- గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుతో ఎవరికీ నష్టం లేదు
- వచ్చే నాలుగేళ్లలో అందరికీ ఇళ్లు ఖాయం
- వృద్ధి రేటులో అనూహ్య పెరుగుదల చూస్తున్నాం
- ‘సుపరిపాలనలో తొలిఅడుగు’ సభలో సీఎం చంద్రబాబు ఉద్ఘాటన
- ప్రజాప్రతినిధులు, అధికారులతో తొలిసారి వినూత్న సదస్సు
- యోగాడే సక్సెస్ చేసిన అధికారులు, ఉద్యోగులకు సన్మానం
అమరావతి (చైతన్య రథం): ‘ఎన్నికల ముందు.. ఎంతమంది పిల్లలున్నా తల్లికివందనం ఇస్తామని చెప్పాం. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ అందరికీ డబ్బులు వేశాం. మహిళలకు ఉచిత బస్సును ఆగస్టు 15నుంచి అమలు చేస్తాం. గౌడలకు మద్యం షాపుల్లో 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చాం. మత్య్సకార సేవలో భాగంగా ఒక్కో కుటుంబానికి రూ.20 వేలు వేట నిషేధ భృతిని అందించాం. 90శాతం సబ్సీడీతో రైతులకు డ్రిప్ ఇస్తున్నాం. 20 లక్షల ఇళ్లపై సోలార్ రూఫ్టాప్ ఏర్పాటు చేసేందుకు సంకల్పం తీసుకున్నాం. ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా ఏర్పాటు చేస్తున్నాం. 3 కిలోవాట్లకు బీసీలకు రూ.98 వేలు సబ్సీడీ ఇస్తున్నాం. దీన్ని పూర్తి చేసే బాధ్యత అధికారులు తీసుకోవాలి. చేనేతలకు మరమగ్గం ఉంటే 500 యూనిట్లు, మగ్గం ఉన్నవారికి 200 యూనిట్లు ఉచితంగా విద్యుత్ అందిస్తున్నాం. భోగాపురం విమానాశ్రయాన్ని శరవేగంగా పూర్తి చేస్తున్నాం. వచ్చే ఏడాదికి దీన్ని అందుబాటులోకి తెస్తాం. ఒకే ఏడాదిలో రూ.3,800 కోట్లతో హంద్రీనీవా పనులు చేపట్టాం. పోలవరం ఎడమ కాల్వను పూర్తి చేసి అనకాపల్లికి నీళ్లు అందిస్తాం. సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం. రాష్ట్రంలోని రోడ్లపై గుంతలు పూడ్చి పాత్ హోల్ ఫ్రీ రోడ్లుగా మార్చాం. 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నాం. 33 పెట్టుబడి పాలసీలు తీసుకొచ్చిన ఏకైక ప్రభుత్వం మన ఏపీయే. నియోజకవర్గాలకు పెట్టుబడులు తీసుకొచ్చే బాధ్యత అధికారులు, ప్రజాప్రతినిధులు తీసుకోవాలి’ అని సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తైన సందర్భంగా సోమవారం అమరావతి సచివాలయం సమీపంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ‘సుపరిపాలన తొలిఅడుగు’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ప్రసంగించారు.
