- జగన్కు మంత్రి పయ్యావుల సూటిప్రశ్న
- సినిమా డైలాగులంటూ నిస్సిగ్గుగా సమర్థింపు హేయం
- ఉన్మాదులను వెనకేసుకొస్తున్న తీరు దారుణం
- రౌడీలను ఏకం చేసి జనాన్ని భయపెట్టే కుట్ర
అమరావతి (చైతన్యరథం): ఓటమి నుంచి వైసీపీ నేతలు ఇంకా పాఠం నేర్చుకోలేదని, ఎందుకు ఓడిపోయామనే పరిశీలన కూడా చేసుకోలేదని రాష్ట్ర ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ ధ్వజమెత్తారు. వైఎస్ జగన్ పల్నాడు పర్యటనలో తలెత్తిన పరిణామాలపై మంత్రి పయ్యావుల అమరావతిలో గురువారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రాడీలను ఏకంచేసి ప్రజల్ని భయపెట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని పయ్యావుల విమర్శించారు. రాష్ట్రంలో రౌడీలందరినీ తన వెనక నడవమని జగన్ చెబుతున్నారని.. జగన్ ఎప్పుడూ భయపెట్టి రాజకీయం చెయ్యాలనే అనుకుంటారని పయ్యావుల దుయ్యబట్టారు. అధికారంలో ఉన్నప్పుడు పోలీసు వ్యవస్థను ఉపయోగించి అరాచకం చేశారు. ప్రతిపక్ష నేతలను హౌస్ అరెస్ట్లు చేశారు. అధికారం పోయాక రౌడీలను ఏకం చేస్తున్నారు. గంజాయి, బ్లేడ్ బాచ్లను జగన్ ప్రోత్సహిస్తున్నారు. రాజారెడ్డి రాజ్యాంగం అని ఫ్లెక్సీలు కట్టి, రప్పా..రప్పా నరుకుతాం అంటున్నారని కేశవ్ తూర్పారబట్టారు. అందుకే గతంలో జరిగిన అరాచకాలను ప్రజలు రప్పా రప్పా నరికారు. ప్రభుత్వంపై కాదు.. ప్రజలపైనే వైసీపీ తిరుగుబాటు. రప్పా రప్పా అని ఎవరిని నరుకుతారు.. ప్రజలనా? రప్పా.. రప్పా నరుకుతారట! చెక్కేస్తాం.. తొక్కుకుంటూ పోతాం.. అంతు చూస్తాం.. అంటోన్న ఉన్మాదులని నిస్సిగ్గుగా సమర్థించుకుంటున్న జగన్ రెడ్డి, వీటి గురించి ఏమి చెప్తావ్? ఇవి కూడా సినిమా డైలాగులు అంటావా? లేదా మేము ఇలాగే మాట్లాడుకుంటాం తప్పేముంది అంటావా అంటూ వైఎస్ జగన్ను కేశవ్ సూటిగా ప్రశ్నించారు.
ఏడాది కిందట చనిపోయిన వ్యక్తి కుటుంబానికి ఇప్పుడు పరామర్శనా? పరామర్శ పర్యటనలో ఇద్దరు చనిపోతే వారి కుటుంబాలను పరామర్శించలేదే. సొంత బాబాయి కుటుంబాన్ని జగన్ ఎందుకు పరామర్శించలేదని పయ్యావుల ప్రశ్నించారు. జగన్ కోసం వైసీపీ నేతలు, వాళ్లు తయారు చేసిన రౌడీలు పెట్టిన కటౌట్లు ప్రజల్ని భయపెట్టేలా ఉన్నాయన్నారు. నక్సలైట్లను చూసి కలబడి నిలబడిన నాయకుడు చంద్రబాబయితే, రౌడీలను సమీకరించి, కొత్త రౌడీలను తయారు చేసి రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని భయపెట్టాలనుకునే వ్యక్తి జగన్ అని పయ్యావుల ధ్వజమెత్తారు. ఏడాది క్రితం చనిపోయిన వ్యక్తి కుటుంబానికి ఇప్పుడు పరామర్శనా? పరామర్శ పర్యటనలో ఇద్దరు చనిపోతే వారి కుటుంబాలను పరామర్శించలేదే అని పయ్యావుల నిలదీశారు. సొంత బాబాయి కుటుంబాన్ని జగన్ ఎందుకు పరామర్శించలేదని కూడా పయ్యావుల చురకలంటించారు. మా వైసీపీ కార్యకర్త, టీడీపీ వాళ్ళని పొట్టేళ్ళ తల నరికినట్టు రప్పా రప్పా నరుకుతారు, మంచిదేగా.. అనే రీతిన జగన్ ప్రవర్తిస్తున్నారని, ఉన్మాదులని ఖండిరచాల్సింది పోయి, ప్రోత్సహిస్తున్న ఇలాంటి వాళ్ళని ఏమనాలి. ఏమి చేయాలి. ఇతని మానసిక స్థితి సరిగ్గా ఉన్నట్టా, లేనట్టా అని పయ్యావుల ప్రశ్నించారు.