- ప్రాణదాతలు కనుకే.. వైద్యులకు అంతటి గౌరవం
- నమ్మకమే విధి నిర్వహణగా.. సేవలందించండి
- గిరిజన, పల్లెల్లోని సవాళ్లపై అవగాహన పెంచుకోండి
- లాభాపేక్షతో కాదు, మానవత్వంతో సేవచేయండి
- మీ స్పర్శే.. రోగికి కొండంత భరోసా..
- విధి నిర్వహణలో నైతికత విస్మరించొద్దు
- మంగళగిరి ఎయిమ్స్ స్నాతకంలో మంత్రి లోకేష్ పిలుపు
మంగళగిరి (చైతన్య రథం): ప్రతి నాగరికతలో వైద్యులు అత్యున్నత నైతికస్థానంలో ఉంటారు. ఈ గౌరవం సంపద లేదా హోదావల్ల కాదు. వారు జీవితానికి, మరణానికి మధ్య నిలబడి ప్రాణదాతలుగా సేవలందించడం వల్లే సమాజంలో గౌరవం లభిస్తోందని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ అన్నారు. మంగళగిరి ఎయిమ్స్లో నిర్వహించిన స్నాతకోత్సవానికి మంత్రి లోకేష్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ… “ప్రతి ఆసుపత్రి ఆవరణలో ఆందోళన, భయం, బాధ ఉంటాయి. అత్యవసర వార్డులోకి ప్రవేశించే రోగి మీ కళ్లలోకి ఆర్తిగా చూస్తాడు. అప్పుడు మిమ్మల్ని మీరు ఒక ప్రశ్న వేసుకోవాలి. వారు మీనుంచి నమ్మకం లేదా ప్రేమను కోరుకుంటున్న విషయాన్ని గమనించాలి. మీరు కేవలం మందులను మాత్రమే సూచించడం లేదు. మీరు వారిలో ఆశను చిగురిస్తున్నారు. కోవిడ్-19 సమయంలో ప్రపంచమంతా ఇళ్లకే పరిమితమైనప్పుడు, ప్రాణాలను కాపాడటానికి వైద్యులు ప్రమాదంలో సైతం సేవాభావంతో నడిచారు. వారు కుటుంబాలకు దూరంగా ఐసోలేషన్ వార్డులలో అవిశ్రాంతంగా పనిచేశారు. అందుకే సమాజం వైద్యులను దేవుడి తర్వాత అంతటివారిగా భావిస్తుంది” అని మంత్రి లోకేష్ వైద్యులను ప్రశంసించారు.
దినదిన ప్రవర్థమానమై ఎదిగిన ఎయిమ్స్
ఈరోజు జరుగుతున్నది కేవలం స్నాతకోత్సవం మాత్రమే కాదు. ఇది ఒక పరిరక్షణ. మీరు ఈ సంస్థలోకి విద్యార్థులుగా ప్రవేశించారు. ఈరోజు జీవన సంరక్షకులుగా ఇక్కడినుంచి వెళ్తున్నారు. ప్రాంతీయ అసమానతలను సరిదిద్దే జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థలుగా, అత్యున్నత ప్రమాణాలు కలిగిన కేంద్రాలుగా ఎయిమ్స్ భావించబడుతోంది. ఎయిమ్స్ మంగళగిరి 2015లో అతి సామాన్యంగా ప్రారంభమైంది. నేడు ఇది అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, పీజీ, సూపర్ స్పెషాలిటీ నర్సింగ్, అనుబంధ ఆరోగ్య శాస్త్రాలలో 1,300 మందికిపైగా విద్యార్థులతో సమగ్ర సంస్థగా ఎదిగింది. మంగళగిరి ఎయిమ్స్ ప్రారంభ సంవత్సరాల్లో కొన్ని పడకల నుంచి నేడు దాదాపు 650 పడకల వరకు, పరిమిత సేవల నుంచి ఓపెన్-హార్ట్ సర్జరీలు, కిడ్నీ మార్పిడి, రోబోటిక్ మోకాళ్ల మార్పిడి, అధునాతన ఆంకాలజీ, క్యాథ్ ల్యాబ్ల వరకూ తమ సేవలను విస్తరించింది. ఈ వృద్ధి కేవలం మౌలిక సదుపాయాలపరంగా మాత్రమే కాదు. ఇది విస్తరిస్తున్న ప్రజల ఆశలు, ఆకాంక్షలకు ప్రతీక. ఇక్కడినుంచి ఇప్పటివరకు 45 లక్షలకుపైగా ల్యాబ్, డయాగ్నస్టిక్ సేవలు అందించబడ్డాయి. ప్రతి సంఖ్య వెనుక ఒక మానవీయ కథ ఉంది. ఈ సంస్థ బోధన, పరిశోధన, రోగి సంరక్షణ అనే మూడు స్తంభాలపై నిలిచి ఉంది. అయితే, నేడు మీరు నమ్మకం అనే నాలుగో స్తంభాన్ని కూడా చేర్చాలని నేను కోరుకుంటున్నాను” అని మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు.
