- అవే అబద్ధాలు, తప్పుడు ప్రచారాలు
- నవరత్నాల పేరుతో మోసం చేసింది జగన్ కాదా?
- రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా హామీలన్నీ అమలు చేస్తున్నాం
- వైసీపీ మళ్లీ అధికారంలోకి రావడం పగటి కల
- మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి
తూర్పు నాయుడుపాలెం (చైతన్యరథం): ఆత్మీయ సమావేశాల పేరుతో వైసీపీ నేతలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మండిపడ్డారు. శుక్రవారం కొండపిలో వైసీపీ నేతల ఆత్మీయ సమావేశంలో ఆ పార్టీ నేతలు మాట్లాడిన వ్యాఖ్యలకు మంత్రి డా.స్వామి కౌంటర్ ఇస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రజలు బుద్ది చెప్పినాసరే వైసీపీ నేతల తీరు ఏ మాత్రం మారలేదు, నిస్సిగ్గుగా అవే అబద్ధాలు చెబుతున్నారని మంత్రి డా.స్వామి దుయ్యబట్టారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో జరగని అభివృద్ధి, సంక్షేమం మేము ఏడాదిలోనే చేశాం. జగన్లా మోసం చేయకుండా రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తున్నాం. ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా తల్లికి వందనం ఇచ్చాం. మహిళలకు ఏడాదికి 3 గ్యాస్ సిలెండర్లు ఉచితంగా ఇస్తున్నాం. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నాం. నవరత్నాల పేరుతో నవ మోసాలు చేసింది జగన్ కాదా? వైసీపీ మళ్లీ అధికారంలోకి రావడం పగటి కల. 2029 ఎన్నికల తరువాత రాష్ట్రంలో అంతరించే రాజకీయ పార్టీల జాబితాలో వైసీపీ చేరడం ఖాయం. మేం ఎవరిపైనా అక్రమ కేసులు పెట్టడంలేదు. తప్పు చేసిన వారిపైనే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నాం. బాబాయి గొడ్డలి వేటు, కోడికత్తి, గులకరాయి డ్రామాల్లో రక్తి కట్టించిన జగన్ని మించిన నటుడు ఎవరైనా ఉన్నారా? వైసీపీ నేత ఆదిమూలపు సురేష్ ఒకసారి చొక్కా విప్పినందుకే ప్రజలు అడ్రస్ లేకుండా తరిమేశారు. ఇప్పుడు మళ్లీ నిస్సిగ్గుగా వైసీపీ అధికారంలోకి వస్తే రప్పా రప్పా పాలన సాగిస్తామంటూ మాట్లాడుతున్నాడు. జగన్కి అంటే బుద్ది లేదు, గతంలో మంత్రిగా పనిచేసిన సురేష్కి కూడా బుద్ధి లేదా? సురేష్ ఇప్పటి వరకు 3 నియోజకవర్గాలు మారారు. ఈ సారి ఎక్కడికి పారిపోతారో. వైసీపీ నేత రోజా నగరిలో చిత్తు చిత్తుగా ఓడిపోయి దిక్కుతోచక ఇక్కడ కొచ్చి పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారు. వైసీపీ హయాంలో మహిళలపై దాడులు, అఘాయిత్యాలు జరిగితే రోజా ఎందుకు నోరు మెదపలేదు. కొండపి నియోజకవర్గం కూటమి పాలనలో అభివృద్ధి పథంలో దూసుకెళ్తూ ప్రజలంతా ప్రశాంత జీవనం సాగిస్తున్నారు. వైసీపీ హింసా రాజకీయాలకి, రౌడీ మూకలకు ఇక్కడ స్థానంలేదు. వైసీపీ మరోసారి అధికారంలోకి రావడం పగటి కల అని, మళ్లీ వచ్చేది కూటమి ప్రభుత్వమేనని మంత్రి డా. స్వామి స్పష్టం చేశారు.