- ఈ ఏడాదిలోనే ఖాళీల భర్తీ
- ఇండస్ట్రీకి అవసరమైన కరిక్యులమ్ తీసుకువస్తాం
- రీసెర్చ్, ఇన్నోవేషన్పై దృష్టిపెడతాం
- న్యాయవివాదాలకు తావులేకుండా పకడ్బందీగా డీఎస్సీ నోటిఫికేషన్
- మండలిలో మంత్రి నారా లోకేష్ వెల్లడి
అమరావతి (చైతన్యరథం): విశ్వవిద్యాలయాలను బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. సాంకేతిక విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల సంఖ్య, ఉద్యోగుల వివరాలు, ఖాళీల భర్తీ, యూనివర్సిటీల అభివృద్ధిపై శాసన మండలిలో గురవారం సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. మంత్రి మాట్లాడుతూ.. ఏపీలో జీఆర్(గ్రాస్ ఎన్రోల్మెంట్) రేషియో 36.5 శాతం, ఢల్లీి 49 శాతం, తమిళనాడులో 47శాతంగా ఉంది. రాష్ట్రంలో చిత్తూరు, గుంటూరులో 45శాతం కంటే ఎక్కువగా ఉంది. అనంతపూర్, కర్నూలు, శ్రీకాకుళంలో 30 నుంచి 35 శాతం మధ్య ఉంది. మహిళల విషయానికి స్టెమ్ కోర్సుల్లో తక్కువగా ఉన్నారు. పేటెంట్ ఫైలింగ్స్ విషయానికి వస్తే రాష్ట్రంలో కేవలం 1,400 మాత్రమే పేటెంట్ ఫైలింగ్స్ జరిగాయి. కానీ తమిళనాడులో 7,600 పేటెంట్ ఫైలింగ్స్ జరిగాయి.
విశ్వవిద్యాలయాలకు వస్తే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ లో మనం 9వ స్థానంలో ఉన్నాం. పీహెచ్డీ విద్యార్థుల విషయానికి వస్తే ఏపీలో 5,600 మంది ఉంటే.. తమిళనాడులో 29వేల మంది ఉన్నారు. ప్రస్తుతానికి మనవద్ద ఎలాంటి ట్రాకింగ్ మెకానిజం కూడా లేదు. విద్యార్థుల ప్లేస్మెంట్స్, జీతాలేంటే వివరాలు లేవు. అలాంటి పరిస్థితుల్లో 2014లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని అమరావతిని ప్రకటించారు. అభివృద్ధి వికేంద్రీకరణ నినాదంతో పనులు మొదలుపెట్టాం. అందులో భాగంగా అనంతపూర్కు కియా వచ్చింది. చిత్తూరు, కడపకు ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు వచ్చాయి. కర్నూలుకు రెన్యువబుల్ ఎనర్జీ వచ్చింది. ఇప్పుడు డ్రోన్ సిటీ కూడా రాబోతోంది. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలంటే.. అక్కడున్న ఐటీఐలు గాని, పాలిటెక్నిక్లు గాని చాలా ఫోకస్డ్గా కరిక్యులమ్ తీసుకురావాల్సిన అవసరం ఉందని మంత్రి లోకేష్ అన్నారు.
ఇండస్ట్రీ లైక్ కరిక్యులమ్ తీసుకువస్తాం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లీప్(లెర్నింగ్ ఎక్స్లెన్స్ ఇన్ ఏపీ) పేరుతో సెక్టర్స్ స్పెసిఫిక్ ఇన్స్టిట్యూషన్స్పై దృష్టి పెట్టి కాలేజీలు, పాలిటెక్నిక్లు, ఐటీఐ, యూనివర్సిటీలతో క్లస్టరింగ్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు సాధించేలా కరిక్యులమ్ తీసుకురానున్నాం. పరిశ్రమలతో అనుసంధానం కావాలని అందరికీ చెబుతున్నాం. పద్మావతి మహిళా యూనివర్సిటీ వీసీతో మాట్లాడినప్పుడు కంప్యూటర్ సైన్స్ సీట్లు అన్నీ భర్తీ అవుతున్నాయి.. లాంగ్వేజెస్, ఆర్ట్స్ సీట్లు భర్తీ కావడం లేదు.. విద్యార్థులు వీటిపై శ్రద్ధ చూపించడం లేదని చెప్పారు. ఇటీవల మొన్న మా పదో తరగతి మిత్రులతో కలిసినప్పుడు 42 మందిలో ఇద్దరు ఇతర దేశాల్లో లాంగ్వేజెస్పై రీసెర్చ్ చేస్తున్నారు.. లాంగ్వేజెస్ కు సంబంధించిన వర్క్స్ చేస్తున్నారని చెప్పారు. అన్నింటినీ పరిశ్రమలతో అనుసంధానిస్తాం. ఇంటర్న్షిప్ వర్క్ బేస్డ్ లెర్నింగ్ తీసుకువస్తామని మంత్రి లోకేష్ వివరించారు.
