- అవకాశాలు కల్పిస్తున్నాం.. అందిపుచ్చుకోండి
- సంస్థలను స్థాపించే స్థాయికి యువత ఎదగాలి
- 2న ప్రధాని చేతుల మీదుగా రాజధాని పనుల పున:ప్రారంభం
- ఇక అమరావతి అన్స్టాపబుల్: సీఎం చంద్రబాబు
- విట్లో ‘వి లాంచ్పాడ్ 2025 -స్టార్టప్ ఎక్స్ పో’కు హాజరు
- క్యాంపస్లో పలు భవనాల ప్రారంభించిన చంద్రబాబు
అమరావతి (చైతన్య రథం): దేశ భవిష్యత్ యువత చేతిలోనే ఉందని, ప్రభుత్వం కల్పించే అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఉద్యోగంతోనే సంతృప్తి చెందకుండా, సంస్థలను స్థాపించే స్థాయికి యువత ఎదగాలన్నారు. మే 2న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా రాజధాని పనుల పున:ప్రారంభం కాబోతున్నాయని చెప్పారు. ఏపీని ఇన్నోవేషన్ వ్యాలీగా తీర్చిదిద్దుతున్నామని, క్వాంటమ్ వ్యాలీకి అమరావతి కేరాఫ్ అడ్రస్ కానుందన్నారు. విట్ వర్సిటీలో ‘వి లాంచ్పాడ్ 2025 -స్టార్టప్ ఎక్స్ పో’కు సీఎం చంద్రబాబు హాజరయ్యారు. క్యాంపస్లో మహాత్మాగాంధీ బ్లాక్, వి.వి.గిరి బ్లాక్, దుర్గాబాయి దేశ్ ముఖ్ బ్లాక్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి సీఎం చంద్రబాబు మాట్లాడారు.
విశ్వనాథన్తో నాది ప్రత్యేక అనుబంధం
‘విట్ అధినేత విశ్వనాథన్ సాధారణ వ్యక్తిగా జీవితం ప్రారంభించి అసాధారణ వ్యక్తిగా ఎదిగిన తీరు అభినందనీయం. 20 ఏళ్లు రాజకీయాల్లో ఉన్నారు. ఆ రోజుల్లో పార్లమెంటులో అన్నాదురైతో.. తర్వాత కరుణానిధి, ఎంజీఆర్, జయలలితతో పనిచేశారు. విశ్వనాథన్ 2014లో ఎన్నికల ఫలితాలు రాకముందే నన్ను కలిశారు. గెలిచిన వెంటనే అమరావతిలో విట్ ఏర్పాటుకు అనుమతి కోరారు. ఆ రోజు విట్ కోసం విశ్వనాథన్ 200 ఎకరాలు అడిగారు. నేను 100 ఎకరాలు ఇచ్చాను. వారికి కావాల్సిన మరింత భూమి ఇచ్చే బాధ్యత నాది. అయితే… రాబోయే ఏడేళ్లలో 50 వేలమంది స్టూడెంట్స్ విట్లో చదివేలా అభివృద్ధి చెందాలి. విట్ అమరావతిలో 95 శాతం ప్లేస్మెంట్స్ జరుగుతుండటం అభినందనీయం. ప్రపంచంలోని టాప్ 100 యూనివర్సిటీలో విట్ ఉండటం మనకు గర్వకారణం. విట్ విద్యాసంస్థల్లో మన అమరావతి విట్ నెంబర్వన్గా ఉండాలని నేను కోరుకుంటున్నాను’ అని సీఎం చంద్రబాబు అన్నారు.
