- సాధికారతే సంకల్పంగా పథకాలు, కార్యక్రమాలు
- మహిళా సంక్షేమం, భద్రతకు సర్కారు పెద్దపీట
- భారీగా రుణాలు, రాయితీలతో ఆర్థిక వెసులుబాటు
- ‘శక్తి టీమ్స్’ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- 1.5 లక్షలమందికి ఉచితంగా కుట్టుమిషన్ల పంపిణీ
- డ్వాక్రా ఉత్పత్తుల అమ్మకాలతో గిన్నిస్ రికార్డు
- నైపుణ్యం, ఉపాధికి వివిధ సంస్థలతో ఎంవోయూలు
- మహిళల కోసం… రోడ్డెక్కనున్న మహిళా రైడర్లు
- అంగన్వాడీలు, ఆశాలకు గ్రాట్యుటీ ప్రకటించిన సర్కారు
మార్కాపురం (చైతన్య రథం): అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమం, సాధికారత, భద్రత కోసం బృహత్తర కార్యక్రమాలు నిర్వహించింది. మార్కాపురంలో రాష్ట్ర కార్యక్రమంగా నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో వివిధ సంస్థలతో ప్రభుత్వం ఎంవోయులు కుదుర్చుకుంది. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన సీఎం చంద్రబాబు నాయుడు మహిళల కోసం పలు పథకాలు ప్రకటించారు. మహిళా సాధికారతకు ఊతమిచ్చే అనేక కార్యక్రమాలు ప్రారంభించారు.
1. సెర్ప్, మెప్మా, ఎంఎస్ఎంఈలో స్వయంఉపాధి, ఆర్థిక వెసులుబాటు కల్పించి లక్షమంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. మెప్మాలో 30 వేలు, రాపిడోలో 10వేలు, స్వయం ఉపాధి పథకాల్లో 4వేలు, కేంద్ర ప్రాయోజిత అనుబంధ రంగాల్లో 4వేలు, పర్యాటక అనుబంధ రంగాల్లో 4వేలు, తృప్తి హోటల్స్ స్థాపనలో 4వేలు, స్మార్ట్ స్ట్రీట్ వెండార్ జోన్లో వేలు, టిడ్కో జీవనాధార కేంద్రాల ఏర్పాటుతో 2వేలమంది మహిళలకు వ్యాపార, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. అందుకు సంబంధించిన బ్రోచర్ను విడుదల చేస్తూ.. వ్యవసాయాధిరిత, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, సర్వీస్ సెక్టార్, వ్యాపారాల్లో మహిళలకు జీవనోపాధి కల్పించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసినట్టు ప్రకటించింది. ఎంఎస్ఎంఈ రంగంలో 10 వేలమందికి జీవనోపాధి కల్పించేందుకు 2025-26 సంవత్సరానికి యాక్షన్ ప్లాన్ను ప్రభుత్వం ఈ సందర్భంగా విడుదల చేసింది.
2. మహిళలు, పిల్లల భద్రతే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ‘శక్తి టీమ్స్’ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. బహిరంగ ప్రదేశాల్లో మహిళలు, పిల్లలపై వేధింపులను అరికట్టడం, నేరాలను నిరోధించడం, తక్షణ సాయం అందించి మహిళలు, బాలికలకు రక్షణ కవచంగా ‘శక్తి టీమ్స్’ బాధ్యతలు నిర్వర్తిస్తాయి.
3. మహిళా దినోత్సవంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చేనేత రథాలను ప్రారంభించారు. చేనేత ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయాలు కల్పించేందుకు చేనేత రథాలు పనిచేస్తాయి. ప్రతి జిల్లాకు ఒక్కో వ్యానును రూ.60 లక్షలు ఖరీదుదో అందిస్తున్నారు. దాని ద్వారా చేనేత ఉత్పత్తుల విక్రయం మరింత సులభమవుతుంది. ఈ సందర్భంగా ఒక్కో చేనేత మహిళకు 36 చీరలు నేసే నూలును సైతం ఉచితంగా పంపిణీ చేశారు.
4. 1.5 లక్షలమంది మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్లు పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. మహిళలకు ఉచితంగా కుట్టు శిక్షణ, మిషన్లు పంపిణీ చేయనున్నారు.
5. ‘‘మహిళల కోసం.. మహిళలకు.. మహిళల చేత’’ కార్యక్రమంలో భాగంగా ఎన్డీసీ వేదికగా వావ్ జీని యాప్ని ఇదివరకే నెలకొల్పారు. ఈ యాప్ ద్వారా రికార్డు స్థాయిలో రూ.5.13కోట్లమేర లక్షకుపైగా డ్వాక్రా ఉత్పత్తులు విక్రయించారు. ఇదొక గిన్నిస్ రికార్డు. అలా సాధించిన గిన్నిస్ రికార్డును సీఎం చంద్రబాబుకు అందచేశారు.
6. 7,471మంది పట్టణ పేద మహిళలకు 645.52 కోట్ల బ్యాంకు రుణాలను పంపిణీ చేశారు. ఒక్కో మహిళకు సుమారు రూ.50 వేల నుంచి రూ.2 లక్షల దాకా రుణం అందుతుంది.
