- రాజధాని నిర్మాణంలో భాగస్వామ్యం కోరుకున్న మహిళ
- రూ.లక్ష నగదునూ సీఎంకు అందించిన నన్నపనేని ఉదయలక్ష్మి
- రూ.50 వేలు విరాళమిచ్చిన మరో మహిళ వెలగపూడి చంద్రావతి
అమరావతి (చైతన్య రథం): రాజధాని అమరావతి నిర్మాణానికి ఇద్దరు మహిళలు విరాళమిచ్చి తమ ఔదార్యం చాటుకున్నారు. రాష్ట్ర రాజధాని నిర్మాణంలో భాగస్వాములవ్వాలనే మంచి ఆలోచనతో తమవంతు సాయమందించారు. సచివాలయంలో మంగళవారం సీఎం చంద్రబాబును కలిసిన తెనాలి, విజయవాడకు చెందిన ఇద్దరు మహిళలు 4 చేతిగాజులు, నగదును విరాళంగా ఇచ్చారు. తెనాలికి చెందిన నన్నపనేని ఉదయలక్ష్మి 36 గ్రాముల 546 మిల్లీగ్రాముల బంగారు గాజులను ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందించారు. నాలుగు బంగారు గాజులతోపాటు మరో రూ.1 లక్ష చెక్కును విరాళంగా అందించారు. రాజధాని నిర్మాణానికి ఈ మొత్తాన్ని వెచ్చించాలని కోరారు. అదేవిధంగా విజయవాడకు చెందిన వెలగపూడి చంద్రావతి రూ.50వేలు విరాళం ఇచ్చారు. ఈ సందర్భంగా వృద్ధులైన ఆ ఇద్దరు మహిళలు రాష్ట్రానికి మంచి రాజధాని ఉండాలని ఆకాంక్షతో విరాళమివ్వడం గొప్ప విషయమని ముఖ్యమంత్రి అభినందించారు. వీరి ఔదార్యం, ఉదారత ఎంతోమందికి స్ఫూర్తినిస్తుందని సీఎం చంద్రబాబు ప్రశంసించారు.