- పాలనలో టెక్నాలజీ వినియోగంపై మీ విజన్ అద్భుతం
- సీఎం చంద్రబాబుకు బిల్గేట్స్ లేఖ
అమరావతి: పాలనలో టెక్నాలజీ, ఇన్నోవేషన్ను బలోపేతం చేయడానికి, మెరుగైన సేవలు అందించేందుకు సీఎం చంద్రబాబు చూపిస్తున్న ఆసక్తి, చిత్తశుద్ధి, విజన్ను మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ కొనియాడారు. ఇటీవల ఏపీ ప్రభుత్వం, గేట్స్ ఫౌండేషన్ మధ్య ఢల్లీిలో కుదిరిన ఒప్పందంపై సీఎం చంద్రబాబుపై ఆయన ప్రశంసలు కురిపించారు. ఆ ఒప్పంద సమావేశాన్ని ప్రస్తావిస్తూ సీఎం చంద్రబాబుకు బిల్ గేట్స్ సోమవారం లేఖ రాశారు. ఒప్పందం కోసం చంద్రబాబు చూపిన చొరవను అభినందించారు. మంచి వాతావరణంలో చంద్రబాబుతో సంప్రదింపులు జరిపాం. వ్యవసాయ ఉత్పత్తుల అభివృద్ధికి, పేదల విద్య, ఆరోగ్యంపై ఒప్పందం చేసుకోవడాన్ని అభినందిస్తున్నానని బిల్గేట్స్ లేఖలో పేర్కొన్నారు. చంద్రబాబు తన బృందంతో ఢల్లీి వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నానని బిల్ గేట్స్ అన్నారు. పేదలు-అట్టడుగు వర్గాల విద్య, ఆరోగ్యం సహా వ్యవసాయ ఉత్పత్తుల అభివృద్ధిపైనా గేట్స్ ఫౌండేషన్తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే.
ఆరోగ్య రంగాన్ని పటిష్ట పరచడం, హెల్త్ రికార్డుల డిజిటలైజేషన్, ఏఐ అసిస్టెడ్ క్లినికల్ డెసిషన్ మేకింగ్, మెడ్టెక్ మాన్యుఫాక్చరింగ్ హబ్గా ఏపీని తీర్చిదిద్దడం, వ్యవసాయంలో నాణ్యమైన విత్తనాల తయారీ, సాయిల్ హెల్త్ మోనిటరింగ్, తల్లీబిడ్డల ఆరోగ్యానికి మైక్రోన్యూట్రీయంట్లు అందించే అంశాలపై ఇరువురం చర్చించామని బిల్గేట్స్ గుర్తు చేశారు. మీరు ఆశించే ఏఐ డ్రివెన్ డిసిషన్ మేకింగ్, రియల్ టైమ్ డేటా సిస్టమ్, హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్ వంటివి మీ నాయకత్వ ప్రతిభను ప్రస్ఫుటం చేస్తున్నాయి. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో… ప్రభుత్వ సేవల్లో ఉత్తమ ఫలితాలు రాబట్టేందుకు మీరు చేస్తున్న కృషి ఆంధ్రప్రదేశ్కే కాదు భారత్తో సహా, అల్పాదాయ దేశాలకు ఉపయోగపడుతుంది. ఈసారి నా భారతదేశ పర్యటనలో ఆంధ్రప్రదేశ్కు వచ్చే నాటికి… మీ నాయకత్వం- మన భాగస్వామ్యంలో అనుకున్న లక్ష్యాలను చేరుకోవడంలో అద్భుతమైన పురోగతి సాధించగలమని చెప్పగలను. గేట్స్ ఫౌండేషన్ -ఏపీ ప్రభుత్వ భాగస్వామ్యం మున్ముందు కొనసాగాలని, కలిసికట్టుగా పనిచేసి రాష్ట్ర భవిష్యత్పై సానుకూల ప్రభావాన్ని చూపాలని ఆశిస్తున్నానని లేఖలో బిల్గేట్స్ ప్రస్తావించారు.