- రూ.1583 కోట్ల పెట్టుబడి, 8 వేల ఉద్యోగాలు
- సహకరించిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్కు సంస్థ సీఈఓ కృతజ్ఞతలు
- ఇప్పటికే సాగర నగరంలో టీసీఎస్ క్యాంపస్
- మంత్రి లోకేష్ కృషితో ఐటీ హబ్గా విశాఖ
అమరావతి (చైతన్యరథం): దావోస్లో ఈ ఏడాది జనవరిలో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) సదస్సులో మంత్రి నారా లోకేష్ చేసిన కృషికి ఫలితం దక్కింది. విశాఖలో ప్రపంచ స్థాయి ఐటీ దిగ్గజం ‘కాగ్నిజెంట్’ క్యాంపస్ ఏర్పాటు కాబోతోంది. విశాఖపట్నంలో కొత్త అత్యాధునిక క్యాంపస్ను ఏర్పాటు చేస్తున్నామని కాగ్నిజెంట్ సంస్థ గురువారం ఎక్స్లో ప్రకటించింది. విశాఖ ఐటీ హిల్స్లోని కాపులుప్పాడలో 22 ఎకరాల్లో విస్తరించే తమ కొత్త క్యాంపస్ 8,000 కొత్త ఉద్యోగాలను కల్పిస్తుందని, ప్రధానంగా ఏఐ, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ రంగాల్లో ఉద్యోగాలు సృష్టిస్తామని తెలిపింది. 2026 కల్లా కార్యకలాపాలు ప్రారంభించి 2029 నాటికి తొలిదశ పనులు పూర్తి చేస్తామని వెల్లడిరచింది. తమ సంస్థ ఏర్పాటుతో ప్రాంతీయ సాంకేతిక పర్యావరణ వ్యవస్థ మెరుగుపడుతుందని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్లయింట్లకు ఏఐ, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ రంగాల్లో అధునాతన సేవల సామర్థ్యాలను మరింత పెంచుతుందని తెలిపింది. కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అసాధారణ ప్రతిభావంతులైన యువ సాంకేతిక నిపుణుల సేవలు తమ సంస్థకు ఎంతగానో ఉపకరిస్తాయని కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్ విశ్వాసం వ్యక్తం చేశారు. కాగ్నిజెంట్ విస్తరణకు పూర్తి సహకారం అందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీశాఖ మంత్రి నారా లోకేష్కు ఈ సందర్భంగా రవికుమార్ కృతజ్ఞతలు తెలిపారు.
నారా లోకేష్ ప్లానింగ్కు ఫలితాలు ఎలా ఉంటాయనేది నిన్న టీసీఎస్, నేడు కాగ్నిజెంట్ రాకతో యావత్దేశానికి తెలిసింది. సీఎం చంద్రబాబుతో పాటు ఐటీ మంత్రి నారా లోకేష్ దావోస్ వెళ్లినప్పుడు నీలి మీడియాతో పాటు చాలామంది కుహనా మేధావులు ఎగతాళిగా మాట్లాడారు. ఆ విమర్శలను చిరునవ్వుతో స్వీకరించారు తప్ప.. లోకేష్ ఎక్కడా బయటపడలేదు. అప్పటికే ఆయన మనసులో భవిష్యత్పై పక్కా ప్రణాళిక రూపుదిద్దుకుని ఉంది. గడ్డ కట్టించే చలిలో కూడా ఆయన కంపెనీల అధినేతలతో చర్చలు జరిపి రాష్ట్రంలో ఉన్న అపార అవకాశాల గురించి స్పష్టంగా వివరించారు. దావోస్లో నారా లోకేష్ ఇచ్చిన ప్రజెంటేషన్, విజన్.. కాగ్నిజెంట్ పెద్దలను ఎంతగానో ప్రభావితం చేసింది. దాని ఫలితంగానే తమ తదుపరి గమ్మస్థానం ఏపీలోని విశాఖ నగరం అని ఆ సంస్థ ప్రకటించింది. రూ.1,583 కోట్లు పెట్టుబడితో కాపులుప్పాడ వద్ద 21.3 ఎకరాల విస్తీర్ణంలో ‘కాగ్నిజెంట్’ ఐటీ క్యాంపస్ ఏర్పాటు కాబోతోంది. నామమాత్రంగా ఎకరా 99 పైసలకే ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది.
ఇప్పటికే టీసీఎస్…
కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రూ.1,370 కోట్ల పెట్టుబడులతో 12,000 మందికి ఉద్యోగాలు కల్పించేలా విశాఖలో క్యాంపస్ ఏర్పాటుకు ప్రఖ్యాత ఐటీ సంస్థ టీసీఎస్ చేసిన ప్రతిపాదనలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. టీసీఎస్ విశాఖ రావటంలోనూ మంత్రి లోకేష్ కృషి ఎంతగానో ఉంది. ఈ కంపెనీకి కూడా ఎకరా 99 పైసలు చొప్పున దాదాపు 22 ఎకరాలు ప్రభుత్వం కేటాయించింది. టీసీఎస్, కాగ్నిజెంట్ ..ఈ రెండు కంపెనీల రాకతోనే 20,000 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. ఇన్ని వేలమంది ఉద్యోగులతో పాటు వారి కుటుంబాలు విశాఖకు తరలి వస్తే నగర విస్తరణ, ఆర్థిక కార్యకలాపాలు ఏ స్థాయిలో పెరుగుతాయో ఊహించుకోవచ్చు. కాగ్నిజెంట్ బాటలోనే రాబోయే రోజుల్లో మరిన్ని ఐటీ సంస్థలు విశాఖ తరలిరావటం ఖాయం. ఐటీ కంపెనీల రాకతో విశాఖ నగరం రూపురేఖలు మారిపోతాయని ఐటీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.