యోగః చిత్త వృత్తి నిరోధః
పతంజలి యోగ సూత్రాల్లోని ఈ మాటకు అర్థం.. యోగ అంటే చిత్త, వృత్తులను నిగ్రహించడమే. యోగ శాస్త్రానికి సర్వస్వం మనసు కాగా, ధర్మాచరణ నిర్వహణకు ఆధారం శరీరం. శరీరాన్ని, మనసును అదుపులో ఉంచి, ఆరోగ్యాన్ని, ఆయుష్షును, ఆత్మానందాన్ని పెంపొందించే సాధనం ‘యోగ’. యోగః కర్మసు కౌశలమ్ అని భగవద్గీత కూడా చెబుతోంది. అంటే చేసే పనిలో నైపుణ్యాన్ని పెంచుకోవడమే యోగం అని దాని అర్థం. అంటే ఓ మనిషి పరిపూర్ణమైన ఆనందాన్ని అనుభవించాలన్నా, చేసే పనిలో నైపుణ్యాన్ని సాధించాలన్నా, దానికి సరైన సాధనం యోగ అన్నది నిర్వివాదాంశం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చొరవతో, జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటిస్తూ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఫలితంగా 2015 జూన్ 21 నుంచి అంతర్జాతీయ యోగా దినోత్సవం అధికారికంగా ప్రారంభమై ఒక దశాబ్దాన్ని పూర్తి చేసుకొంది. ఈ సందర్భంలో ‘ఒకే భూమి – ఒకటే ఆరోగ్యం’ ఇతివృత్తంతో ప్రపంచ వ్యాప్తంగా యోగా దినోత్సవం దశాబ్ది ఉత్సవాలు జరుపుతున్నారు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్టణంలో జరుగుతున్న యోగా దినోత్సవ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రావడం తెలుగు వారందరూ గర్వించదగిన అంశం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో తెలుగు ఠీవిని మరోసారి దశ దిశల వ్యాప్తి చేయబోతున్నందుకు సంతోషంగా ఉంది.
2025లో ఒకే భూమి.. ఒకటే ఆరోగ్యం కోసం యోగా ఇతివృత్తంతో విశాఖ నగరంలో ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా సాగనున్న ఈ వేడుక కోసం ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. సాగర తీరంలో ఒకేసారి ఐదు లక్షల మంది యోగాసనాలు వేసేలా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటి వరకూ నమోదైన అన్ని గిన్నిస్ రికార్డులను తిరగరాసేలా ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రదేశాల్లో యోగాసన కార్యక్రమాలు చేపట్టాం. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధులు ఇప్పటికే ఏర్పాట్లను, లెక్కించే విధానం కూడా పూర్తయింది.
యోగా దినోత్సవం రోజు మాత్రమే యోగ కార్యక్రమంలో పాల్గొని, ఆ తర్వాత యోగాను వదిలేస్తే లాభం ఉండదు. యోగా అంటే ఓ నిరంతర జీవన విధానం. ఇందులో శారీరక ఆసనాలు మాత్రమే కాదు, మానసికంగా మేలు చేసే ధ్యానం వంటివి కూడా ఉన్నాయి. యోగా దినోత్సవంలోని అంతరార్థం శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే. 2025 యోగా దినోత్సవ ఇతివృత్తం కూడా అదే. ప్రపంచమంతా ఆరోగ్యంగా ఉండాలన్నది భారతదేశ సంకల్పం. అందుకు ఆంధ్రప్రదేశ్ వేదిక కావడం మన అదృష్టం. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో మన ప్రభుత్వం, ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖ, మరీ ముఖ్యంగా ఆయుష్ శాఖలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని రాష్ట్ర ప్రజలకు ఆరోగ్య కానుక అందించాలనే ఉద్దేశ్యంతో పని చేశాయి. ఇదే స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకోవాలన్నది మా కోరిక. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్ఫూర్తిని, సీఎం చంద్రబాబు నాయుడు సంకల్పాన్ని అందిపుచ్చుకుని ప్రతి యువకుడు యోగాంధ్ర ఉద్యమంలో భాగస్వాములు కావాలని తపన పడుతున్నారు. ఇది నిజంగా శుభ సూచకం.
