- ప్రాయోజిత పథకాల నిధుల వినియోగంపై దృష్టిపెట్టండి
- జనవరి 15నాటికి నిధులు ఖర్చుపెట్టి తీరాల్సిందే..
- కేంద్ర ప్రాయోజిత పథకాలపై వెనుకబాటెందుకు?
- కలెక్టర్లు, ఉన్నతాధికారులను నిలదీసిన సీపం చంద్రబాబు
- అదనపు నిధులు రాబట్టడంపై దృష్టి పెట్టాలని దిశానిర్దేశం
అమరావతి (చైతన్య రథం): కేంద్ర ప్రాయోజిత పథకాలు, నిధుల వినియోగంపై ఉన్నత యంత్రాంగం మొత్తం దృష్టి కేంద్రీకరించాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. కేంద్ర నిధుల వినియోగంలో తాత్సారాన్ని ప్రశ్నించిన ముఖ్యమంత్రి.. కొన్ని శాఖలు, కొన్ని జిల్లాల్లో కేంద్ర నిధుల్ని పూర్తిస్థాయిలో వినియోగించకపోవడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖర్చు పెట్టకుండా మిగిలిపోయిన కేంద్ర నిధులను జనవరి 15నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఖర్చు చేసి తీరాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ల 5వ సమావేశంలో కేంద్ర నిధుల వినియోగాన్ని లోతుగా సమీక్షించిన సీఎం చంద్రబాబు `నిధుల వినియోగంలో తాత్సారం జరిగితే రాష్ట్రం పలా నష్టపోతుందో కలెక్టర్లకు వివరించారు. దీనిపై ఐటీ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. ‘‘సమగ్ర శిక్షా పథకం కింద రూ.1363 కోట్లకు రూ.1259 కోట్లు ఖర్చు పెట్టా’’మని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. పెండిరగులోవున్న నిధులను కూడా త్వరితగతిన ఖర్చు పెడతామని లోకేష్ వివరించారు. అలాగే, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ను కలిసి రూ.1200 కోట్లు అడిగామని సీఎంకు వివరించారు. పీఎంఏవై-అర్బన్ నిధులు ఖర్చు పెట్టే అంశాన్ని పర్యవేక్షించాలని మంత్రి కొలుసు పార్థసారధిని సీఎం చంద్రబాబు ఆదేశించారు. గతంలో విజిలెన్స్ విచారణ కారణంగా పనులు నిలిచిపోయిన ఇళ్ల నిర్మాణాలకు వెసులుబాటు కల్పించే అంశాన్ని పరిశీలించాలని సీఎం ఆదేశించారు. తద్వారా పీఎంఏవై -అర్బన్ ఇళ్లకు మరింతగా ఖర్చు పెట్టే అవకాశం దొరుకుతుందన్నారు.
సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ… ‘‘వివిధ సీఎస్ఎస్ పథకాల ద్వారా రూ.24,513 కోట్ల విలువైన పనులు పూర్తి చేయాల్సి ఉండగా… ఇంకా రూ.6,252 కోట్ల నిధులు ఖర్చు పెట్టలేదు. ప్రభుత్వ శాఖలు కేంద్ర ప్రాయోజిత పథకాలను వినియోగించుకోవటంలో ఎందుకు వెనుకపడుతున్నాయి..? ఏడాది చివరిలో కేంద్రంలోని వివిధ శాఖలవద్ద నిధులు ఉండిపోతున్నాయి. వాటిని సమర్ధంగా వినియోగించుకోవాలి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్లో కేవలం 38 శాతం మాత్రమే ఖర్చు చేయడమేంటీ? జనవరి నాటికి పీఎంఏవై అర్బన్లో 75 శాతం నిధులు ఖర్చు చేస్తే అదనంగా కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోవచ్చు. జిల్లా కలెక్టర్లు కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ నిధులను త్వరితగతిన ఖర్చు చేసేలా చర్యలు తీసుకోవాలి. జాతీయ ఆరోగ్య మిషన్ నిధులు, రాష్ట్ర కృషీ వికాస్ యోజన కింద కూడా త్వరితగతిన నిధులు వినియోగించుకోవాలి. వ్యవసాయ యాంత్రీకరణకు సంబంధించిన మిగతా నిధులను కూడా కేంద్రం నుంచి సాధించే అవకాశం ఉంటుంది. నిధులులేక ఓవైపు ఇబ్బందులు పడుతుంటే.. కేంద్ర పథకాల్లో ఉన్న నిధులను ఖర్చు చేయకపోవడమేంటీ..?’’ అని అధికారులను నిలదీశారు.
‘‘ఎట్టిపరిస్థితుల్లో కేంద్రం కేటాయించిన రూ.24513 కోట్లు ఖర్చు చేయాల్సిందే. కేంద్ర నిధులు ఖర్చు చేస్తే మరో రూ.5 నుంచి రూ.6 వేల కోట్లు అదనంగా తెచ్చుకుందాం. ఈ ఏడాది కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా రూ.30 వేల కోట్లు ఖర్చు చేయాలని లక్ష్యంగా పెట్టుకోండి. కేంద్రంలోని సంబంధిత మంత్రులతో టచ్లోకి వెళ్లండి. బడ్జెట్ ప్రిపరేషన్ సమయంలోనే కలిస్తే ఏపీకి అదనంగా నిధులు సాధించుకునే అవకాశం ఉంటుంది. ఈ నెలలోనే బడ్జెట్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వంలోని అన్ని శాఖలూ తయారీ మొదలుపెడతాయి. 63 వేల ప్రభుత్వ ఖాతాలు ఇన్యాక్టివ్గా ఉన్నాయి. ఇన్ యాక్టివుగా ఉన్న ఖాతాల్లో రూ.155 కోట్ల మేర నిధులు బ్యాంకుల్లో ఉండిపోయాయి. ఆ నిధులను విత్ డ్రా చేయించండి. బ్యాంకుల్లో ఉండిపోయిన నిధులకు సింపుల్ వడ్డీ అయినా వచ్చేలా చూడండి. నిర్మాణ సంస్థలను మరియు ఏజెన్సీలను ప్రతి పది రోజులకు ఒకసారి పిలిచి సివిల్ పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి కలెక్టర్లను ఆదేశించారు. ‘‘వారాల తరబడి స్పందించకపోతే, వాళ్లను బ్ల్యాక్లిస్ట్లో పెట్టండి’’ అని సూచించారు. అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన ఆడిట్స్ త్వరలోనే పూర్తి కావాలి’’ అని సీఎం చంద్రబాబు ఆదేశించారు.