విజయవాడ, విశాఖపట్నంలో మెట్రో నిర్మాణానికి కేంద్రం కూడా ఆమోదం తెలిపింది. గత ప్రభుత్వం 95 కేంద్ర ప్రాయోజిత పథకాలు రద్దు చేస్తే.. మనం అధికారంలోకి వచ్చాక 82 పథకాలు తిరిగి ప్రారంభించాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తీసుకొచ్చాం. పెట్టుబడిదారుల నుంచి ఏ అభ్యర్థన వచ్చినా ఆలస్యం చేయకుండా అనుమతులు ఇచ్చి ప్రోత్సాహకాలు అందిస్తున్నాం. ల్యాండ్ రికార్డులను సరిచేయాలి. అర్హులకు న్యాయం జరిగేలా చూడాలి. ఎమ్మార్వోలు. ఆర్డీవోలు ఇక్కడే ఉన్నారు. దీన్ని కచ్చితంగా చేసి తీరాలి అని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుతో ఎవరికీ నష్టం లేదు
‘గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుతో తెలంగాణకు ఇబ్బంది ఉండదు. తెలుగు రాష్ట్రాలు బాగుపడాలంటే గోదావరి నీళ్లను రెండు రాష్ట్రాలు వాడుకోవాలి. 3000 టీఎంసీ నీళ్లు వృధాగా సముద్రంలోకి పోతున్నాయి. ఇందులో కొంత మొత్తం వాడుకున్నా.. తెలుగు రాష్ట్రాలకు ఉపయోగకరంగా ఉంటుంది. ధాన్యం కొనుగోలును గతానికంటే పెంచాం. పాడి రైతులకు గోకుల్ షెడ్లు ఇచ్చాం. హంద్రీనీవా కోసం రూ.3800 కోట్లు ఖర్చు పెట్టాం. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల కోసం కొత్త పాలసీ తెచ్చాం. ఆక్వా రైతులకు పవర్ సబ్సిడీ ఇచ్చాం. అన్ని గ్రామాల్లో గ్రామసభలు పెట్టిన ఘనత పవన్ కళ్యాణ్కు దక్కింది. అన్ని స్కూళ్లల్లో మెగా పేరెంట్ టీచర్ల మీటింగులు పెట్టారు మంత్రి నారా లోకేష్. వైద్యరంగం అభివృద్ధికి పని చేస్తున్నాం. ప్రతి నియోజకవర్గంలో కనీసం 100 పడకల ఆస్పత్రుల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నాం. దీనికి ఎమ్మెల్యేలు చొరవ తీసుకోవాలి. సంక్షేమ పథకాలు దీపం, తల్లికివందనం, పెన్షన్లువంటివి అమలు చేస్తున్నాం. పీ-4 ద్వారా పేద కుటుంబాలను ఆదుకుంటున్నాం. ఇప్పటి వరకు 87,226 బంగారు కుటుంబాలను గుర్తించి వారి అభివృద్ధి బాధ్యతను 7,867మంది మార్గదర్శకులకు అప్పజెప్పాం. ఆర్థిక అసమానతలను తగ్గించేందుకే పీ-4 విధానం. పేదలను ఆదుకునే బాధ్యతను ప్రభుత్వంతో పాటు.. సంపన్నులు తీసుకోవాలి. సమాజంలోని వనరులను ఉపయోగించుకుని అభివృద్ధి చెందినవారు పేదలను ఆదుకునే బాధ్యత తీసుకోవాలి. అంబేద్కర్కు బరోడా మహరాజు సహకరించారు. ఓ మేధావిని దేశానికి అందించారు. ఆగస్టు 15నాటికి 15 లక్షల బంగారు కుటుంబాలను పీ-4 పరిధిలోకి తేవాలి’ అని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.
