- ప్రధాని సభతో అనుమానాలన్నీ పటాపంచలు
- అమరావతి సభ సక్సెస్తో రాష్ట్రవ్యాప్తంగా సంతోషం
- రాబోయే కాలంలో ఏఐ, ఐటీ, క్యాంటం కంప్యూటింగ్లకు కేరాఫ్గా వర్థిల్లుతుంది
- ప్రధాన మంత్రే స్వయంగా సీఎం చంద్రబాబు పనితనానికి కితాబిచ్చారు
- మీడియాతో మంత్రి కొలుసు పార్థసారథి
అమరావతి (చైతన్యరథం): అమరావతి పునః ప్రారంభ సభ అంచనాలు మించి విజయవంతమయిందని, అందుకు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ సంతోషించారని సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖల మంత్రి కొలుసు పార్థసారధి తెలిపారు. విజయవాడలోని మంత్రి కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అమరావతిని దేవతల రాజధాని అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారన్నారు. దేవతలు సంచరించే చోట రాక్షసులు కూడా ఉండటం సహజమన్నారు. 5 కోట్ల మంది ఆంధ్రుల మద్దతు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఉందని మంత్రి స్పష్టం చేశారు. అమరావతిని భవిష్యత్తులో ఏఐ, ఐటీ, క్యాంటం కంప్యూంటింగ్లకు కేంద్రంగా వర్థిల్లేలా ముఖ్యమంత్రి అభివృద్ధి చేస్తారన్నారు. రూ. 58,000 కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాన మంత్రి వేదిక నుంచి ప్రారంభించారన్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తమ అనుభవంతో గాడిలో పెట్టగలరని ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం పేదల పక్షపాత ప్రభుత్వమన్నారు.
వైసీపీ నేతలు పశ్చాత్తాపం వ్యక్తం చేయాలి
ముఖ్యమంత్రి చంద్రబాబును చూసి స్ఫూర్తి పొందానని స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ అనటం ముఖ్యమంత్రి గొప్ప పనితనానికి నిదర్శనమన్నారు. దేశాన్ని గాడిలో పెట్టిన ఏకైక ప్రధాని మోదీ అన్నారు. పహల్గామ్ ఉగ్రదాడి విషయంలో ప్రధాన మంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు వెన్నుదన్నుగా నిలిచారన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లపాటు రాజధాని ప్రజలను నానా రకాలుగా ఇబ్బంది పెట్టి, అమరావతి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిందన్నారు. అమరావతిని భ్రమరావతి అని గత పాలకులు విమర్శలు చేశారన్నారు. అమరావతి పునః ప్రారంభానికి ఆహ్వానించినా వైసీపీ నేతలు రాలేదన్నారు. అమరావతి ప్రాధాన్యతను, అవసరాన్ని ఇప్పటికైనా వైసీపీ నేతలు గుర్తించాలన్నారు. అమరావతి పునః ప్రారంభ పనులు చాలా గొప్పగా మొదలయ్యాయన్నారు. అమరావతిపై విషం చిమ్మిన గత పాలకులు, స్వార్థపరులు ఇప్పటికైనా పశ్చాత్తాపం వ్యక్తం చేయాలన్నారు. అలా చేస్తే తెలుగు ప్రజలు క్షమించక పోయినా కనీసం దేవుడైనా వారిని క్షమిస్తాడేమోనన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తితోపాటు, పోలవరం` బనకచర్ల నదుల అనుసంధాన ప్రాజెక్టు కూడా సాధ్యమేనని ముఖ్యమంత్రి నిరూపించారన్నారు. దీనివల్ల రాష్ట్రంలో ఉన్న ప్రతి ఎకరాకు నీళ్లు అందిస్తారన్నారు.
యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించటమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. అమరావతి పునః ప్రారంభ సభకు వచ్చేందుకు వాహనాలు సరిపోక వేలాదిమంది ప్రజలు గ్రామాల్లోనే ఉండిపోయారన్నారు. సభలో చంద్రబాబు పనితీరుపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర అభివృద్ధిపై ఆయనకు ఉన్న కమిట్మెంట్ను తెలియజేస్తుందన్నారు. అమరావతి శక్తిని సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీ గుర్తించి కీర్తించారన్నారు. అమరావతి సభ సమయంలో అగ్ని ప్రమాదం వెనుక ఏదైనా క్నుట ఉంటే పోలీసుల విచారణలో బయటపడుతుందన్నారు. ప్రధాని మోదీ సభతో .. ఇప్పటి వరకు అమరావతి రాజధానిపై ఉన్న అనుమానాలు పటాపంచలు అయిపోయాయని, దీన్ని రాష్ట్ర ప్రజలతోపాటు అందరూ గుర్తించారన్నారు. అమరావతి అంటే గత ప్రభుత్వానికి కడుపు మంట అని ఎద్దేవా చేశారు. అమరావతికి చట్టబద్ధత కల్పించే అంశంపై కూటమి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని మంత్రి పార్థసారథి స్పష్టం చేశారు.