ఈ ఏడాదిలోనే విశ్వవిద్యాలయాల్లో ఖాళీల భర్తీ
యూనివర్సిటీల్లో ఖాళీలు ఉన్నమాట వాస్తవం. ఈ ఏడాది ఖాళీలన్నీ భర్తీ చేయాలని నిర్ణయం తీసుకున్నాం. వన్ మ్యాన్ కమిషన్ రిపోర్ట్ వచ్చిన వెంటనే ఆ ప్రక్రియ కూడా ప్రారంభిస్తాం. ప్రొఫెసర్స్ ఆఫ్ ప్రాక్టీస్ విషయానికి వస్తే పరిశ్రమ నిపుణులతో ప్రాక్టీషనర్స్ పాఠాలు చెబితే బాగుంటుందని భావిస్తున్నాం. అక్రిడేషన్, క్వాలిటీ అస్యూరెన్స్ కూడా చాలా అవసరం. అది కూడా తీసుకువస్తున్నాం. ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్.. కెపాసిటీ బిల్డింగ్, వారికి కావాల్సిన ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ విజిట్ వంటివన్నీ ఏర్పాటుచేయాలని నిర్ణయించాం. డిజిటల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేస్తామని మంత్రి లోకేష్ తెలిపారు.
రీసెర్చ్, ఇన్నోవేషన్ పై దృష్టి
రీసెర్చ్, గ్లోబల్ అవుట్ రీచ్ విషయానికి వస్తే.. రీసెర్చ్ విషయంలో మనం చాలా వెనుకబడి ఉన్నాం. దీనిపై ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఏయూలో సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఏర్పాటుచేయాలని ఎన్వీడియాను కోరాం. రీసెర్చ్, ఇన్నోవేషన్పై దృష్టిపెడతాం. స్టార్టప్ ఇంక్యుబేషన్ బలోపేతం చేస్తాం. గ్లోబల్ టాలెంట్ కూడా రావాలి. టీచింగ్ టాలెంట్ రావాలి, విద్యార్థులు కూడా రావాలి. అంతర్జాతీయ విద్యార్థులు మన విశ్వవిద్యాలయాల్లో చదవాలనేది లక్ష్యంగా పెట్టుకున్నాం. స్టడీ ఇన్ ఏపీ బ్రాండిరగ్ కూడా చేయాలని నిర్ణయించామని మంత్రి లోకేష్ చెప్పారు.
బడ్జెట్ లో రూ.2వేల కోట్ల కేటాయింపు
బడ్జెట్లో కూడా ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను బలోపేతం చేసేందుకు రూ.2వేల కోట్లు కేటాయించాం. మౌలికవసతులు, పరిశోధనల కోసం ఆ నిధులను ఖర్చుపెడతాం. కేంద్రం కూడా అనేక కార్యక్రమాల కింద విశ్వవిద్యాలయాలకు నిధులు కేటాయిస్తోంది. వాటిని జతపరచి కార్యక్రమాలు చేపడతాం. డీఎస్సీ విషయంలో గతంలో జరిగిన తప్పులను స్టడీ చేసి న్యాయపరమైన వివాదాలకు తావులేకుండా పకడ్బందీ నోటిఫికేషన్ ఇవ్వాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. విశ్వవిద్యాలయాల్లో నియామకాల అంశం కూడా కోర్టులో ఉంది. దీనిపై ఏజీతో మాట్లాడి చర్యలు తీసుకుంటాం. విశ్వవిద్యాలయాల్లో 4,330 శాంక్షన్డ్ పోస్టులు ఉంటే కేవలం 1,048 పోస్టులు భర్తీ చేశారు. 3,282 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీ చేస్తాం. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాకింగ్స్లో ఏపీ 9వ స్థానంలో ఉంది. 3 వ స్థానానికి తీసుకురావాలనేది లక్ష్యం. క్యూఎస్ ర్యాంకింగ్లో టాప్-100లో ఒక ప్రభుత్వ విశ్వవిద్యాలయం ఉండాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.