మీరు ఈ దేశపు హీరోలు
మీరు ఈ దేశం యొక్క నిజమైన హీరోలన్న విషయాన్ని గుర్తుంచుకోండి. సాంకేతికత నానాటికీ మార్పు చెదుతోంది. మీ నైపుణ్యానికి ఏఐ (కృత్రిమ మేధస్సు) సహాయం చేస్తుంది. కానీ వైద్యుడి స్పర్శలోని స్వస్థత శక్తి సాటిలేనిది. కొన్నిసార్లు రోగాన్ని నయం చేసేది కేవలం మందుల ప్రిస్క్రిప్షన్ మాత్రమే కాదు, భరోసా. డబ్బు చెల్లించలేని రోగిని మీరెలా చూస్తారు? నిరక్షరాస్యులకు మీరు ఎలా వివరిస్తారు అనే దానిపై మీరిచ్చే భరోసా ఆధారపడి ఉంటుంది. మీరు ఈరోజు అందుకునే పట్టా కేవలం వైద్యవిద్య పూర్తి చేసిన సర్టిఫికేట్ కాదు. ఇది నిరంతరం నేర్చుకోవడానికి ఒక లైసెన్స్. డాక్టర్ నేర్చుకోవడం ఆపివేసిన క్షణమే, రోగులు ఇబ్బంది పడతారు. జీవితంలో రెండు ముఖ్యమైన అలవాట్లను అలవర్చుకోండి. క్రమం తప్పకుండా చదవడం, లోతుగా ఆలోచించడం. వినయం అనేది వైద్యుడి గొప్ప లక్షణం. గిరిజన ప్రాంతాలను సందర్శించండి. అక్కడి అనారోగ్య సమస్యలపై దృష్టిసారించండి. మానసిక ఆరోగ్య సవాళ్లను అర్థం చేసుకోండి. వైద్యం అనేది నిరంతర అభ్యాస వృత్తి. ఆరోగ్య సంరక్షణ విధానాన్ని ఏఐ సమూలంగా మార్చేసింది. కానీ, అది రోగి చేతిని పట్టుకోలేదు. సాంకేతికత మానవ మేధస్సుకు సహాయం చేయాలి కానీ శాసించకూడదు” అని వైద్యులకు సూచించారు.
విధినిర్వహణలో నైతికత మరువద్దు!
సామాజిక మాధ్యమాల పరిశీలనవంటి సవాళ్లు ఉన్నప్పటికీ, మీ నైతిక నిబద్ధతను రక్షించుకోండి. లాభపేక్షతో ఎప్పుడూ మందులను సూచించకండి. సౌకర్యం కోసం ఎప్పుడూ రాజీ పడకండి. మీ వృత్తి మీ హృదయంలోని మానవత్వాన్ని ప్రతిబింబించేలా ఉండనివ్వండి. ప్రతి డాక్టర్ వెనుక త్యాగం చేసిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రోత్సహించిన మెంటార్ ఉంటారు. ఓటమి అనేది విజయానికి బాట అని గుర్తుంచుకోండి. కష్టాలను అధిగమించే శక్తి మనకుంది. ఎవరూ వెళ్లని మార్గంలో నడిస్తే… మీరు కచ్చితంగా విజయం సాధిస్తారు. మీరు తెల్ల కోటు ధరించినప్పుడు దానిని గౌరవం, క్రమశిక్షణ, అంకితభావంతో స్వీకరించండి. రోగులపై ప్రేమతో సేవలందిస్తూ ముందుకు సాగండి. చిత్తశుద్ధి, వినయంతో స్వస్థత చేకూర్చాలని మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో కేంద్ర, ఆరోగ్య, రసాయన, ఎరువుల మంత్రి అనుప్రియ పటేల్, మంగళగిరి ఎయిమ్స్ అధ్యక్షులు మేజర్ జనరల్ డాక్టర్ తపన్ కుమార్ సాహా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ అంతం శాంత సింగ్, విశిష్ట అధ్యాపక సభ్యులు, పట్టభద్రులైన వైద్యులు, నర్సులు, ఆరోగ్య సంరక్షణులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.













