- సద్వినియోగం చేసుకుంటున్న మహిళలు
- అవసరం మేరకే ప్రయాణాలు
- ఉచిత బస్సులకు త్వరలో లైవ్ ట్రాకింగ్
- స్త్రీ శక్తి బస్సులకు రెండు వైపులా బోర్డులు పెట్టండి
- ఆర్టీసీపై సమీక్షలో సీఎం చంద్రబాబు
అమరావతి (చైతన్యరథం): మహిళల సహకారంతో స్త్రీ శక్తి పథకం గ్రాండ్ సక్సెస్ అయిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలో ఆర్టీసీపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. స్త్రీ శక్తి పథకం అమలు ఎలా జరుగుతుందని ఆర్టీసీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆక్యుపెన్సీ రేషియో ఎంత మేర పెరిగిందని ఆరా తీశారు. స్త్రీ శక్తి బస్సుల్లో సీట్ల కోసం పోటీ పడే క్రమంలో ఏమైనా ఇబ్బందులు ఎదురువుతున్నాయా.. అని ముఖ్యమంత్రి అడిగారు. స్త్రీ శక్తి పథకం అమలు చేసినప్పటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో పెరిగిందని అధికారులు చెప్పారు. గతంలో ఆక్యుపెన్సీ రేషియో 68 నుంచి 70 శాతంగా ఉండేదని.. ఇప్పుడు 60 డిపోల పరిధిలో తిరిగే బస్సుల్లో 100 శాతం ఆక్యుపెన్సీ రేషియో వస్తోందని.. అలాగే 13 జిల్లాల్లో 100 శాతం ఆక్యుపెన్సీ రేషియోతో బస్సులు తిరుగుతున్నాయని అధికారులు వివరించారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సందర్భంగా సీట్ల కోసం ఇబ్బందులు.. గందరగోళం వంటి సంఘటనలు తలెత్తడం లేదని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. అంతే కాకుండా.. ఉచిత బస్సు వెసులుబాటును మహిళలు సద్వినియోగం చేసుకుంటున్నారని… అవసరమైన మేరకే ప్రయాణాలు చేస్తున్నారని ముఖ్యమంత్రికి ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు వివరించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఏపీ మహిళల్లో చైతన్యం ఎక్కువగా ఉంటుందన్నారు. ప్రభుత్వం ఎలాంటి పథకాలను తెచ్చినా.. వాటిని సద్వినియోగం చేస్తారు. ప్రభుత్వం అందించే పథకాలను అందిపుచ్చుకుని అభివృద్ధి చెందుతారు. అందుకే నేను ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా ఉన్నప్పటి నుంచి మహిళలకు ప్రత్యేక పథకాలు ఇవ్వడానికి ఆసక్తి చూపిస్తా. డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పిస్తే.. ఇప్పుడు స్త్రీ శక్తి ద్వారా వారికి ఆర్థిక స్వాతంత్య్రం కల్పించాం. ఒకప్పుడు బాలికా విద్యను ప్రొత్సహించేందుకు సైకిళ్లు ఇచ్చాం. ఇప్పుడు విద్యార్థినులు, మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం కానుకగా ఇచ్చాం. దీని వల్ల బస్ పాసుల కోసం క్యూ లైన్లల్లో నిల్చొనే శ్రమ తప్పింది. ఆర్టీసీ బస్సుల్లో వెళ్తే భద్రత కూడా ఉంటుందని సీఎం చెప్పారు.
సహకరిస్తోన్న మహిళలకు ధన్యవాదాలు
స్త్రీ శక్తి పథకాన్ని మహిళలు చాలా చక్కగా ఉపయోగించుకుంటున్నారు. అవసరం ఉంటేనే బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. అనవసర ప్రయాణాలు పెట్టుకోవడం లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా భారమైనా సరే.. మహిళలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి… వారికి చేయూత అందివ్వడానికే స్త్రీ శక్తి పథకం ప్రారంభిస్తున్నామని మహిళలకు చెప్పాను. ఆ మేరకు మహిళలు కూడా సహకరిస్తున్నారు. రాష్ట్ర పరిస్థితిని అర్థం చేసుకుని… దానికి అనుగుణంగా వ్యవహరిస్తున్న మహిళలకు ధన్యవాదాలు. ఇప్పటి వరకు సహకరించిన విధంగానే మహిళలు భవిష్యత్తులోనూ సహకరించాలని కోరుతున్నాను. ఆర్టీసీ సిబ్బందికి ప్రయాణికులు సహకరించాలి. ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలకు.. అభివృద్ధి కార్యక్రమాలకు ఇదే విధమైన సహకారం లభిస్తే.. మరింత ఉత్సాహంగా పని చేస్తాం. ప్రజలకు, మహిళలకు మరింత మేలు చేకూర్చగలమని సీఎం చంద్రబాబు వివరించారు.
బోర్డులు పెట్టండి… అమల్లోకి లైవ్ ట్రాకింగ్..
స్త్రీ శక్తి పథకం కింద నడిపే బస్సులకు వెనుకా… ముందు భాగాన బోర్డులు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో మొత్తంగా 8,458 స్త్రీ శక్తి బస్సులకు బోర్డులు పెట్టాలని చెప్పారు. సీట్లకోసం పోటీ పడితే.. ఆర్టీసీ సిబ్బంది సంయమనంతో వ్యవహరించాలని సీఎం సూచించారు. ఇప్పటి వరకు ప్రయాణికులతో ఆర్టీసీ సిబ్బందికి ఎలాంటి ఘర్షణ వాతావరణం తలెత్తలేదని ఆర్టీసీ ఎండీ తెలిపారు. మహిళా ప్రయాణికుల సంఖ్య ఎంత మేరకు పెరిగిందని ముఖ్యమంత్రి ఆరా తీశారు. పథకం ప్రారంభానికి ముందు 40 శాతం మహిళలు ప్రయాణిస్తే.. 60 శాతం మంది పురుషులు ప్రయాణించే వారని.. ఇప్పుడు 65 శాతం మేర మహిళలు ప్రయాణిస్తుంటే.. 35 శాతం మేర పురుషులు ప్రయాణిస్తున్నారని అధికారులు వివరించారు. అలాగే స్త్రీ శక్తి బస్సుల లైవ్ ట్రాకింగ్ విధానం ఎప్పటి నుంచి అమల్లోకి తెస్తున్నారని ముఖ్యమంత్రి ఆరా తీశారు. రెండు, మూడు రోజుల్లో గుంటూరు డిపోలో స్త్రీ శక్తి బస్సుల లైవ్ ట్రాకింగ్ విధానాన్ని పైలెట్ ప్రాజెక్టుగా చేపడతామని… ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా లైవ్ ట్రాకింగ్ విధానాన్ని ప్రవేశపెడతామని అధికారులు చెప్పారు. లైవ్ ట్రాకింగ్ విధానం అమల్లోకి వస్తే.. బస్సుల వేళలు తెలుసుకుని.. ఆ మేరకు తమ ప్రయాణ సమయాలను మహిళలు ఖరారు చేసుకుంటారని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ సమీక్ష సందర్భంగా ఆర్టిక్యులేటెడ్ ఈ – బస్సులపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ తరహా బస్సులు ప్రస్తుతమున్న సాధారణ బస్సులకు… మెట్రో రైలుకు మధ్య మిడిల్ లెవెల్ ట్రాన్స్పోర్టు వ్యవస్థగా ఉంటాయని అధికారులు వివరించారు.