అమరావతి (చైతన్యరథం): తమ భవిష్యత్తు కార్యకలాపాల విస్తరణకు విశాఖను ప్రధాన కేంద్రంగా ఎంచుకున్న కాగ్నిజెంట్ సంస్థకు ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు సన్రైజ్ రాష్ట్రానికి స్వాగతం అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. రాష్ట్ర యువతలో విశ్వాసాన్ని పెంచేలా కాపులుప్పాడలో అత్యాధునిక కాగ్నిజెంట్ క్యాంపస్ ఏర్పాటవుతోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనిక నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ను ప్రపంచ స్థాయి ఆవిష్కరణల, ఉపాధి శక్తి కేంద్రంగా మార్చడానికి కట్టుబడి ఉన్నాం. మెరుగైన అవకాశాలు కల్పిస్తూ, వృద్ధిని పెంచుతూ ప్రజలకు ఉజ్వల భవిష్యత్తును రూపొందిస్తున్నాం. మరిన్ని మెరుగైన ఫలితాలు కోసం ఎదురు చూస్తున్నామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.