- వర్థెల్లి మురళికి గురజాల మాల్యాద్రి సవాల్
- 85శాతం మేనిఫెస్టో హామీలకు ఎగనామం పెట్టిన జగన్ పాలన.
- అమ్మఒడికి రూ.13 వేలు ఇచ్చి.. నాన్న బుడ్డిలోనుంచి రూ.లక్ష కొట్టేశారు.
- డ్రైవర్కు రూ.10 వేలు ఇచ్చి.. డీజిల్, పెట్రోల్ ధరలుపెంచి రూ.లక్ష కొట్టేశారు.
- మత్స్యకారులకు రూ.10 వేలు ఇచ్చి.. 217 జీవోతో మత్స్యకార వృత్తిని దెబ్బతీశారు.
- ఇలా రూ.10 ఇచ్చి రూ.100 కొట్టేసిన జగన్ది మోసకారి సంక్షేమం కాదా?
- అంతేకాక బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సబ్ ప్లాన్ నిధులు రూ.లక్ష కోట్లు దారి మళ్లించారు.
- 5 లక్షల ఎకరాల అసైన్మెంట్ భూముల్ని జగన్ ముఠా కబ్జాలు చేశారు.
- నవరత్నాల్ని నవ మోసాలు చేసిన పేదల ద్రోహి జగన్.
- తొలి ఏడాదే 70శాతం హామీలన్నీ అమలు చేసింది కూటమి ప్రభుత్వం తప్ప మరే ప్రభుత్వం లేదు.
- నాడు అమ్మ ఒడికి రూ.13 వేలిస్తే.. నేడు తల్లికి వందనం పథకం కింద రూ.26 వేలనుంచి రూ.52 వేల వరకు ఇచ్చాం.
- నాడు తొలి ఏడాది పింఛన్ రూ.250పెంచితే.. నేడు తొలి ఏడాదే రూ.1000 పెంచారు.
- నాడు రైతు భరోసా రూ.7,500 ఇస్తే.. నేడు అన్నదాత సుఖీభవ కింద రూ.14,000 ఇస్తున్నాం.
- నాడు మత్స్యకార వేట విరామ భృతి రూ.10 వేలు ఇస్తే.. నేడు రూ.20 వేలు ఇచ్చారు.
- నాడు అన్న క్యాంటీన్లు రద్దు చేస్తే.. నేడు తిరిగి ప్రారంభించి లక్షలాది పేదల ఆకలి తీర్చారు.
- నాడు పెట్టుబడులను పొరుగు రాష్ట్రాలకు తరిమేస్తే.. నేడు తొలి ఏడాదే రూ.9 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించారు.
- నాడు మెగా డిఎస్సీపై మాట తప్పి మడమ తిప్పితే.. నేడు తొలి ఏడాదే 16,347 ఉపాధ్యాయ నియామకాలు చేపట్టారు.
- జగన్ పాలనలో ఏడాదికి సరాసరి 1.5 లక్షల పోలీస్ కేసులు ప్రజలపై నమోదు చేశారు.
- కూటమి పాలనలో తొలి ఏడాది లక్షలోపు మాఫియా, రౌడీలపై పోలీసు కేసులు నమోదు చేశారు.
- సహవాస దోషంతోనే కొమ్మినేని శ్రీనివాస్ జైలుపాలయ్యారు.
- పాలిచ్చే గోవును పోగొట్టుకొని.. తన్నే దున్నపోతును తిరిగి ప్రజలు తెచ్చుకోరు.
- కొరివితో తిరిగి తలగోక్కొనే అమాయకులు కాదు తెలుగు ప్రజలు.
- జగన్ ముఠా పగటి కలలు.. అబద్ధాలు.. బెదిరింపులు మానుకొని ప్రజాస్వామ్యం దారిలోకి మారకపోతే ఇక భవిష్యత్తు లేదు.