7. 1.43 లక్షలమంది గ్రామీణ మహిళలకు బ్యాంక్ లింకేజ్ ద్వారా ఉత్పాదక రుణాల పథకం కింద రూ.1,826.43 కోట్లు, స్త్రీనిధి సంస్థ కింద రూ.1,000 కోట్లు మంజూరుకు సంబంధించి లబ్ధిదారులకు చెక్కులను అందించారు.
8. డ్వాక్రా సంఘాల ఉత్పత్తల విక్రయాలకు ఫ్లిప్కార్ట్తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. వ్యవసాయ, వ్యవసాయేతర ఉత్పత్తులపై డ్వాక్రా మహిళలకు వ్యాపార శిక్షణ అందించడంపై క్యాటలిస్టు మేనేజ్మెంట్ సర్వీసెస్తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.
9. ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ ద్వారా కుదుర్చుకున్న ఒప్పందం ద్వారా.. వ్యవసాయాధారిత ఉత్పత్తులకు వ్యాల్యూ చైన్ అందించనుంది. అదేవిధంగా డ్వాక్రా సంఘాలకు సంబంధించిన సేంద్రీయ ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు సెంటర్ ఫర్ కలెక్టివ్ డవల్మెంట్తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.
10. చిన్నతరహా హోటల్ వ్యాపారంలో డ్వాక్రా మహిళలకు అవగాహన కల్పించడానికి గాటోస్ కేఫ్తో ఒప్పందం కుదుర్చుకుంది. దీని ద్వారా గ్రామీణ మహిళల ఉపాధి కల్పన సాధ్యమవుతుంది.
11. సర్వీస్ ప్రొవైడర్ల జీవనోపాధి అవకాశాలను పెంపొందించడానికి హోమ్ ట్రయాంగిల్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దీనిద్వారా రాష్ట్రవ్యాప్తంగా 18,515 సర్వీస్ ప్రొవైడర్లకు ప్రయోజనం చేకూరుతుంది. నెలకు రూ.15,000 నుంచి రూ.35,000 నికర ఆదాయం రానుంది. సర్వీస్ ప్రొవైడర్లలో ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, కార్పెంటర్లు, బ్యూటీషియన్లు, గృహోపకరణ మరమ్మతులువంటి వాటిల్లో శిక్షణ కల్పిస్తారు.
12. రాపిడోతో కుదుర్చుకున్న ఒప్పందంతో ఆన్బోర్డింగ్ ఛార్జీలు, నెలవారీ చార్జీలను మూడు నెలల పాటు మాఫీ చేస్తుంది. దీని ద్వారా ర్యాపిడోలో ఉన్న మహిళలకు సుమారు రూ.30 వేల వరకు లబ్ధిపొందుతారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం 1,000 ఎలక్ట్రిక్ వాహనాలను మహిళా రైడర్లకు అందించారు. ఇందులో 760 ఈ-బైక్లు, 240 ఈ-ఆటోలు ఉన్నాయి.
13. నేచర్ అరకు కాఫీతో ఒప్పందం చేసుకున్నారు. గ్లోబల్ మార్కెట్లో అరకు కాఫీ ఉత్పత్తులు పెంచేందుకు, గ్రామీణ ప్రాంతాలకు అరకు కాఫీ విస్తరించేందుకు బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేస్తారు. తొలి విడతలో 100 అరకు కాఫీ అవుట్లెట్లు ఏర్పాటు చేస్తారు. తద్వారా డ్వాక్రా మహిళలకు ఉపాధి లభిస్తుంది.
14. రాష్ట్రంలోని 55,607 మంది అంగన్వాడీ వర్కర్లకు, 48,909 మంది హెల్పర్లకు మేలు చేకూర్చేలా మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి గ్రాట్యూటీ అమలును ప్రకటించారు. దీనిద్వారా ఒక్కో అంగన్వాడీ వర్కర్ రూ.1.79 లక్షల నుంచి రూ.2.32 లక్షల వరకు, హెల్పర్లకు రూ.1.09 లక్షల నుంచి రూ.1.41 లక్షల వరకు లబ్ధికలుగుతుంది. దీని అమలుకు ప్రభుత్వంపై ఏటా రూ.17.73 కోట్ల భారం పడుతుంది.
15. ఆశా వర్కర్లు ఎప్పటినుంచో కోరుతున్న గ్రాట్యూటీని సీఎం ఈ సందర్భంగా అమలు చేశారు. 2024 జూన్ నుంచి ఇప్పటి వరకు రిటైరైన, మరణించిన ఆశా వర్కర్లకు గ్రాట్యూటీ అమలవుతుంది. గతేడాది జూన్నుంచి అమలు చేసే గ్రాట్యూటీకిగాను రూ.1.90 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది.
16. పీఎం -విశ్వకర్మ పథకం ద్వారా 1000మంది మహిళలకు ప్రభుత్వం రూ.లక్ష వరకు రుణం మంజూరు చేసింది.