- కృష్ణంరాజు నీచ వ్యాఖ్యలను సుమోటోగా తీసుకున్న ఎన్సీడబ్ల్యూ
- డీజీపీకి సంస్థ చైర్పర్సన్ విజయ రహత్కర్ లేఖ
- వేగంగా స్పందించారని మంత్రి లోకేష్ ప్రశంసలు
- అమరావతి మహిళలపై అసభ్య వ్యాఖ్యలు క్షమించరాని నేరమని వ్యాఖ్య
- పోరాటపటిమకు మారుపేరైన వారిని అవమానించారని ఆగ్రహం
- సత్వరం న్యాయం జరగాలని డిమాండ్
అమరావతి (చైతన్యరథం): సాక్షి ఛానల్ డిబేట్లో అమరావతి మహిళలను ఉద్దేశించి వీవీఆర్ కృష్ణంరాజు చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. అమరావతిని వేశ్యల నగరంగా కృష్ణంరాజు అభివర్ణించారు. దీంతో ఆంధ్రప్రదేశ్లో పెద్దఎత్తున ఆగ్రహ జ్వాలలు రేగుతున్నాయి. సాక్షి ఛానెల్పై, జర్నలిస్ట్ కృష్ణంరాజుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, కృష్ణంరాజు చేసిన అసభ్యకర వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంది
ఈ విషయంలో జాతీయ మహిళా కమిషన్ చొరవను ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అభినందించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఓ ట్వీట్ చేశారు. అమరావతి మహిళలను ఉద్దేశిస్తూ కృష్ణంరాజు చేసిన నీచమైన, అసభ్యకర వ్యాఖ్యలపై తక్షణమే స్పందించి చర్యలకు ఆదేశించిన జాతీయ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ విజయ రహత్కర్కు అభినందనలు. ధైర్యానికి, పోరాటపటిమకు మారుపేరైన అమరావతి మహిళా రైతులను వేశ్యలుగా అభివర్ణించడం సిగ్గుచేటు మాత్రమే కాదు.. క్షమించరాని నేరం కూడా. వారి త్యాగాలను అవమానించడమే. ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ సత్వరమే స్పందించి వేగంగా చర్య తీసుకోవడం ద్వారా అలాంటి వ్యాఖ్యలను ఉపేక్షించేది లేదనే బలమైన సందేశం ఇచ్చింది. మేమంతా అమరావతి మహిళా రైతుల వెనుక ఉన్నాం. మహిళలను అవమానించినవారిని వదిలిపెట్టేది లేదు. అమరావతి ఉద్యమానికి మహిళలే వెన్నెముకగా నిలిచారు. వారికి సత్వరమే న్యాయం జరగాలని నారా లోకేష్ ట్వీట్ చేశారు.
ఇలాఉంటే అమరావతి మహిళలను ఉద్దేశించి సాక్షి ఛానెల్లో జర్నలిస్టు కృష్ణంరాజు చేసిన అసభ్యకర వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) సుమోటోగా తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర డీజీపీకి కమిషన్ చైర్పర్సన్ విజయ రహత్కర్ లేఖ రాశారు. కృష్ణంరాజు చేసిన అసభ్యకర వ్యాఖ్యలను ఎన్సీడబ్ల్యూ తీవ్రంగా ఖండిరచింది. ఈ వ్యవహారంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారో మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని డీజీపీని ఆదేశించింది. అమరావతి ఉద్యమంలో మహిళా రైతులు కీలకపాత్ర పోషించారని మహిళా కమిషన్ పేర్కొంది. కృష్ణంరాజు వ్యాఖ్యలపై మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా సుమోటోగా తీసుకుని విచారణకు ఆదేశించింది.