దావోస్ (చైతన్యరథం): ఏపీలో బీరు తయారీ రంగంలో పెట్టుబడులు పెట్టాలని ఈ రంగంలో అంతర్జాతీయంగా పేరెన్నికగన్న హైన్ కెన్ సంస్థ సీఈఓ డోల్ఫోవాన్ డెన్ బ్రింక్ను రాష్ట్ర విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ కోరారు. ఇన్నొవేటివ్ మార్కెటింగ్, బ్రూవరీస్, స్పోర్ట్ స్సాన్సర్ షిప్లో పేరొందిన హైన్ కెన్ సంస్థ సీఈఓ డోల్ఫోవాన్ డెన్ బ్రింక్ తో దావోస్ బెల్వడేర్ లో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలతో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ 4.0ను ప్రకటించామని తెలిపారు. దీనిప్రకారం 10 బిలియన్ డాలర్ల ఎఫ్డీఐలతో సహా రూ.30లక్షల కోట్ల పెట్టుబడులు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. రాష్ట్రంలో 175కి పైగా ఇండస్ట్రియల్ పార్కులను అభివృద్ధి చేయబోతున్నాం. 2030 నాటికి ఎగుమతులను రెట్టింపుచేసి 40 బిలియన్ డాలర్లకు చేర్చాలని భావిస్తున్నాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ విధానాలతో ముందుకెళ్తున్నాం. పరిశ్రమలకు 15రోజుల్లోనే అన్ని అనుమతులు ఇచ్చేలా ఏపీఈడీబీలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేశాం.
హైన్ కెన్ నుంచి బీరు తయారీ, ఎఫ్ఎంసీజీ సెక్టార్లో పెట్టుబడులు పెట్టండి. హైన్ కెన్ అనుబంధ సంస్థ యునైటెడ్ బ్రూవరీస్ ద్వారా బీర్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టండి. బలమైన ఓడరేవులు, మౌలిక సదుపాయాలు కలిగిన ఆంధ్రప్రదేశ్ దక్షిణాసియాలో హైన్ కెన్ కార్యకలాపాలకు వ్యూహాత్మక ప్రాంతం. ముడిసరుకుల సరఫరాకు అన్నివిధాల అనుకూలతలు కలిగిన ఏపీలో హైన్ కెన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని మంత్రి లోకేష్ కోరారు. హైన్ కెన్ సిఇఓ డెన్ బ్రింక్ మాట్లాడుతూ… 70కిపైగా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న హైన్ కెన్ లో 90వేలమందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారని తెలిపారు. హైన్ కెన్ సంస్థ యునైటెడ్ బ్రూవరీస్లో 37.4శాతం వాటా కలిగి ఉంది. భారతదేశ క్రాఫ్ట్ బీర్ మార్కెట్లో 50శాతం వాటా సాధించేందుకు బ్రూడాగ్ భాగస్వామ్యంతో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాం. హైన్ కెన్ సంస్థ 190 దేశాల్లో బీర్ బ్రాండ్లను కలిగి ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదనలపై సంస్థ ఎగ్జిక్యూటివ్ బోర్డులో చర్చించి నిర్ణయం తీసుకుంటామని డెన్ బ్రింక్ తెలిపారు.