యోగాంధ్ర కార్యక్రమాల్లో భాగంగా 2 కోట్ల మందిని భాగస్వాములను చేసే విధంగా ప్రభుత్వం తరఫున ఏర్పాట్లు చేశాం. ఇక్కడ మరో ఆసక్తికర అంశం ఏమిటంటే… ప్రభుత్వం ఈ కార్యక్రమం నమోదు కోసం 2 కోట్ల మందిని లక్ష్యంగా పెట్టుకోగా, అంతకు మించి 2.4 కోట్ల మంది నమోదు చేసుకున్నారు. ఆనందకరమైన, గర్వకారణమైన మరో అంశం ఏమిటంటే ఇప్పటి వరకూ యోగాంధ్ర కార్యక్రమానికి సంబంధించి ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవడమే కాదు…
అనేక అంశాల్లో అదనంగా 10 శాతం నుంచి రెట్టింపు శాతం వరకూ లక్ష్యాన్ని చేరుకోగలిగాం. యోగా ప్రజా ఉద్యమంగా రూపు దాల్చిందని చెప్పడానికి ఇదే నిదర్శనం. ఇప్పటికే 10 లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా శిక్షణ పొందుతున్నారు. వారికి శిక్షణ అనంతరం సర్టిఫికెట్లు జారీ చేసి, యోగా కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకుపోతాం. ప్రత్యేకించి ఈ సారి పర్యాటక ప్రదేశాలను యోగ కార్యక్రమాల కోసం ప్రధాన లక్ష్యంగా ఎంపికచేశాం. మొత్తం 42 పర్యాటక ప్రదేశాలు ఎంపిక చేయగా, ఇప్పటికే పలు చోట్ల యోగాంధ్ర కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహించింది. అంతర్జాతీయ యోగా దినోత్సవ ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏక కాలంలో 1.29 లక్షల ప్రదేశాల్లో యోగా నిర్వహణ కార్యక్రమాన్ని చేపట్టాం. దేశంలో ఇప్పటి వరకూ ఏ రాష్ట్రం కూడా ఇలాంటి చొరవ తీసుకోలేదు. అంగన్ వాడీ కార్యకర్తలు, రైతులు, రక్షణ సిబ్బంది, ఉపాధ్యాయులు, నిరుద్యోగ యువత, వికలాంగుల కోసం ప్రత్యేక సెషన్లు ఏర్పాటు చేశాం. జైళ్ళలో కూడా యోగా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఓ అడుగు ముందుకు వేసింది. అన్ని వర్గాల ప్రజలతో పాటు ప్రత్యేకంగా వృద్థులు, ట్రాన్స్జెండర్లను యోగాలో భాగస్వాములను చేస్తూ, ఆరోగ్యం ప్రాధాన్యతను తెలియజేస్తూ ఈ కార్యక్రమం ముందుకు సాగింది.
ముఖ్యంగా యువతలో స్ఫూర్తి నింపే ఉద్దేశంతో అనేక చోట్ల 10-18 సంవత్సరాలు, 19-35 సంవత్సరాలుగా పోటీలు నిర్వహించాం. గతంలో ఉన్న అన్ని రికార్డులను తిరగరాసే విధంగా 25 వేల మంది గిరిజన విద్యార్థులతో 108 పర్యాయాలు సూర్యనమస్కారాలు నిర్వహించే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకుంది. ఇది కేవలం రికార్డు కోసం మాత్రమే కాదు… అన్ని వర్గాల ప్రజల్లో ఆత్మ స్థైర్యాన్ని నింపడం కోసం కూడా. రికార్డు ద్వారా ఇదే స్ఫూర్తిని మరింత మంది యువతలో రగిలించడం కోసం. ఈ కార్యక్రమాలు నిర్వహించి ఆపేయకుండా, ఆ తర్వాత సర్వేలు నిర్వహించి, యోగా ద్వారా వారు పొందిన ప్రయోజనాలు, విజయగాథలను తెలుసుకోవడం ద్వారా మరింత మందిలో స్ఫూర్తిని నింపి, ఇంటింటికీ యోగా కార్యక్రమాన్ని తీసుకువెళ్ళాలన్న లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పని చేస్తోంది. 2026 యోగా దినోత్సవం నాటికి కనీసం కుటుంబానికి ఒకరైనా యోగా నైపుణ్యం కలిగిన వారు ఉండాలన్నది ఈ కార్యక్రమ లక్ష్యం. ప్రజల్లో యోగా పట్ల అవగాహన కల్పించేందుకు, వారికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. యోగా నేర్చుకోవాలనుకునే వారందరికీ ప్రభుత్వం వివిధ మార్గాల్లో సౌకర్యాలు కల్పిస్తోంది. ఇప్పటికే ఈ రంగంలో నిపుణులైన వారితో ఉచితంగా ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించేందుకు అనేక సంస్థలు ముందుకు రావడం ఆనందదాయకం. వారందరినీ ముందుగా అభినందిస్తున్నాను.
