- డబ్ల్యుఈఎఫ్ గ్లోబల్ యంగ్ లీడర్స్ జాబితాలో చోటు
- సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ అభినందనలు
- దార్శినికుడు చంద్రబాబు ఆలోచనలే నాకు స్ఫూర్తి: రామ్మోహన్నాయుడు
న్యూఢిల్లీ (చైతన్యథం): కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుకు ప్రతిష్టాత్మక గుర్తింపు లభించింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యుఈఎఫ్) రూపొందించిన గ్లోబల్ యంగ్ లీడర్స్ `2025 జాబితాలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడికి చోటు దక్కింది. ప్రపంచవ్యాప్తంగా తమ రంగాల్లో ఉత్తమ నాయకత్వం కనబరిచిన యువ నాయకులను వరల్డ్ ఎకనామిక్ పోరం ఎంపిక చేస్తుంది. ఈసారి భారత్ నుంచి ఏడుగురు ఎంపికయ్యారు. పరిపాలన, ప్రజాసేవలకు యంగ్ గ్లోబల్ లీడర్గా రామ్మోహన్నాయుడిని గుర్తింంచారు. దీనిపై రామ్మోహన్ నాయుడు స్పందిస్తూ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ద్వారా యంగ్ గ్లోబల్ లీడర్గా ఎంపిక కావడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. ముఖ్యమైన, ప్రభావితమైన నిర్ణయాలు తీసుకునే స్థానంలో భారత యువత ప్రాధాన్యం పెరుగుతోందన్నారు. నిజాయితీ, నూతన ఆలోచనలతో ప్రజలకు సేవ చేసే బాధ్యతను ఈ గుర్తింపు మరింత పెంచిందన్నారు.
ఇది భారత యువ గొంతుకలకు దక్కిన గుర్తింపు అన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో పని చేయడం గర్వంగా ఉందన్నారు. ప్రజాసేవలో ఎర్రన్నాయుడు, చంద్రబాబును చూస్తూ ఎదిగాను.. వారి ఆలోచనలు, ముందుచూపు, నిబద్ధత, చిత్తశుద్ధి తనకు స్ఫూర్తిదాయకమన్నారు. 2014లో 26 ఏళ్ల అతి చిన్న వయసులో పార్లమెంట్ సభ్యుల్లో ఒకరిగా ఉన్న రామ్మోహన్ నాయుడు.. 2024 నుంచి ప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గంలో క్యాబినెట్ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన నాయకత్వంలో పౌర విమానయాన శాఖ కొత్త పుంతలు తొక్కుతోంది. విమానాశ్రయాల్లో మౌలిక సదుపాయాల కల్పన నుంచి.. దేశంలోని వివిధ మారుమూల ప్రాంతాలకు వైమానిక సేవలను అభివృద్ధి చేసేందుకు ఆయన ఎంతో కృషి చేస్తున్నారు.
తెలుగువారికి గర్వకారణం: చంద్రబాబు
యంగ్ గ్లోబల్ లీడర్ గా ఎంపికైన రామ్మోహన్ నాయుడుకి సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. ఈ ప్రతిష్టాత్మక గుర్తింపు దేశానికి, ముఖ్యంగా తెలుగువారికి గర్వకారణమన్నారు. ప్రజాసేవలో రామ్మోహన్ అంకితభావం.. యువతకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందన్నారు. మన రాష్ట్రంతోపాటు దేశ పురోగతికి కృషి చేస్తూ.. ప్రపంచ వేదికపై భారత్ స్వరాన్ని వినిపిస్తూ.. ఆయన నిరంతరం విజయాలను సాధించాలని కోరుకొంటున్నట్లు ఎక్స్లో సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు.
ఉన్నత శిఖరాలకు ఎదగాలి: మంత్రి లోకేష్
యంగ్ గ్లోబల్ లీడర్గా కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు ఎంపిక కావడం ఏపీకి, భారత్కు గర్వకారణమని విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ అభినందనలు తెలిపారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నుంచి రామ్మోహన్నాయడు ప్రేరణ పొందడం సంతోషంగా ఉందన్నారు. ఆయన ఉన్నత శిఖరాలకు ఎదగాలని మంత్రి లోకేష్ ఆకాంక్షించారు.