- అదుకనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేయాలి
- సంక్షేమానికి వనరుల లభ్యత పెరిగేలా రూపొందించాలి
- ఆర్థిక సుస్థిరత కోసం సేవలరంగంపై దృష్టి పెట్టండి
- ప్రభుత్వ కార్యక్రమాలు, సేవలపై భిన్నమార్గాల్లో ప్రజాభిప్రాయ సేకరణ
- తలసరి ఆదాయంలో ఏడాదిలో మెరుగైన ఫలితాలు శుభపరిణామం
- ప్రభుత్వ శాఖలకు మార్గనిర్దేశనంలో ప్రణాళిక విభాగమే కీలకం
- ప్రణాళికా శాఖపై సమీక్షలో సీఎం చంద్రబాబు ఉద్ఘాటన
అమరావతి (చైతన్య రథం): రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగయ్యేలా అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ప్రణాళిక శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, జీఎస్డీపీ అంచనాలు, అభివృద్ధి సూచికలు, గ్రోత్ డ్రైవర్స్వంటి అంశాలపై చంద్రబాబు అధికారులతో చర్చించారు. సమీక్షలో ప్రణాళిక శాఖ దృష్టి సారించాల్సిన వివిధ అంశాలపై ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. గతానికంటే ఎక్కువగా ప్రణాళిక శాఖకు తాను ప్రాధాన్యమిస్తున్నట్టు చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రతి శాఖ మెరుగైన ఫలితాలు సాధించేలా ప్రణాళిక శాఖే బాధ్యత తీసుకోవాలన్నారు. రుణ భారం తగ్గించుకోవడం, సంక్షేమానికి వనరులు సమకూర్చుకోవడం వంటివి అత్యంత కీలకాంశాలని చంద్రబాబు వివరించారు. వనరుల సమీకరణలో రాష్ట్ర సొంత ఆదాయం, కేంద్రంనుంచి వచ్చే నిధులతో పాటు కొత్తమార్గాలను అన్వేషించాలని సూచించారు. వీటిని దృష్టిలో పెట్టుకుని ప్రణాళిక శాఖ పని చేయాలని ఆదేశించారు. ఈ విషయంలో ప్రభుత్వం నిర్ణయాలు తీసుకునేందుకు అవసరమైన ప్రామాణిక సమాచారాన్ని రూపొందించుకోవాలన్నారు. ఈ దిశగా ప్రణాళిక శాఖ పనితీరు మెరుగు పరుచుకోవాలని చంద్రబాబు సూచించారు. పెట్టుబడులను ఆకర్షించే విషయంలో ఏపీ బ్రాండ్ ప్రమోషన్ నిరంతరం జరగాలని స్పష్టం చేశారు. ఇప్పటికే 25 కేబినెట్ సమావేశాలు, 6 ఎస్ఐబీపీ సమావేశాలు నిర్వహించి.. పెద్ద ఎత్తున పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చామని గుర్తు చేశారు. ఇక్కడితో ఆగకుండా.. ఆ ప్రాజెక్టులు గ్రౌండ్ అయ్యేలా చూస్తున్నామన్నాని చంద్రబాబు స్పష్టం చేశారు.
సాంకేతికతతో సమాచార విశ్లేషణ
కచ్చితమైన ప్రణాళికలతో రాష్ట్ర సమగ్రాభివృద్ధికి పని చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో తలసరి ఆదాయం లెక్కల్లో జాతీయస్థాయికి మించి ఏపీ పురోగతి సాధించిందన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి జాతీయ స్థాయిలో తలసరి ఆదాయం 8.7 శాతంమేర పెరిగితే.. ఏపీ 11.89 శాతం మేర పురోగతి నమోదు చేసిందని అధికారులు వెల్లడిరచారు. రాష్ట్రం ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించేందుకు అవసరమైన డేటా అనలిటిక్స్ కోసం టెక్నాలజీని వినియోగించుకోవాలన్నారు. ఆర్థికాభివృద్ధికి అనువుగా ఉన్న రంగాలపై దృష్టి పెట్టడంతోపాటు.. సేవల రంగం అభివృద్ధి జరిగేలా ప్రణాళికలు రూపొందిస్తే ఆర్థిక సుస్థిరతను త్వరితగతిన సాధించగలమని ముఖ్యమంత్రి వివరించారు. రాష్ట్ర, జిల్లా, మండలాలతోపాటు గ్రామస్థాయిలో కూడా కీ-పెర్ఫామెన్స్ ఇండికేటర్లు పెడితే.. క్షేత్రస్థాయి నుంచి పోటీతత్వం పెరుగుతుందన్నారు. 2028-29 నాటికి 15 శాతం వృద్ధి లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
అభివృద్ధి సూచికలే కీలకం
నెలవారీ అభివృద్ధి సూచికల ద్వారా ఎప్పటికప్పుడు పనితీరును సమీక్షించుకునే అవకాశం ఉంటుందని సీఎం చంద్రబాబు సూచించారు. దీనివల్ల ఎప్పుడైనా లోటుపాట్లు ఉంటే తక్షణం సవరించుకునే అవకాశం ఉంటుందన్నారు. సాంకేతికతను జోడిరచి నీటి యాజమాన్యాన్ని సమర్ధంగా నిర్వహించాలని అధికారులకు స్పష్టం చేశారు. సరైన నీటి యాజమాన్యం చేపడితే కరవు పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేందుకు ముందస్తు ప్రణాళికలు ఉండాలన్నారు. రిజర్వాయర్లు, నేలలో తేమశాతం, భూగర్బ జలాల వివరాలు వంటివి నమోదు చేసి వివరాలు తీసుకునే బాధ్యతను ప్రణాళిక శాఖ తీసుకోవాలన్నారు. వ్యవసాయం, ఉద్యాన పంటల్లో గ్రాస్ వాల్యూ ఎడిషన్తో పాటు సేవల రంగంలో పెట్టుబడులు పెరిగేలా కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు. విద్యుత్ కొనుగోలు ధరలు తగ్గించేందుకు ఎలాంటి ప్రత్యామ్నాయాలు ఉన్నాయనే అంశాన్ని పరిశీలించాలని సీఎం చంద్రబాబు సూచించారు. పీ`4లో బంగారు కుటుంబాలు- మార్గదర్శుల మధ్య సమన్వయం చేసుకునే ప్రక్రియను ఆగస్టు 15లోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
మెరుగ్గా ప్రజాభిప్రాయ సేకరణ
ప్రభుత్వ సేవలు, విభాగాల పనితీరు మీద నిరంతరం ప్రజాభిప్రాయం తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు ప్రభుత్వానికి చేరేలా పీపుల్ పాజిటివ్ పర్సెప్షన్ వ్యవస్థను తీర్చిదిద్దాలన్నారు. ఐవీఆర్ఎస్ కాల్స్, క్యూఆర్ కోడ్ విధానాల ద్వారా ప్రస్తుతం చేపడుతున్న అభిప్రాయ సేకరణతోపాటు.. మరిన్ని భిన్నమైన మార్గాల ద్వారా కచ్చితమైన సమాచారం రాబట్టేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్, ప్రణాళిక శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.