అంతర్జాతీయ యోగా దినోత్సవం – 2025 సందర్భంగా 10 సంవత్సరాల విజయాల్ని గుర్తు చేసుకుంటూ 10 ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించాం.
యోగ సంగమం -యోగ బంధన్ – యోగ పార్కులు – యోగ సమావేశాలు – యోగ ప్రభవ – యోగ కనెక్ట్ – హరిత్ యోగ – యోగ అన్ప్లగ్డ్ – యోగ మహా కుంభ్ – సమ్యోగం… వంటి ఈ పది కార్యక్రమాలు యోగా చైతన్యానికి విశేషంగా దోహదపడ్డాయి.
2025 యోగా దినోత్సవ ఇతివృత్తమైన ‘ఒకే భూమి – ఒకటే ఆరోగ్యం కోసం యోగ’ శారీరక, మానసిక, పర్యావరణ శ్రేయస్సును పెంపొందించడంలో యోగా పాత్రను ప్రధానంగా ప్రస్తావిస్తున్నాయి. ఇప్పటి వరకూ శారీరక, మానసిక ఆరోగ్యం కోసం యోగా అనే విషయం మనందరికీ తెలిసిందే. అయితే పర్యావరణ స్పృహ కూడా యోగలో భాగమనే విషయం సుస్పష్టం. ప్రపంచ ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలంటే శాంతితో కూడిన వాతావరణం అవసరం. ఈ విషయాన్ని కూడా ఈ ఏడాది ఇతివృత్తం స్పష్టం చేస్తోంది. వివేకానందుడు చెప్పినట్లు ‘ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం ఉన్న యువత ఈ దేశానికి కావాలి’. యోగ సాధన ద్వారానే యువతకు ఇవన్నీ సమకూరుతాయి. యోగా సాధన వల్ల శరీరం చురుగ్గా ఉండడమే కాదు, మనసు అదుపులో ఉంటుంది. ఫలితంగా మనం చేసే ప్రతి పని అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. యోగా ద్వారా ఆరోగ్యం లభిస్తుంది. ఆరోగ్యానికి మించిన భాగ్యం మరొకటి లేదు అన్నది ఆర్యోక్తి. భారతీయ సంస్కృతి తరతరాలుగా ఆచరిస్తున్న ‘వసుధైక కుటుంబం – విశ్వమంతా ఒకటే కుటుంబం’ అనే భావనను ‘ఆరోగ్యం కోసం యోగా’ అనే భావనతో ప్రపంచం స్ఫూర్తిగా తీసుకోవాలి. ఈ సందేశాన్ని అందించేందుకు తెలుగు నేల వేదిక కావడం ముదావహం. ప్రధాని నరేంద్ర మోదీ స్ఫూర్తితో యోగా ఓ మహా ఉద్యమం అవుతున్నందుకు, దానికి తెలుగు నేల సరైన వేదిక అయినందుకు తెలుగువారిగా గర్వ పడదాం. మనందరికీ ఇది ఎంతో స్ఫూర్తి దాయకం కూడా. ఈ స్ఫూర్తి ప్రపంచమంతా విస్తరించి శాంతి కాంతిగా ప్రకాశిస్తుందని ఆకాంక్షిస్తూ అందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు.
– వై.సత్యకుమార్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖా మంత్రి