- ‘నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు’ అన్న చందంగా వర్ధెల్లి మురళి అబద్ధాల కుతంత్రం -23
షరా మామూలుగానే 15.6.2025వ తేదీ ఆదివారం అవినీతి పుత్రిక సాక్షిలో వర్ధెల్లి మురళి అబద్ధాలతో మరో భారీ వ్యాసం రాశారు. కూటమి మేనిఫెస్టో అమలుపై ఆయన రాతలు గురివింద సామెతను గుర్తుకు తెస్తున్నాయి. మహిళల శీలహననంపై సాక్షి టీవీ చర్చా కార్యక్రమంలో కేసులకు సంబంధించిన బెయిల్ అంతిమ తీర్పు కాదు. చట్టబద్ద కోర్టు అంతిమ తీర్పు మిగిలేవున్న సంగతి మరచిపోయి ఆనందంలో తేలుతున్నారు. మహిళల శీలహనన చర్చపై ప్రజా కోర్టులో ఇప్పటికే సభ్య సమాజంలో, మహిళా లోకంలో ఛీత్కారానికి గురైవున్న స్థితిని కప్పిపెట్టుకోలేరు. మేనిఫెస్టో హామీల అమలులో జగన్ మోసం చేశాడా? కూటమి మోసం చేసిందా? విజయవాడ ప్రెస్ క్లబ్లో బహిరంగ చర్చకు వర్ధెల్లి మురళి రావాలని ఆహ్వానిస్తున్నాను. వర్థెల్లి మురళి ఈ సవాల్ను స్వీకరించాలి.
నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్న సామెత వర్తించేది జగన్ ముఠాకే.
ఐదేళ్ల జగన్ పాలనలో రూ.12 లక్షల కోట్లు ఖర్చు చేశారు. వైసీపీ మేనిఫెస్టో హామీలు 85 శాతం ఎగనామం పెట్టారు. ఖజానా దివాళా తీసివున్నా తొలి ఏడాదే 70 శాతం హామీల్ని అమలు చేసిన కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ అమలు చేయలేదని జగన్ ముఠా నిందలు వేయడం చూస్తే నవ్విపోదురుగాక నాకేమి సిగ్గు అన్న చందంగా లేదా? వైసీపీకి వర్తించే సామెతను వర్ధెల్లి మురళి కూటమికి అంటగట్టి అనుచిత రాతలు రాశారు. తొలి ఏడాది జగన్ తన హామీల్లో 10శాతం కూడా అమలు చేయలేదు.70శాతం అమలు చేసిన కూటమిపై నిందలు వేస్తున్నారు. `ఏటా మెగా డిఎస్సీ జరుపుతానన్న హామీపై జగన్ మాట తప్పి మడమ తిప్పి యువతను మోసం చేశారు. ఒక్క మెగా డిఎస్సీ కూడా జరపనందున.. ఉపాధ్యాయ ఉద్యోగాన్ని కోల్పోయిన ఒక్కో యువకుడు కనీసం రూ.20 లక్షలు నష్టపోయాడు. రైతు భరోసాలో ఒక్కో రైతుకు రూ.5 వేలు ఎగనామం పెట్టడం వల్ల ఐదేళ్లలో 25 వేలు నష్టపోయాడు. పింఛన్లు 250 చొప్పున మాత్రమే ఇవ్వడం వల్ల ఒక్కొక్కరు 18 వేలకు పైగా నష్టపోయారు. అరకొరగా హామీలు అమలుపరచడంవల్ల, కొన్ని హామీలు అసలే ఎగనామం వల్ల ప్రతి లబ్దిదారుడు జగన్ పాలనలో లక్షల్లో నష్టపోయారు. పైగా అన్న క్యాంటీన్లు, పండగ.. పెళ్లికానుకలు, రైతు రుణమాఫీ, అన్నదాత సుఖీభవ, నిరుద్యోగ భృతి, విదేశీ విద్యలాంటి చంద్రన్న ప్రవేశపెట్టిన 100కు పైగా సంక్షేమ పథకాలను జగన్ రద్దు చేశారు. ఈ కోణంలో కూటమి హామీలపై జగన్ ముఠా నిందలు చూస్తుంటే.. అమ్మకు అన్నం పెట్టనివాడు పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్న చందంగా లేదా? నవ్విపోదురుగాక.. అన్న సామెతకు అతికినట్టు జగన్ ముఠా విమర్శలు సరిపోవడంలేదా? తమ అవలక్షణాన్ని కూటమికి అంటగట్టి చెప్పిన అబద్ధమే వందసార్లు చెప్పడం కాదా?
