- సమస్య పరిష్కారానికి సమష్టిగా కృషి చేద్దాం
- భవిష్యత్ ప్రణాళిక నిర్దేశించడంపైనా దృష్టి పెట్టాలి
- టారిఫ్ వార్ కారణంగా ఆక్వా పరిస్థితిపై సీఎం సమీక్ష
- 100 కౌంట్కు రూ.220కన్నా తగ్గించొద్దని వ్యాపారులకు నిర్దేశం
- రొయ్యల చెరువులకు ఫ్రెష్ వాటర్ ఇచ్చేందుకు అంగీకారం
- సచివాలయంలో ఆక్వారంగ భాగస్వాములతో సుదీర్ఘ చర్చలు
అమరావతి (చైతన్య రథం): అమెరికా సుంకాల కారణంగా నష్టపోతున్న ఆక్వారంగాన్ని ఆదుకునే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర జీడీపీలో మత్స్యరంగం కీలకమైన భూమిక పోషిస్తోందని, సుంకాల కారణంగా సంక్షోభం ముంగిట ఉన్న ఆక్వా రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వపరంగా అన్ని చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సమస్యకు పరిష్కారం చూపేందుకు భాగస్వాములతో కమిటీ ఏర్పాటు చేద్దామని సీఎం ప్రతిపాదించారు. ప్రస్తుత సమస్యకు పరిష్కారం, భవిష్యత్కు అవసరమైన ప్రణాళిక రూపొందించేందుకు కమిటీ సూచనలు చేయాలని సీపం సూచించారు. ఆక్వా రైతులు, ఆక్వారంగ నిపుణులు, ప్రభుత్వాధికారులు, భాగస్వాములు, ఎంపెడా ప్రతినిధులు, ఎగుమతిదారులతో కమిటీ ఏర్పాటుచేసి మరింత లోతుగా సమస్యపై చర్చించి పరిష్కారం చూపేందుకు అవసరమైన సూచనలు ఈ కమిటీ చేయనుంది.
ఈ కమిటీ సూచనల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోనుంది. అమెరికా ప్రభుత్వ కొత్త సుంకాల కారణంగా ఏపీలో ఆక్వారంగం ఎదుర్కొంటున్న సమస్యలపై ఆక్వా రైతులు, ఆక్వా రంగ భాగస్వాములు, ఎగుమతిదారులు, ప్రభుత్వాధికారులతో చంద్రబాబు చర్చించారు. వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. సమస్యను పరిష్కరించడానికి ఉన్న అవకాశాలపై వారితో మాట్లాడారు. ఆక్వాసాగులో 3 లక్షల మంది రైతులున్నారని… అలాగే, ఈ రంగంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా మరో 50 లక్షలమంది ఆధారపడి ఉన్నారని వివరించారు. ఇప్పటికే అనేక సమస్యలతో కుదేలవుతున్న ఆక్వా రంగానికి కొత్త సుంకాలు మరింత నష్టం చేస్తాయని రైతులు, ఎగుమతిదారులు తెలిపారు. ఈక్విడార్ వంటి దేశాలు అనుసరిస్తున్న విధానాలపై చర్చించారు. అమెరికాతో కేంద్ర ప్రభుత్వం సత్వర సంప్రదింపులు జరిపేలా కేంద్రంతో మాట్లాడనున్నారు.
అనూహ్య సమస్య… మద్దతుగా ఉంటాం
ఆక్వా రంగానికి ఇప్పుడు వచ్చింది అనూహ్య సమస్య అని… దీనికి భయపడిపోకుండా అంతా కలిసి సమస్య పరిష్కారం కోసం ప్రయత్నిద్దామని ముఖ్యమంత్రి అన్నారు. సమన్వయంతో ఉంటేనే ఆక్వారంగం ముందుకు సాగుతుందని సీఎం అన్నారు. రైతులకు నమ్మకాన్ని కల్గించాల్సిన అవసరం ఉందని సీపం అన్నారు. ఆక్వాకు ఫ్రెష్వాటర్ ఇవ్వడం వల్ల వైరస్లు, వ్యాధులు తగ్గి… పంట నాణ్యత మెరుగుపడుతుందని రైతులు చెప్పగా…. దీనికి సీఎం అంగీకారం తెలిపారు. గిట్టుబాటు ధర తగ్గకుండా చూడాలని కోరగా…. 100 కౌంట్ రొయ్యలను రూ.220 ధరకు కొనుగోలు చేయాలని వ్యాపారులకు నిర్దేశించారు. దీనికి వ్యాపారులు కూడా సహకరించాలన్నారు. సౌత్ కొరియా, యూరోపియన్ యూనియన్ వంటి దేశాలతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోవడం వల్ల ఫలితాలు ఉంటాయని ఎగుమతి దారులు చెప్పగా… ఈ విషయంపై కేంద్రంతో మాట్లాడతామని సీపం అన్నారు. ఇప్పటికే లేఖ ద్వారా కేంద్రం దృష్టికి తెచ్చామని… కేంద్రంతో సంప్రదింపులు జరుపుతామన్నారు. ఆక్వాలో భాగస్వాములుగా ఉన్న అన్ని వర్గాలు కలిసి సమష్టిగా అడుగువేస్తేనే… ఈ రంగం నిలబడుతుందని సీఎం చంద్రబాబు ఉపదేశించారు.