అమరావతి (చైతన్యరథం): రాజధాని మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి సమన్లు పంపిస్తామని ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ చెప్పారు. వాటికి సజ్జల వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని కమిషన్ స్పష్టం చేసింది. సజ్జల వ్యాఖ్యలను నిరసిస్తూ రాజధాని మహిళలు మంగళగిరిలోని మహిళా కమిషన్ కార్యాలయంలో చైర్పర్సన్ను కలిసి ఫిర్యాదు చేశారు. వైసీపీ నేతలకు అమరావతి ప్రాంత మహిళలంటే చులకనైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వం కేసులతో వేధించగా.. ఇప్పుడు ఆ పార్టీ నాయకులు అసభ్య వ్యాఖ్యలతో మానసిక క్షోభకు గురి చేస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. 11 సీట్లకే పరిమితం కావడానికి రాజధాని మహిళలే కారణమనే కోపంతో ఈ విధంగా తమను కించపరిచేలా వ్యాఖ్యానిచడం తగదని హితవు పలికారు. రాజధాని మహిళల ఫిర్యాదును జాతీయ మహిళా కమిషన్కు పంపిస్తామని శైలజ చెప్పారు.