దావోస్ (చైతన్యరథం): ఏపీలో మల్టీమోడల్ లాజిస్టిక్ పార్క్లు ఏర్పాటు చేయాలని సప్లయ్ చైన్, లాజిస్టిక్స్, ఇన్ ఫ్రా రంగాల్లో పేరెన్నికగన్న బహుళజాతి సంస్థ ఎజిలిటీ వైస్ చైర్మన్ తారిఖ్ సుల్తాన్ను రాష్ట్ర విద్య, ఐటీి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ కోరారు. తారిఖ్ సుల్తాన్తో దావోస్ బెల్వడేర్ లో భేటీ అయిన మంత్రి లోకేష్ మాట్లాడుతూ… భారతదేశ ఎగుమతుల్లో ఏపీ 16.5శాతం వాటాతో 3వ అతిపెద్ద పోర్టు స్టేట్గా ఉందని తెలిపారు. దేశ ఎగుమతుల ఆదాయంలో 6శాతం.. రూ. 1.59 లక్షల కోట్లు ఏపీ సాధించింది. 1054 కి.మీ.ల సుదూర తీర ప్రాంతం, ఆరు ఆపరేషనల్ పోర్టులు కలిగి కార్గో రవాణా కార్యకలాపాలకు పూర్తి అనుకూల వాతావరణం కలిగి ఉంది. దేశంలో 4వ అతి పెద్దదైన విశాఖపట్నం పోర్టు ఈ ఏడాది 35.77 మిలియన్ టన్నుల కార్గో రవాణా చేసింది. కార్గో రవాణాకు అన్నివిధాలా అనుకూలతలు కలిగిన ఏపీలో లాజిస్టిక్స్, ఇన్ఫ్రాక్ట్చర్ రంగాల్లో పెట్టుబడులు పెట్టండి. ఓడరేవుల పరిసరాల్లో ఎజిలిటీ మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులు, వేర్ హౌస్లు, కోల్డు స్టోరేజిలు ఏర్పాటు చేయండి. రాష్ట్రంలోని విశాఖపట్నం లేదా తిరుపతిలో గ్లోబల్ సర్వీస్ సెంటర్లను ఏర్పాటు చేయాలని మంత్రి నారా లోకేష్ కోరారు.
తారిఖ్ సుల్తాన్ మాట్లాడుతూ ఎజిలిటీ సంస్థ భారత్లో బలమైన ఉనికి కలిగి అత్యాధునిక లాజిస్టిక్ సేవలను అందిస్తోందని తెలిపారు. సరుకు రవాణా, కాంట్రాక్ట్ లాజిస్టిక్స్, కస్టమ్స్ క్లియరెన్స్ కార్యకలాపాలను నిర్వహిస్తోంది. భారత్లో ఎజిలిటీ లాజిస్టిక్ పార్కు 8లక్షల చదరపుమీటర్ల భూమి కలిగి వేర్ హౌసింగ్, గిడ్డంగులను నిర్వహిస్తోంది. డిజిటల్ ట్రాన్సఫర్మేషన్తో స్థిరమైన వ్యాపార పద్ధతులను అవలంబిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదనలపై కంపెనీ సహచరులతో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని తారిఖ్ సుల్తాన్ తెలిపారు.