- సమాజ హితం కోసం మా వంతు కృషి చేస్తూనే ఉంటాం
- యుఫోరియా మ్యూజికల్ నైట్లో నందమూరి బాలకృష్ణ
విజయవాడ (చైతన్యరథం): సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు అనే మా తండ్రి ఎన్టీఆర్ ఆశయ సాధనకు తామంతా కట్టుబడి ఉన్నామని అగ్రనటుడు, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. తలసేమియా బాధితుల కోసం విజయవాడలో శనివారం ఎన్టీఆర్ నిర్వహించిన యుఫోరియా మ్యూజికల్ నైట్లో బాలకృష్ణ మట్లాడుతూ జన్మనిచ్చిన తల్లిదండ్రులను స్మరించుకుంటూ సమాజహితం కోసం మా వంతు కృషి చేస్తూనే ఉంటామన్నారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్, ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్, విద్యాలయాలు, బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి ద్వారా సేవలు అందిస్తున్నామని చెప్పడానికి గర్విస్తున్నా. ప్రపంచ దేశాలతో పోలిస్తే, భారత్లో తలసేమియాతో బాధపడే చిన్నారుల సంఖ్య ఎక్కువ. హైదరాబాద్లో దాదాపు 3500 మంది బాధితులు ఉన్నారు. మా ట్రస్ట్ ఆధ్వర్యంలో 8 పడకల ఎన్టీఆర్ తలసేమియా కేర్ సెంటర్ ద్వారా 250 మంది చిన్నారులకు ఉచిత వైద్యం అందిస్తున్నాం. ఈ సేవలను విస్తరించేందుకు 25 పడకలకు ఆస్పత్రి స్థాయిని పెంచుతున్నాం. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోనూ తలసేమియా కేర్ సెంటర్ను ప్రారంభిస్తున్నాం. ఇందుకు అందరి సహాయ సహకారాలు అవసరమని బాలకృష్ణ విజ్ఞప్తి చేశారు.