అమరావతికి తిరుగులేదు
ప్రధాని మోదీ చేతుల మీదుగా రాజధాని పనులు పున:ప్రారంభమవుతాయి. నేను అందరిలా మాటలు చెప్పను. ప్రజలకు మంచి చేసి చూపిస్తాను. నాపై నమ్మకం పెట్టుకుని 29 వేలమంది రైతులు, 34 వేల ఎకరాల భూమి రాజధానికి ఇచ్చారు. అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతామని రైతులు ముందుకురావడం అభినందనీయం. 1991లో ఆర్థిక సంస్కరణలకు మన తెలుగుబిడ్డ పీవీ నరసింహారావు శ్రీకారం చుట్టారు. వాటిని నేను అందిపుచ్చుకున్నాను. భవిష్యత్ ఐటీదే అని గ్రహించి దానికి అధిక ప్రాధాన్యత ఇచ్చాను. 14 నెలల్లో హైటెక్ సిటీ నిర్మించాం. ఇప్పుడు రాజధాని అమరావతిపై దృష్టి కేంద్రీకరించాం. త్వరలో అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేయబోతున్నాం. సిలికాన్ వ్యాలీ తరహాలో అమరావతిలో క్వాంటమ్ వ్యాలీకి ఫౌండేషన్ వేస్తున్నాం. ఒకప్పుడు నేను ఐటీ గురించి మాట్లాడితే కొందరికి అర్ధం కాలేదు. ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటర్ గురించి మాట్లాడితే అది ఏం చేస్తుందంటున్నారు. ప్రతి ఇంట్లో ఎంట్రప్రెన్యూర్ తయారుకావాలి. అమరావతిలో విట్, ఎస్ఆర్ఎంవంటి విద్యాసంస్థలు ఇప్పటికే పనిచేస్తున్నాయి. భవిష్యత్లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన యూనివర్సిటీలు అమరావతికి రాబోతున్నాయి. 29 వేల మంది రైతులు, రైతు కూలీలు అమరావతికి సహకరించారు. వారందరినీ ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మాపై ఉంది. వారిలో కొందరిని దత్తత తీసుకోమని విట్ చాన్సలర్ జి విశ్వనాథన్ను నేను కోరాను అన్నారు.
నాసా నుంచి వాల్ స్ట్రీట్ వరకూ మనోళ్లే:
విద్యార్థులకు చదువు ముఖ్యం. చదువుతోనే విజ్ఞానం వస్తుంది. జ్ఞానాన్ని ఆచరణలో పెట్టాలంటే వినూత్నంగా ఆలోచించాలి. నాలెడ్జ్ ఎకానమీలో ప్రపంచవ్యాప్తంగా భారతీయులు ముందుంటే, అందులో తెలుగువారు ట్రెండ్సెట్టర్లుగా ఉన్నారు. మన తెలుగువారి జనాభా 5 శాతమే అయినప్పటికీ ఐఐటీల్లో 20 శాతం సీట్లు మనవాళ్లే సాధిస్తున్నారు. సిలికాన్ వ్యాలీనుంచి స్పేస్ ఎక్స్ వరకు, గూగుల్నుంచి మైక్రోసాఫ్ట్ వరకు, నాసానుంచి వాల్ స్ట్రీట్ వరకు అన్ని చోట్ల మన తెలుగువారే సత్తా చాటుతున్నారు. సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల, ఇంద్రానూయీ, అజయ్ బంగా, శాంతను నారాయణ్వంటి వారు గ్లోబల్ సంస్థల్ని బలోపేతం చేస్తుండటం మనకు గర్వకారణం అని చంద్రబాబు పేర్కొన్నారు.
ఎన్టీఆర్ స్పూర్తితో పీ4కు శ్రీకారం
సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు అని నినదించిన ఎన్టీఆర్ స్పూర్తితో పీ4కు శ్రీకారం చుట్టాం. సమాజంలో ఆర్థికంగా ఉన్నతంగా ఉన్న 10శాతం మంది ఆర్థిక ఇబ్బందులతో, పేదరికంలో అట్టడుగున ఉన్న 20శాతం కుటుంబాలను పైకి తీసుకురావాలి. 2029 నాటికి రాష్ట్రంలో పేదరికం అనే మాట వినపడకూడదు. పౌరుల ఇంటివద్దకే ప్రభుత్వ సేవలు అందించాలనే ఉద్దేశంతో వాట్సాప్ గవర్నెన్స్కు శ్రీకారం చుట్టాం. ఒకప్పుడు చిన్న పనికి కూడా ఎమ్మార్వో ఆఫీస్కి వెళ్లాల్సి వచ్చేది. గంటల తరబడి కార్యాలయాల దగ్గర పడిగాపులు పడాల్సి వచ్చేది. వాట్సాప్ గవర్నెన్స్ను వెయ్యి సేవలకు విస్తరిస్తాం అని చంద్రబాబు స్పష్టం చేశారు.
