- మత్స్యకారుల జీవితాలు వృద్ధిలోకి తెస్తా
- సమస్యలు నేరుగా వినాలనే మీవద్దకొచ్చా
- త్వరలోనే ఫిషింగ్ హార్బర్ పూర్తి
- ఐస్ ఫ్యాక్టరీ సహా ఇతర సదుపాయాల కల్పన
- ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ
- బుడగట్లపాలెంలో మత్స్యకారులతో ముఖాముఖి
ఎచ్చెర్ల (చైతన్య రథం): ప్రభుత్వపరంగా మత్స్యకారుల సంక్షేమానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. మత్స్యకారుల జీవితాలు వృద్ధిలోకి తెచ్చేందుకు అన్నివిధాలా కృషి చేస్తానన్నారు. ‘మత్స్యకారుల సేవలో’ పథకాన్ని ప్రారంభించేందుకు ఎచ్చెర్చ నియోజకవర్గంలోని బుడగట్లపాలెం వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. అక్కడ మత్స్యకారులతో సముద్రం ఒడ్డునే ముఖాముఖి నిర్వహించారు. తొలుత పోలేష్, రామలక్ష్మి దంపతులతో ముచ్చటిస్తూ.. మత్స్యకార కుటుంబాల సమస్యలపై ఆరా తీశారు. పోలేష్ మాట్లాడుతూ…. గ్రామంలో 600 కుటుంబాలు వేటపై ఆధారపడి జీవిస్తున్నాయని, సముద్రంలో అలల ఉధృతి సమయంలో బోట్లు తిరగబడి ప్రమాదాలకు గురవుతున్నామని సీఎంకు వివరించారు.
ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేస్తే వేట సులువవ్వడంతోపాటు ప్రమాదాలు తగ్గుతాయని వివరించారు. గత ప్రభుత్వంలో వలలు, మోటార్లు వంటివేమీ మత్స్యాకారులకు అందించలేదని సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ…. సమస్యలు నేరుగా వినేందుకే బుడగట్లపాలెం వచ్చానని, ఏంచేస్తే మీ జీవితాలు బాగుపడతాయో అడిగి తెలుసుకోవడానికే వచ్చానన్నారు. ‘మత్య్సకారుల సేవలో..’ పథకంలో భాగంగా రూ.20 వేలు ఆర్ధికసాయంగా వేట నిషేధ సమయంలో ఇస్తున్నామన్నారు. పిల్లల చదువులకు ఇబ్బంది లేకుండా వచ్చే నెలలోనే తల్లికి వందనం కింద రూ.15 వేల చొప్పున ప్రతి చదువుకునే బిడ్డకూ ఇస్తామన్నారు. త్వరలోనే ఫిషింగ్ హార్బర్ పూర్తి చేసి.. సమస్యలు పరిష్కరిస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.
ఐస్ ఫ్యాక్టరీ సహా వసతులు కల్పిస్తాం
అనంతరం మరో మత్య్సకార బృందం వద్దకు వెళ్లిన సీఎం చంద్రబాబు… కారి రాంబాబు, సీతోగ్య, ఎర్రయ్యతో మాట్లాడారు. అర్థరాత్రి పూట వేటకు వెళ్తామని, తిరిగి సురక్షితంగా వస్తామో రామో కూడా తెలియని పరిస్థితి అని మత్య్సకారులు వివరించారు. పట్టుకున్న చేపలు తీసుకొచ్చుకునేందుకు అవసరమైన సామాగ్రి, బాక్సులు కూడా లేవని, చిన్న పడవ కావడంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఫిషింగ్ హార్బర్ పూర్తి చేస్తే తమతోపాటు చుట్టు పక్కల గ్రామాల వారూ ఉపాధి పొందుతారని మత్య్సకారులు వివరించారు. బోట్లు అద్దెకు తీసుకున్న వారికే చేపలు విక్రయించడం వల్ల పడ్డ కష్టానికి ఫలితం దక్కడం లేదని అన్నారు. ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేస్తే మార్కెట్ ఏర్పాటవుతుందన్నారు.
అనంతరం సీఎం మాట్లాడుతూ… ఫిషింగ్ హార్బర్ పూర్తిచేసి, ఐస్ ఫ్యాక్టరీ సహా ఇతర అవకాశాలు కల్పిస్తే ఎంతమేర ఆదాయం పెరుగుతందని ప్రశ్నించారు. ఇప్పుడు వచ్చేదానికంటే అదనంగా 50శాతం వస్తుందని మత్య్సకారులు బదులిచ్చారు. మత్య్సకారులు ఎప్పుడూ టీడీపీకి అండగా ఉన్నారని, అందుకే మీకోసం ప్రత్యేకంగా పథకాలు ప్రవేశపెడుతున్నామని చంద్రబాబు వివరించారు. సమస్యలు నేరుగా తెలుసుకోవడానికి ముఖ్యమంత్రే తమ గ్రామానికి రావడం అదృష్టంగా భావిస్తున్నామని మత్స్యకారులు ఆనందంగా వివరిచారు.
ఆప్యాయంగా పలకరింపు
అనంతరం ఎండుచేపల వ్యాపారులు లక్ష్మమ్మ, సీతమ్మ, పైడమ్మ వద్దకు సీఎం చంద్రబాబు వెళ్లారు. ఏమ్మా బాగున్నారా? అంటూ ఆప్యాయంగా పలకరించారు. చేపలు ఎండబెట్టే విధానం, రోజువారీ ఆదాయం గురించి అడిగి తెలుసుకున్నారు. తర్వాత కమ్యూనిటీ హాల్కు చేరుకున్న సీఎం… చేపల బోట్లు మరమ్మతులు చేసే కార్మికులు మైలపల్లి పోతురాజు, కారి రాంబాబుతో కాసేపు సంభాషించారు. చేపలు నిల్వ చేసుకునే ఐస్ బాక్సులు, చేపలు పట్టే వలలను పరిశీలించి సమస్యలను తెలుసుకున్నారు.