మన రాష్ట్రానికి చెందిన మురళీ నాయక్ వీరమరణం పొందడం తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందని విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ విచారం వ్యక్తం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం గడ్డంతాండ పంచాయతీ కళ్లితాండా గ్రామానికి చెందిన మురళీ నాయక్ చూపిన ధైర్య,సాహసాలు రాష్ట్రానికే గర్వకారణమని కొనియాడారు. మురళీ నాయక్ పార్థివ దేహానికి రాష్ట్రప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిపిస్తామని, ఆయన కుటుంబానికి అన్నివిధాలా అండగా నిలుస్తామని మంత్రి లోకేష్ భరోసా ప్రకటించారు.