- కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో లోకేష్ భేటీ
- ‘పీఎంశ్రీ’లో 1514 పాఠశాలల ఏర్పాటుకు అవకాశమివ్వండి
- పూర్వోదయ పథకం కింద రూ.5,684 కోట్లు మంజూరుకు వినతి
న్యూఢిల్లీ (చైతన్య రథం): కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ ఢిల్లీలోని ఆయన నివాసంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ ఏడాది ఆగస్టులో నిర్వహించబోయే అఖిల భారత విద్యామంత్రుల సమ్మేళనంను ఏపీలో నిర్వహించేందుకు అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా లోకేష్ కోరారు. విద్యా పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఏపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు మద్దతివ్వాలని, విద్యారంగంలో కీలక సంస్కరణలపై చర్చించడానికి ఈ కాంక్లేవ్ ఒక వేదికగా ఉపయోగపడుతుందని ప్రతిపాదించారు. గత ప్రభుత్వ ఆర్థిక దుర్వినియోగం, కేటాయించిన వనరులను తక్కువగా ఉపయోగించడం వల్ల ఏపీలో విద్యావ్యవస్థ కుంటుపడిరది. దీనివల్ల మౌలిక సదుపాయాల అభివృద్ధితో సహా కీలక రంగాల్లో పెద్దఎత్తున బకాయిలు ఉన్నాయి. కెజిబివిలు, నైపుణ్య విద్య, ఐసీటీ ఆధారిత అభ్యాసం, నాణ్యత పెంపుదలకు కేంద్రం నుంచి ఏపీకి నిధుల కేటాయింపులు పెంచాలని మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు విజ్ఞప్తి చేశారు.
ఏపీలో ప్రాథమిక విద్యను బలోపేతం చేయడానికి ప్రతి పంచాయతీలో మోడల్ ప్రైమరీ స్కూళ్లను ఏర్పాటుచేసి భరోసా కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు అధిక బడ్జెట్ కేటాయింపు అవసరం. 2025-26 బడ్జెట్లో ఏపీకి అత్యధికంగా నిధులు కేటాయించాలని కోరారు. రాష్ట్రంలో పీఎం శ్రీ పథకం కింద ఏర్పాటైన పాఠశాలలు అద్భుతమైన పురోగతిని కలిగి ఉన్నాయి. ఈ కారణంగా తల్లిదండ్రులు, కమ్యూనిటీ సభ్యులు, ప్రజా ప్రతినిధులు. వివిధ ప్రాంతాలనుంచి డిమాండ్ పెరుగుతోంది. పీఎం శ్రీ ఫేజ్-1, 2లతో కలిపి ఏపీలో ప్రతిపాదించిన 2,369 పాఠశాలలకుగాను 855కు మాత్రమే మంజూరయ్యాయి. గతంలో సిఫార్సు చేసిన మిగిలిన 1,514 పాఠశాలలను ఫేజ్ `3 పిఎం శ్రీలో మంజూరు చేయమని మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు.
ఏపీలో ఉన్నత విద్యాభివృద్ధికి పూర్వోదయ పథకం కింద పెద్దఎత్తున సాయం అందించాలని, యూనివర్సిటీల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.3,229 కోట్లు, రాష్ట్రంలో 37 ప్రభుత్వ కళాశాల భవనాల నిర్మాణానికి రూ.555 కోట్లు, ఇప్పటికే పనిచేస్తున్న డిగ్రీ కళాశాలల్లో క్లాస్ రూమ్స్, ల్యాబరేటరీలు, లైబ్రరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి రూ.330 కోట్లు మంజూరు చేయాలని కోరారు. కర్నూలు అబ్దుల్ కలాం ఉర్దూ యూనివర్సిటీ, ఒంగోలు ఆంధ్రకేసరి యూనివర్సిటీల్లో భవన నిర్మాణాలకు చెరో రూ.50కోట్లు, రాష్ట్రంలో 10 మహిళా కళాశాలల ఏర్పాటుకు రూ.150 కోట్లు, రెండు మోడల్ డిగ్రీ కళాశాలల ఏర్పాటుకు రూ.30కోట్లు, రూ.250 కోట్లతో ఏఐ, రెన్యువబుల్ ఎనర్జీ, ఎమర్జింగ్ టెక్నాలజీస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు నిధులు కేటాయించాలని కోరారు. 4 మేజర్ యూనివర్సిటీల్లో ఇంక్యుబేషన్ హబ్లను ఏర్పాటు చేసేందుకు రూ.20కోట్ల చొప్పున 80కోట్లు, హయ్యర్ ఎడ్యుకేషన్ ఫ్యాకల్టీ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్కు రూ.50కోట్లు, ఎంపిక చేసిన యూనివర్సిటీల్లో ఇంటర్నేషనల్ స్టూడెంట్ హాస్టల్స్ నిర్మాణానికి రూ.80కోట్లు, యూనివర్సిటీ హాస్టళ్లలో సౌకర్యాల మెరుగుదలకు రూ.180కోట్లు మంజూరు చేయాలని కోరారు. రీసెర్చి, ఇన్నొవేషన్, అకడమిక్ ఎక్సలెన్స్ హబ్గా ఏపీని తీర్చిదిద్దేందుకు పూర్వోదయ పథకం కింద మొత్తంగా రూ.5,684 కోట్లు మంజూరు చేయాల్సిందిగా మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తిచేశారు.