- విరాళం ప్రకటించిన దుబాయ్ సంస్థ శోభా గ్రూప్ చైర్మన్ పీఎన్సీ మీనన్
- ఏపీలో రియాల్టి రంగంలో పెట్టుబడులకు ఎన్నో అవకాశాలు
- టౌన్షిప్లు, లగ్జరీ హోటళ్ల నిర్మాణరంగంలో పెట్టుబడులు పెట్టండి
- ప్రముఖ రియాల్టీ సంస్థ శోభా గ్రూప్ చైర్మన్కు సీఎం చంద్రబాబు ప్రతిపాదన
దుబాయ్ (చైతన్య రథం): దుబాయ్లోని ప్రముఖ సంస్థ శోభా రియాల్టి అమరావతిలో ప్రపంచస్థాయి గ్రంథాలయం ఏర్పాటుకు ముందుకు వచ్చింది. రూ.100 కోట్ల విరాళంతో వరల్డ్ క్లాస్ లైబ్రరీని నిర్మించనుంది. ఏపీలో పెట్టుబడి అవకాశాలు వివరించేందుకు దుబాయ్ పర్యటనకు వెళ్లిన సీఎం చంద్రబాబుతో ఆ దేశంలోని శోభా రియాల్టి ఫౌండర్ చైర్మన్ పీఎన్సీ మీనన్ భేటీ అయ్యారు. సమావేశంలో లైబ్రరీ ఏర్పాటుకు సంబంధించి ముఖ్యమంత్రితో చర్చించారు. శోభా రియాల్టి సంస్థ అమరావతిలో ప్రపంచస్థాయి స్టేట్ లైబ్రరీ నిర్మించేందుకు ముందుకు రావటంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. గ్రంథాలయం నిర్మాణానికి ఇంత పెద్ద మొత్తంలో విరాళం ప్రకటించటంపై ధన్యవాదాలు తెలియచేశారు. అమరావతిని ప్రపంచంలో అత్యుత్తమ నగరంగా నిర్మిస్తున్నామని సీఎం ఆయనకు వివరించారు. రాజధాని నిర్మాణంలో శోభా రియాల్టి సంస్థ కూడా భాగస్వామి కావాలని ఆహ్వానించారు. ఏపీకి వచ్చి రాజధాని నిర్మాణాన్ని పరిశీలించాలని కోరారు. దేశవ్యాప్తంగా ప్రపంచస్థాయిలో నగరాలు నిర్మితం అవుతున్నాయని.. వాటితో సమానంగా మౌలిక సదుపాయాలతో అమరావతిని నిర్మిస్తున్నట్టు సీఎం వివరించారు. గ్రీన్ ఎనర్జీకి రాష్ట్రాన్ని చిరునామాగా చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు శోభా గ్రూప్ ప్రతినిధులకు చంద్రబాబు వివరించారు. అమరావతిలో క్వాంటం వ్యాలీ, విశాఖలో గూగుల్ డాటా సెంటర్ ఏర్పాటవుతోందని చంద్రబాబు చెప్పారు. ఇక తిరుపతి, విశాఖవంటి నగరాల్లో రానున్న రోజుల్లో అనేక మార్పులు రానున్నాయని… మౌలిక సదుపాయాలపై భారీగా ఖర్చు చేస్తున్నట్టు వెల్లడిరచారు. ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేట్ రంగంలో అపారమైన అవకాశాలున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరించారు.
పోర్టులున్నాయి… కారిడార్లు వస్తున్నాయి
రాష్ట్రంలో రియాల్టిరంగంలో విస్తృతమైన అవకాశాలున్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. ఈక్రమంలో అమరావతి, విశాఖ, తిరుపతివంటి ప్రాంతాల్లో కూడా బిజినెస్ ఐటీ పార్కులు, మాల్స్, హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్లతోపాటు ఉన్నతశ్రేణి వర్గాలకు హౌసింగ్ ప్రాజెక్టులు చేపట్టేందుకు అవకాశాలున్నాయని ముఖ్యమంత్రి వివరించారు. ప్రస్తుతం ఏపీలో నిర్మితమవుతున్న పారిశ్రామిక కారిడార్లు, పోర్టులకు అనుసంధానంగా ఇండస్ట్రియల్ టౌన్ షిప్, హౌసింగ్ ప్రాజెక్టులకు అవకాశం ఉందని ముఖ్యమంత్రి శోభా రియాల్టీ చైర్మన్ పీఎన్సీ మీనన్కు వివరించారు. ఈ సందర్భంగా శోభా గ్రూప్ సంస్థ చేస్తున్న ఛారిటీని సీఎం అభినందించారు. తమ ఆదాయంలో 50 శాతాన్ని ఛారిటీగా ఖర్చు పెట్టడాన్ని ప్రస్తావిస్తూ తాము ఏపీలో పీ`4 విధానాన్ని అవలంభిస్తూ అమలు చేస్తున్న జీరో పావర్టీ మిషన్ అంశాలను వివరించారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు జరిగిన అభివృద్ది అంశాలపై ఇరువురూ చర్చించుకున్నారు. ప్రస్తుతం తమ సంస్థ దుబాయ్తో పాటు ఓమన్, బహ్రెయిన్, ఖతార్, బ్రూనై దేశాల్లో ప్రాజెక్టులు నిర్వహిస్తోందని శోభా గ్రూప్ చైర్మన్ మీనన్ ముఖ్యమంత్రికి వివరించారు. భారత్లోని 14 రాష్ట్రాల్లోని 27 నగరాల్లో శోభా రియాల్టీ ప్రాజెక్టులు చేస్తోందని.. ప్రత్యేకించి బెంగుళూరు, గుర్గావ్, చెన్నై, కేరళలోని హౌసింగ్ ప్రాజెక్టులు చేపట్టామని సీఎంకు తెలిపారు. దీనిపై స్పందించిన సీఎం దుబాయ్ ప్రభుత్వంలో సీనియర్ సలహాదారు హోదాలో పనిచేస్తున్న మీనన్.. ఆ దేశంనుంచి కూడా పెట్టుబడులు వచ్చేలా సహకరించాలని కోరారు. వచ్చే నెల నవంబర్14, 15వ తేదీల్లో విశాఖలో పెట్టుబడుల సదస్సు నిర్వహిస్తున్నామని… సదస్సుకు హాజరుకావాలని సీఎం చంద్రబాబు ఆహ్వానించారు.