స్వర్ణాంధ్ర కల సాకారం చేస్తాం
ఏటా 15 శాతం వృద్ధి రేటుతో స్వర్ణాంధ్ర 2047 సాధించాలని నిర్ణయించాం. 2047 నాటికి తలసరి ఆదాయం రూ.55 లక్షలు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రధాని మోదీ వికసిత్ భారత్ 2047 ప్రణాళిక తయారు చేశారు. 2047 నాటికి ప్రపంచంలోనే భారత్ అగ్రస్థానంలో నిలుస్తుంది. టెర్రరిస్టుల కుట్రలు, కుయుక్తులు మనల్ని ఏం చేయలేవు. మన ఐక్యతను దెబ్బతీయలేవు. రాష్ట్రస్థాయిలో ప్రతి ఇంటిని జియో ట్యాగింగ్ చేస్తున్నాం. దీనివల్ల భవిష్యత్లో ఏదైనా విపత్తు వస్తే మందులు, ఆహారం డ్రోన్ల ద్వారా పంపవచ్చు అని చంద్రబాబు వివరించారు.
విశాఖకు త్వరలో మెట్రో రైల్
అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తున్నాం. విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా, తిరుపతిని ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దుతాం. విశాఖకు కొత్త ఎయిర్ పోర్టు, మెట్రోతోపాటు త్వరలో గూగుల్ రాబోతున్నది. ఇప్పటికే విశాఖలో స్టీల్ ప్లాంట్ ఉంది. అనకాపల్లిలో ఆర్సెల్లార్ మిట్టల్ స్టీల్ దిగ్గజ కంపెనీ రూ.లక్ష కోట్లతో పెట్టుబడులు పెడుతోంది. రాయలసీమలోనూ స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేపడతాం. అనంతపురంలో లేపాక్షి మొదలు ఓర్వకల్లు వరకూ నాలెడ్జ్ హబ్గా తయారుచేస్తాం. రాయలసీమను డిఫెన్స్, ఎలక్ట్రానిక్, ఆటో మొబైల్స్, డ్రోన్, శాటిలైట్ లాంచింగ్, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో అభివృద్ధి చేస్తాం. భవిష్యత్ డ్రోన్లదే. ఓర్వకల్లులో డ్రోన్ సిటీ ఏర్పాటు చేస్తాం. మోదీ నాయకత్వంలో మేకిన్ ఇండియా కార్యక్రమం కింద 130 బిలియన్ యుఎస్ డాలర్లతో హార్డ్వేర్ రంగం అభివృద్ధి చెందుతోంది. భవిష్యత్లో 500 బిలియన్ యూఎస్ డాలర్ల విలువైన ఉత్పత్తులు తయారుచేసే స్థాయికి మన దేశం చేరుతుందని చంద్రబాబు వివరించారు.
విద్యార్థుల ప్రశ్నలకు సమాధానమిచ్చిన సీఎం
అమరావతిలో అభివృద్ధి పనులు, రాష్ట్రంలో కొత్త విద్యా సంస్థల ఏర్పాటు, ఐటీ, ఏఐ వినియోగంపై విట్ విద్యార్థులు పలు ప్రశ్నలు అడగ్గా ముఖ్యమంత్రి వాటికి సమాధానం చెప్పారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లడంతోపాటు పేదరికం రూపుమాపడం, యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టామని సీఎం చెప్పారు. ఎన్టీఆర్, అంబేద్కర్, కలామ్ వంటి వారంతా సాధారణ స్థాయినుంచి వచ్చినవారేనని మహనీయుల స్ఫూర్తితో యువత తాము ఎంచుకున్న మార్గంలో రాణించాలన్నారు. రాజకీయాలను తాను సేవా మార్గంలోనే చూశానని అన్నారు. రాత్రికి రాత్రే జాక్ పాట్ కొట్టేయాలనుకోవడం అత్యాశే అవుతుంది. జీవితంలో కష్టపడి అంచెలంచెలుగా ఎదిగిన వారికి తిరుగుండదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.