వచ్చే నాలుగేళ్లలో అందరికీ ఇళ్లు
ఇప్పటి వరకు రూ. 9.34 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకున్నాం. 8.5 లక్షల మందికి ఉపాధి రానుంది. నియోజకవర్గాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఎవరైనా ముందుకు వస్తారేమోననే దిశగా ఎమ్మెల్యేలు కూడా ఆలోచన చేయాలి. వెనుకబడిన నియోజకవర్గాల్లో ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తే.. వారికి మరిన్ని ప్రొత్సహకాలిస్తాం. విజన్ 2047 లక్ష్యంతో పని చేస్తున్నాం. విశాఖ యోగా డే కార్యక్రమాన్ని లక్షలమందితో నిర్వహించాం. మొదట్లో ఇది సాధ్యం కాదన్నారు. కానీ మంచి ప్రణాళికతో కార్యక్రమాన్ని జయప్రదం చేశాం. 200మందితో కార్యక్రమం చేపట్టాలని కలెక్టర్ భావిస్తే.. అదే కలెక్టరుతో 3లక్షల మందితో యోగా డే కార్యక్రమాన్ని నిర్వహించేలా చేశాం. 2047 విజన్ సాధనకు పది సూత్రాలను రూపొందించుకున్నాం. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఎలాంటి లోటులేకుండా.. అన్ని రకాల సౌకర్యాలు.. అన్ని వసతులు కల్పించేలా విజన్ రూపొందించాం. ప్రతి ఒక్కరికీ ఇంటి జాగాను వచ్చే నాలుగేళ్లల్లో ఇస్తాం. వచ్చే నాలుగేళ్లల్లో అందరికీ ఇళ్లు కట్టిస్తాం. కేంద్ర ప్రభుత్వ పథకం జల్ జీవన్ మిషన్ పథకాన్ని గత ప్రభుత్వం సరిగా వినియోగించుకోలేదు. నేను, పవన్ కళ్యాణ్ కేంద్రం మీద ఒత్తిడి తెస్తే.. జల్ జీవన్ మిషన్ పథకాన్ని మన రాష్ట్రంలో అమలు చేసుకునేందుకు మరో రెండేళ్ల గడువు పొడిగించారు. జనాభా తగ్గుదల అనేది చాలా దేశాల్లో అతి పెద్ద సమస్యగా ఉంది. యువకులు తగ్గిపోతున్నారు. ముసలి వాళ్లు పెరిగిపోతున్నారు. కొన్ని దేశాలు యువతను దత్తతను తీసుకునే పరిస్థితికి చేరుకున్నాయి. ఈ పరిస్థితుల్లో మనం ముందు చూపుతో ఆలోచన చేయాలి. ప్రస్తుత లెక్కల ప్రకారం దేశంలో జనాభా భారీగా తగ్గనుంది. దీన్ని నివారించాల్సిన అవసరం ఉంది. దీని కోసం ప్రత్యేక చర్యలు చేపట్టనున్నాం. ఒకప్పుడు ఇద్దరు పిల్లలకంటే ఎక్కువ ఉంటే స్థానిక సంస్థల్లో పోటీకి అనర్హులుగా చేశాం. ఇప్పుడు ఆ నిబంధనను తప్పించాం. పెద్ద కుటుంబాలకు.. మరిన్ని ప్రోత్సహాకాలు ఇచ్చేలా ఆలోచనలు చేయాల్సిన అవసరం ఉంది’ అని చంద్రబాబు నాయుడు విశ్లేషించారు.
వృద్ధి రేటులో అనూహ్య పెరుగుదల
2024-25 ఆర్ధిక సంవత్సరానికి జీఎస్డీపీలో 12.02 శాతం వృద్ధి రేటు సాధించి రూ.15.93 లక్షల కోట్లు నమోదు చేశాం. ఇదే సమయానికి దేశంలో వృద్ధి 9.8 శాతమే ఉంది. 2014-15 నుంచి 2018-19 మధ్య కాలంలో సగటు వృద్ధి 13.49 శాతం సాధిస్తే… ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో సగటున 10.32 శాతం వృద్ధి మాత్రమే నమోదు చేసింది. గత ప్రభుత్వంలో వృద్ధి రేటు పడిపోవడంతో రూ.76,195 కోట్లు నష్ట పోయాం. 