కొమ్మినేని జైలుపాలు.. అప్రతిష్టపాలు-సావాస దోషంకాదా?
బ్రిలియంట్ ఐఏఎస్ శ్రీలక్ష్మి అప్రతిష్టపాలు కావడం, అనారోగ్యంపాలు కావడం సావాస దోషమే. ఇలాగే అనేకమంది ఐఏఎస్, ఐపీఎస్, పారిశ్రామికవేత్తలు జైళ్లపాలైంది సావాసదోషమే. జగన్ కుటుంబంతో అంటకాగినవారు ఎందరో తమ ప్రతిష్టను కోల్పోయారు. జైళ్లపాలయ్యారు. చివరకు గాలి జనార్థనరెడ్డి, రాజగోపాల్ కోర్టు శిక్షలకు గురయ్యారు.
సాక్షి పత్రిక కాదు… అది అవినీతి విషపుత్రిక
సాక్షి లైసెన్సును కేంద్ర హోంశాఖ ఎందుకు రద్దు చేసింది? అవినీతి విషపుత్రిక కావడమే. కోర్టు స్టే గడువు కూడా తీరిపోయి అక్రమంగా నడుస్తున్నట్టు వార్తలున్నవి. సాక్షివల్లే పత్రికా విలువలు మంటకలిసిపోయాయి. గొడ్డలివేటును గుండెపోటుగా వార్తా ప్రసారాలు చేసింది. వివేకా హత్య నారాసుర రక్తచరిత్ర అంటూ చంద్రబాబు చేతిలో కత్తిపెట్టి పెద్ద ఫొటో సాక్షిలో వేశారు. తమ హత్యా సంస్కృతిని చంద్రబాబుకు అంటగట్టే కుట్రపూరిత రాతలు రాశారు. ఇలా అనేక అబద్ధపు, విద్వేషపూరిత రాతల ద్వారా ప్రతికా విలువలు మంటగలిపారు. పరాకాష్టగా అమరావతిని వేశ్యా రాజధానిగా చర్చలు నడిపారు.
జగన్ పాలనలో రాజమండ్రిలో ఆంధ్రజ్యోతి విలేఖరిని హత్య చేశారు. టీవీ5 యజమాని బీఆర్ నాయుడుపై, ఎడిటర్ మూర్తి, సాంబశివరావ్పై కేసులు పెట్టారు. ఏబీఎన్, టీవీ5, ఈటీవీ ప్రసారాల్ని ఫైబర్ నెట్ ద్వారా అడ్డుకున్నారు. అసెంబ్లీ కవరేజ్కు రాకుండా నిషేధించారు. పత్రికాస్వేచ్ఛ గురించి జగన్ ముఠా మాట్లాడడమంటే నవ్విపోదురుగాక.. అన్న చందంగా లేదా? కూటమి పాలనలో ప్రజలకు స్వేచ్ఛ ఉంది, మాఫియాలకు, రౌడీలకు లేదు. జగన్ పాలనలో ప్రజల ధన, మాన, ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ లేకుండాపోయింది.
కొరివితో తిరిగి ఎవరూ తలగోక్కోరు
ఐదేళ్ల జగన్ పాలన విధ్వంసాన్ని ప్రజలు మరువరుగాక మరువరు. ఒక్క ఛాన్స్ నినాదానికి, అబద్దపు ప్రచారాలకు మోసపోయి తమ ధన, మాన ప్రాణాలకు, ఆస్తులకు ఎలా రక్షణ కోల్పోయారో ప్రజలు మరువరుగాక మరువరు. 2019లో తిరిగి చంద్రబాబు గెలిచివుంటే పోలవరం.. నదుల అనుసంధానం పూర్తై కరవురహిత ఆంధ్రప్రదేశ్ ఏర్పడివుండేదని ప్రజలు గుర్తించారు. 2019లో జరిగిన పొరపాటును 2029లో జరగనివ్వక స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించుకొంటారు. తీరు మార్చుకోకుండా జగన్ పాత దారిలోనే పోతానంటే వైసీపీ భవిష్యత్తు ప్రశ్నార్థకమే!
గురజాల మాల్యాద్రి
ఛైర్మన్, టీడీపీ నాలెడ్జ్ సెంటర్