- బెల్టు దుకాణాల్లో విక్రయిస్తే బెల్టు తీయండి
- ఎక్సైజ్ అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం
అమరావతి (చైతన్య రథం): రాష్ట్రంలో ఏపీ ఎక్సైజ్ శాఖ రూపోందించిన సురక్షా యాప్ ద్వారా బార్ కోడ్ను స్కాన్ చేసిన తర్వాతే మద్యం విక్రయాలు చేపట్టాలని సీఎం చంద్రబాబు నాయుడు ఎక్సైజ్ శాఖను ఆదేశించారు. మద్యం బాటిళ్లపై బార్ కోడ్ను స్కాన్ చేసిన తర్వాతే కొనుగోలు చేయాలని వినియోగదారులకు సూచించారు. బుధవారం ఆర్టీజీఎస్లో నిర్వహించిన సమీక్షలో ఎక్సైజ్ శాఖ అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. గతంలో మద్యం దుకాణాలను డిజిటలైజ్ చేయలేదని అందుకే క్రిమినల్స్ ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారని ముఖ్యమంత్రి అన్నారు. నకిలీ మద్యాన్ని తయారు చేసి విక్రయించేందుకు ప్రయత్నించారన్నారు. బిచ్చగాడు చనిపోయినా దానిని మద్యం కేసుగా మలిచే ప్రయత్నం చేశారని సీఎం ఆక్షేపించారు. మద్యం కుంభకోణంలో ఉన్న వ్యక్తులు దీనిని రాజకీయం చేసి గవర్నర్కు ఫిర్యాదు చేయడానికి కూడా సిద్ధపడ్డారన్నారు. గతంలో విచ్చలవిడిగా బెల్టు దుకాణాలు ఏర్పాటు చేసి మద్యం ఏరులై పారించారన్నారు. రాష్ట్రంలో బెల్టు దుకాణాల ద్వారా విక్రయాలు చేసేందుకు ప్రయత్నిస్తే పీడీ యాక్టు ద్వారా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. అవసరమైతే దీనికోసం చట్టాన్ని కూడా సవరించడానికి సిద్ధమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. బెల్టు దుకాణాల నిర్వహణలో ఏ పార్టీవారున్నా వదిలిపెట్టేది లేదని సీఎం హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా బార్ కోడ్ స్కాన్ చేశాకే మద్యం కొనుగోలు చేసేలా అవగాహన పెంచాలని సీఎం సూచించారు. స్కాన్ చేసిన వెంటనే వివరాలు తెలిసేలా డిజిటల్ బోర్డును కూడా మద్యం దుకాణాలవద్ద ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు. బాటిల్ ధర, నాణ్యత, తయారీ వివరాలు తెలిసేలా బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రంలో నకిలీ మద్యానికి తావులేకుండా తనిఖీలు ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి ఎక్సైజ్ శాఖ అధికారులను ఆదేశించారు.
త్వరలో బీర్ బాటిళ్లకూ బార్కోడ్ పెట్టండి
రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాల్లో ఏపీ ఎక్సైజ్ సురక్షా యాప్తో స్కాన్ చేసిన తర్వాతే మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. ఈ నెల 13 నుంచి సురక్షాయాప్ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. యాప్ను ఇప్పటి వరకూ 27 వేలమందికి పైగా డౌన్ లోడ్ చేసుకున్నారని ఎక్సైజ్ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. యాప్ ద్వారా 53,430మంది మద్యం బాటిళ్లను స్కాన్ చేశాకే మద్యం కొనుగోలు చేశారని తెలిపారు. ఇందులో 50,394 బాటిళ్లకు సంబంధించిన వివరాలు అక్కడికక్కడే కొనుగోలుదారులకు తెలిశాయని వివరించారు. 1348 మంది సరైన సమాచారాన్ని ఎంటర్ చేయకపోవటంతో ఇబ్బందులు వచ్చాయని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఏపీ ఎక్సైజ్ సురక్షా యాప్ను డౌన్లోడ్ చేసుకుని 1248మంది స్కాన్ చేసినట్టు అధికారులు వివరించారు. లొకేషన్ ఆధారంగా వీటిని గుర్తించామని సీఎంకు తెలిపారు. యాప్ స్కాన్ ద్వారా చేస్తున్న విక్రయాల్లో ఒక్క నకిలీ మద్యం బాటిల్ కూడా వెలుగు చూడలేదని అధికారులు సీఎంకు వివరించారు. దీనిపై స్పందించిన సీఎం మరింత పకడ్బందీగా వ్యవస్థను తయారు చేయాలని ఆదేశించారు. త్వరలోనే బీర్ బాటిళ్లకు కూడా బార్ కోడ్ను పెట్టాలని సూచించారు. యాప్ను ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యవంతం చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి ఎక్కడా నకిలీ మద్యం లేకుండా చేయాలన్నారు. ఫిర్యాదుల కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు.