గాజువాక (చైతన్యరథం): కూటమి ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి కట్టుబడి ఉందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. మత్స్యకారుల సేవలో పథకం కింద గాజువాక నియోజకవర్గంలోని మత్స్యకారులకు సోమవారం పల్లా ఆర్థిక సాయం అందించారు. దిబ్బపాలెం, గంగవరం, జాలరిపల్లెపాలెం గ్రామాల్లో 530 మంది మత్స్యకార కుటుంబాలకు మొత్తం రూ.1 కోటి 6 లక్షల ఆర్థికసాయం చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ, మత్స్యకారులు సముద్రంలో వేట విరామ సమయంలో ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను తగ్గించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు చేపట్టిన ‘మత్స్యకారుల సేవలో’ పథకం ద్వారా నిబంధనల ప్రకారం ప్రతి మత్స్యకార కుటుంబానికి ప్రభుత్వం రూ.20,000 సాయం అందిస్తోందన్నారు. రాష్ట్రం మొత్తం 1,29,178 మత్స్యకార కుటుంబాలకు రూ.258 కోట్ల మేర లబ్ధి చేకూరనుందన్నారు. గాజువాక నియోజకవర్గంలోనూ 530 మంది మత్స్యకార కుటుంబాలు ప్రయోజనం పొందాయని చెప్పారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ప్రకారం మత్స్యకారుల ఆర్థిక సాయం మొత్తాన్ని రెండు రెట్లు పెంచడం ద్వారా కూటమి ప్రభుత్వం మాట తప్పని ప్రభుత్వంగా నిలిచిందన్నారు. మత్స్యకారుల జీవన ప్రమాణం మెరుగుపడేలా మరిన్ని కార్యక్రమాలు అమలు చేస్తామని పల్లా హామీ ఇచ్చారు.
గత ప్రభుత్వ హయాంలో వేట విరామ సమయంలో రూ.10,000 మాత్రమే అందించగా, నేడు దాన్ని రూ.20,000కి పెంచి మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం పెద్ద ఊరట కల్పించిందని పల్లా శ్రీనివాసరావు గుర్తు చేశారు. మత్స్యకారుల సంక్షేమం కోసం గతంలో చంద్రబాబు చేపట్టిన పథకాలను గుర్తుచేస్తూ, వచ్చే రోజుల్లో మరిన్ని ఫిషింగ్ హార్బర్లు, ల్యాండిరగ్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు. డీజిల్పై లీటర్కు రూ.9 సబ్సిడీ, వేట సమయంలో మత్స్యకారులకు ప్రాణ భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, మత్స్యకార సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలకు కృతజ్ఞతలు తెలుపుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు మత్స్యకారులు అభినందనలు తెలిపారు.