అమరావతి (చైతన్య రథం): విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పనితీరును ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రశంసించింది. కస్తూర్బా పాఠశాలల సమస్యలపై మంత్రి వేగంగా స్పందించి చర్యలు తీసుకోవడాన్ని హైకోర్టు ధర్మాసనం అభినందించింది. సుమోటో కోర్టు ధిక్కరణ వ్యాజ్యం విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. విద్యారంగంలో సమస్యలను పరిష్కరించేందుకు మంత్రి చురుగ్గా వ్యవహరిస్తున్నారంటూ కోర్టు ప్రశంసించింది. ధర్మాసనం ముందు విచారణ సందర్భంగా మంత్రి లోకేష్ ఇటీవల చేసిన ప్రకటనలను కోర్టు ప్రస్తావించింది. ముఖ్యంగా కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు (కేజీబీవీ)లో పని చేస్తున్న టీచర్ల జీతాలను పెంచడం, ఖాళీ పోస్టులను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్టు ప్రకటించడం సానుకూల చర్యగా అభివర్ణించింది. విద్యా రంగంలో సమస్యలను పరిష్కరించేందుకు మంత్రి చురుగ్గా వ్యవహరిస్తున్నారని కోర్టు ప్రశంసించింది. ఇటీవల కస్తూర్బా వసతి గృహంలో విద్యార్థినులను ఎలుకలు కొరికిన ఘటనపై మంత్రి తక్షణమే స్పందించి చర్యలు చేపట్టిన విషయాన్నీ ధర్మాసనం గుర్తు చేసింది. విద్యార్థుల భద్రత, సంక్షేమంపై మంత్రి చూపిన చొరవను కోర్టు అభినందించింది. అయితే మంత్రి ఆ స్థాయిలో పనిచేస్తుంటే అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని హైకోర్టు ఒకింత అసంతృప్తి వ్యక్తం చేసింది. విద్యార్థుల భద్రత, పాఠశాలల నిర్వహణపై ప్రభుత్వం, అధికారులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని ధర్మాసనం స్పష్టం చేసింది.