2024-25లో వ్యవసాయరంగంలో 15.41 శాతం, పరిశ్రమల రంగంలో 6.41 శాతం, సేవల రంగంలో 11.82 శాతం నమోదు చేశాం. 2024-25 ఆర్ధిక సంవత్సరంలో తలసరి ఆదాయం 11.89 శాతం పెరిగింది. రూ.2,37,951 నుంచి రూ.2,66,240కు పెంచగలిగాం. 2029నాటికి రాష్ట్ర జీఎస్డీపీ రూ.29.29 లక్షల కోట్లు, తలసరి ఆదాయం రూ.5.42 లక్షలు నమోదు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. 2047నాటికి రాష్ట్ర జీఎస్డీపీ రూ.308 లక్షల కోట్లు, తలసరి ఆదాయం రూ.55 లక్షలు నమోదు చేయాలని లక్ష్యం నిర్దేశించుకున్నాం. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం రాష్ట్రం, జిల్లా, నియోజకవర్గం, మండల స్థాయిలో మైక్రో- మాక్రో విజన్ ప్లానింగ్ అమలు చేస్తున్నాం. పొలిటికల్ గవర్నెన్స్ అనుసరిస్తున్నాం. 9 థీమాటిక్ విజన్ ప్లాన్లు, 10 సెక్టారల్ విజన్ ప్లాన్లు రూపొందించాం. ఇందులో ఎంపీలను, ఎమ్మెల్యేలను, కలెక్టర్లను, జిల్లాస్థాయి అధికారులను భాగస్వామ్యం చేశాం. రాష్ట్రస్థాయి నుంచి గ్రామ, వార్డు సచివాలయాల వరకు ప్రణాళిక అమలు బృందాలు ఏర్పాటు చేస్తున్నాం. విశాఖపట్నం, అమరావతి, రాయలసీమను 3 స్ట్రాటజిక్ రీజియన్ హబ్లుగా అభివృద్ధి చేస్తున్నాం. రాయలసీమను గ్రీన్ ఎనర్జీ కేంద్రంగా చేస్తాం. స్వచ్ఛాంధ్రప్రదేశ్ సాధిస్తాం. సర్క్యులర్ ఎకానమీకి ప్రాధాన్యత ఇస్తున్నాం. విశాఖలో యోగా డే విజయవంతంగా నిర్వహించడంతో కేంద్రం మనల్ని ప్రశంసించింది. ఏదైనా సాధించే శక్తిసామర్ధ్యాలు మనకున్నాయి. రియల్ టైమ్ డేటా ఇంటిగ్రేట్ చేస్తున్నాం. ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్పై దృష్టి పెట్టాం. అమరావతిని క్వాంటం వ్యాలీగా తీర్చిదిద్దుతాం. ఏఐ యూనివర్సిటీ నెలకొల్పుతాం. విశాఖపట్నం మెడ్టెక్ జోన్, ఓర్వకల్లులో డ్రోన్ సిటీ ఏర్పాటు చేస్తున్నాం. ప్రస్తుతం వాట్సప్ గవర్నెన్స్ మన మిత్ర ద్వారా 503 సేవలు అందిస్తున్నాం. ఆగస్ట్ 15నాటికి ఈ సేవలను 703కి పెంచుతాం. ఇప్పటివరకు 25 డిజిటల్ క్యాబినెట్లు నిర్వహించాం. యోగాంధ్ర- యోగాడే కార్యక్రమాలతో రికార్డులు సృష్టించాం. 21 వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులు, 2 గిన్నిస్ వరల్డ్ రికార్డులతో ఏపీని చరిత్రలో నిలిపాం. 3.03 లక్షలమంది ఒకేచోట యోగాలో పాల్గొనడం, అలాగే 22,122 మంది గిరిజన విద్యార్ధులు సూర్యనమస్కారాలు చేయడం మరెవ్వరికీ సాధ్యం కాదు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అంతర్జాతీయ యోగాడే సక్సెస్ చేసిన వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు, ఉద్యోగులను సీఎం చంద్రబాబు, డెప్యూటీ సీఎం సన్మానించారు. లోకేష్ నేతృత్వంలో యోగా డే కోసం ఏర్పడిన కెబినెట్ సబ్ కమిటీలోని మంత్రులను సీఎం, డిప్యూటీ సీఎంలు అభినందించారు.