- పోలీసులు సహా పలువురికి గాయాలు
- పొదిలిలో తీవ్ర ఉద్రిక్తత
- జగన్ పర్యటనలో మహిళల శాంతియుత నిరసన
- రెచ్చిపోయి దాడులకు తెగబడిన వైసీపీ కార్యకర్తలు
పొదిలి (చైతన్యరథం): వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా ప్రకాశం జిల్లా పొదిలిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జగన్ పర్యటన సందర్భంగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మహిళలపై వైసీపీ కార్యకర్తలు రాళ్లు, బీరు సీసాలు, చెప్పులతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో కొంతమంది మహిళలతో పాటు ముగ్గురు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. పోలీసులు రంగప్రవేశం చేసి వైసీపీ కార్యకర్తలను చెదరగొట్టారు. సాక్షి టీవీలో జరిగిన ఒక డిబేట్లో రాజధాని మహిళలను వేశ్యలుగా అభివర్ణిస్తూ చేసిన వ్యాఖ్యలకు వైసీపీ అధినేతగా జగన్, సాక్షి టీవీ యజమాని భారతీరెడ్డి జగన్ క్షమాపణలు చెప్పాలని. మహిళలు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గత నాలుగు రోజులుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. అయితే.. జగన్ కానీ, భారతి కానీ ఎక్కడా స్పందించలేదు. అసలు పట్టించుకోనట్టే వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా పొదిలి పర్యటనకు వచ్చిన జగన్కు మహిళల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆయన పర్యటిస్తున్న సమయంలో పొదిలిలో అడుగడుగునా నల్ల బెలూన్లు, ఫ్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. మహిళలకు జగన్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అమరావతి మహిళలపై సాక్షి ఛానల్లో, తరువాత వైసీపీ నేతలు చేసిన అసభ్య వ్యాఖ్యలను జగన్ ఖండిరచకపోవడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షమాపణ చెప్పాకే ఆయన పొదిలిలో అడుగుపెట్టాలని డిమాండ్ చేశారు.
‘‘షేమ్.. షేమ్ జగన్’, ‘భారతిరెడ్డి మౌనం వీడాలి’ తదితర నినాదాలు చేశారు. నల్లబెలూన్లతో భారీ నిరసన ర్యాలీ అనంతరం కందులాపురం సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందచేశారు. టీడీపీ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు తోట మహాలక్ష్మి, జడ్పీటీసీ సభ్యులు కొత్తపల్లి జ్యోతి మాట్లాడుతూ సాక్షి ఛానల్ రిపోర్టర్ కొమ్మినేని, జర్నలిస్టు కృష్ణంరాజుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళలను అవమానపరిచేలా మాట్లాడినప్పటికీ ఆ ఛానల్ ఎండీ భారతిరెడ్డి ఖండిరచడం గానీ, క్షమాపణ చెప్పడం గానీ చేయకపోవడం సిగ్గుచేటన్నారు. మహిళలంటే గౌరవం లేకే జగన్రెడ్డి తల్లిని, చెల్లిని ఇంటి నుంచి గెంటేశారని ధ్వజమెత్తారు. ఈ క్రమంలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మహిళలపై వైసీపీ మూకలు రాళ్లు, చెప్పులు విసిరారు. ఈ దాడిలో మహిళలతో పాటు అక్కడ విధులు నిర్వహిస్తున్న ముగ్గురు కానిస్టేబుళ్లకు తీవ్రగాయాలు అయ్యాయి. ఆ నిరనస ఎక్కడో రోడ్డుపక్కన జరుగుతుంటే వారిపై దాడి చేసేలా జగన్ ప్రేరేపించారు. దీంతో కార్యకర్తలు ఆ మహిళలపై రాళ్లదాడికి పాల్పడ్డారు.