- సీఎం చంద్రబాబు నిర్దేశించిన లక్ష్యాన్ని అందుకోవాలి
- హంద్రీనీవా, పోలవరం ఎడమ కాలువ పనులు జూన్ నాటికి పూర్తికావాలి
- 2026 జూన్కి వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తవ్వాలి
- ఆలస్యమైతే నిర్మాణ సంస్థలు, అధికారులపై చర్యలు
- మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టీకరణ
- ఇరిగేషన్ అధికారులు, కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులతో సమీక్ష
అమరావతి (చైతన్యరథం): ఈ ఏడాది జూన్ నాటికి హంద్రీనీవా, పోలవరం ఎడమ కాలువ పనులు పూర్తి చేయడంతో పాటు, 2026 జూన్కి వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తి చేసేలా, సీఎం చంద్రబాబు నిర్దేశించిన లక్ష్యాన్ని అందుకోవాలని అధికారులను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు. మంగళవారం అమరావతి సచివాలయంలో పోలవరం ప్రాజెక్ట్, వెలిగొండ, హంద్రీనీవా, పోలవరం ఎడమ కాలువ పనులపై ఆయా ప్రాజెక్టుల సీఈలు, ఎస్ఈలు, ఈఈలు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో మంత్రి నిమ్మల వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సమీక్షలో మంత్రితో పాటు ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
ఇటీవలే హంద్రీనీవా, పోలవరం ఎడమ కాలువ పనులను ప్రత్యక్షంగా పరిశీలించనప్పుడు పనులు నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా జరగడం లేదనే విషయం వెల్లడయిందన్నారు. సీజన్ మొదలయ్యే నాటికి హంద్రీనీవా ప్రధాన కాలువ మొదటి దశ పనులు పూర్తవ్వాలని అధికారులు, నిర్మాణ ఏజెన్సీలకు మంత్రి దిశా నిర్దేశం చేశారు. త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు క్షేత్రస్థాయిలో పర్యటించి, హంద్రీనీవా ప్రాజెక్టు పనులపై సమీక్ష చేస్తారని అందుకు తగ్గట్టుగా పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు.
పోలవరం ఎడమ కాలువ పనులైతే నత్తనడకన సాగుతున్నాయని, అనుకున్న సమయానికి పనులు పూర్తిచేసేలా, మెషినరీ, డంపర్లు, ఎక్స్కవేటర్లు, బ్యాచింగ్ ప్లాంట్లు, రోలర్లు ఏర్పాటు చేసుకోవాలని నిర్మాణ ఏజెన్సీలను ఆదేశించారు. ఇచ్చిన గడువు లోగా పనులు పూర్తికాకపోతే ఏజెన్సీలు, సంబంధిత అధికారులపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
మే నెల 4వ తేదీ నుండి 8వ తేదీ వరకు నిపుణుల కమిటీ పోలవరం ప్రాజెక్టును సందర్శించనుందని, ఈ లోగా ఈసీఆర్ఎఫ్ డ్యాంకు సంబంధించిన డిజైన్స్ తీసుకోవాలని పోలవరం సీఈకు మంత్రి నిమ్మల సూచించారు. ముందుగా గ్యాప్-1 లో ఈసీఆర్ఎఫ్ డ్యాం నిర్మాణ పనులు పూర్తిచేసేలా డిజైన్స్ తీసుకోవాలని, వెంటనే గ్యాప్-2 పనులు కూడా మొదలుపెట్టేలా నిపుణుల కమిటీ నుండి అనుమతులు పొందాలని సూచించారు. ప్రస్తుతం గ్యాప్ 2లో డయాఫ్రం వాల్ నిర్మాణ పనులు చురుకుగానే జరుగుతున్నాయని, ఇప్పటికి రెండు కట్టర్లు, రెండు గ్రాబర్ల సాయంతో 217 మీటర్లు నిర్మాణం పూర్తయిందని, మే మొదటి వారంలో మూడో కట్టర్తో పనులు మొదలుపెడతామని ప్రాజెక్టు అధికారులు మంత్రికి తెలిపారు. అదేవిధంగా వర్షాకాలం మొదలయ్యే లోపు ఎగువ కాఫర్ డ్యాంను బలోపేతం చేసేలా నిర్మిస్తున్న బట్రస్ డ్యాం పనులను మే చివరి నాటికి పూర్తి చేయాలని అధికారులకు, ఏజెన్సీ ప్రతినిధులుకు మంత్రి సూచించారు.
ఇక వెలిగొండ ప్రాజెక్ట్ టన్నెల్-2 లో బెంచింగ్, లైనింగ్ పనులకు సంబంధించి, ఏప్రిల్ నెలలో నిర్దేశించిన లక్ష్యానికి చేరుకోకపోవడంపై అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెలిగొండ ప్రాజెక్ట్ ఫీడర్ కెనాల్, లైనింగ్, రిటైనింగ్ వాల్ కు వెను వెంటనే 10 రోజులలో టెండర్లు పిలిచి, పనులను వెంటనే మొదలుపెట్టేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వచ్చే సమీక్ష నాటికి ఆయా ప్రాజెక్టుల పనుల్లో పురోగతి కనిపించాలని అధికారులను ఆదేశించారు.