- నన్నయ్య యూనివర్సిటీలోని మల్టీపర్పస్ ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, స్విమ్మింగ్ పూల్ నిర్మాణాల పరిశీలన
- నత్తనడకన సాగుతున్న నిర్మాణాలపై అసంతృప్తి
- ఆరు నెలల్లోనే పూర్తి చేసి వినియోగంలోకి తీసుకొస్తామని హామీ
రాజానగరం (చైతన్యరథం): ఆదికవి నన్నయ్య యూనివర్శిటీలోని క్రీడా నిర్మాణాలను సకాలంలో పూర్తి చేస్తామని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) ఛైర్మన్ అనిమిని రవినాయుడు తెలిపారు. రాజమహేంద్రవరం సమీపంలోని రాజానగరంలోని ఆదికవి నన్నయ యూనివర్సిటీలో ఖేలో ఇండియా నిధులతో నిర్మిస్తున్న మల్టీ పర్పస్ ఇండోర్ స్టేడియం, స్విమ్మింగ్ పూల్ పనులను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) ఛైర్మన్ అనిమిని రవినాయుడు బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణాల పురోగతిపై కాంట్రాక్టర్, యూనివర్సిటీ ఇంజనీర్లను ఆయన ఆరా తీశారు. అనంతరం యూనివర్సిటీ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో వైస్ ఛాన్సలర్ ఆచార్య ఎస్. ప్రసన్నశ్రీ, రిజిస్ట్రార్ ఆచార్య జి.సుధాకర్, యూనివర్సిటీ ఇంజనీర్లు, అధికారులు, కాంట్రాక్టర్తో సమీక్షించారు. అనంతరం శాప్ ఛైర్మన్ మాట్లాడుతూ ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో ఖేలో ఇండియా నిధులతో నిర్మిస్తున్న మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం, స్విమ్మింగ్ పూల్ పనుల్లో గత పాలకులు, అధికారుల అనాలోచిత నిర్ణయాల వల్ల జాప్యం జరిగిందన్నారు.
ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకెళ్లి పరిష్కరిస్తామని తెలియజేశారు. మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం నిర్మాణాలు పూర్తయ్యేందుకు రూ.6.10 కోట్లు, స్విమ్మింగ్ పూల్ నిర్మాణానికి రూ.3.16 కోట్లు అవసరం అవుతుందన్నారు. ఆరు నెలల్లోనే నిర్మాణాలను పూర్తి చేసి వినియోగంలోకి తీసుకువచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతిపెద్ద స్విమ్మింగ్ పూల్ ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో నిర్మాణంలో ఉందని, నిర్మాణాలు పూర్తి చేసి జాతీయ స్థాయి పోటీలు నిర్వహించాలనే సంకల్పంతో ఉన్నామన్నారు. క్రీడల ద్వారా విశ్వవిద్యాలయానికి రాజమహేంద్రవరం ప్రాంతానికి మరింత అభివృద్ధి, మంచి పేరు వస్తాయన్నారు. సమర్థవంతమైన మహిళ ఆచార్య ప్రసన్నశ్రీ అని, వీసీగా ఆమె నాయకత్వంలో నన్నయ విశ్వవిద్యాలయం అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు.
వీసీ ఆచార్య ఎస్. ప్రసన్నశ్రీ మాట్లాడుతూ శాప్ సహకారంతో ప్రభుత్వం నుండి నిధులు తీసుకువచ్చి మల్టీ పర్పస్ ఇండోర్ స్టేడియం, స్విమ్మింగ్ పూల్ నిర్మాణాలను పూర్తి చేస్తామని తెలిపారు. ఉమ్మడి గోదావరి జిల్లాల్లోని విద్యాకేంద్రంగా ఉన్న ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో ఈ నిర్మాణాలు పూర్తయితే క్రీడాకారులకు చక్కని అవకాశాలు ఉంటాయన్నారు. చైర్మన్ రవినాయుడు ఎంతో ఉత్సాహంగా రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి కృషి చేస్తున్నారని, వారి సహకారంతో విశ్వవిద్యాలయంలో క్రీడా నిర్మాణాలు పూర్తి చేసి జాతీయ స్థాయి క్రీడా పోటీలు నిర్వహిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అధికారులు, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు