- శరీరానికి పోషకాలలాగే సమాజానికి మంచి పాలసీలూ అవసరం
- ప్రధాని మోదీ నేతృత్వంలో భారత్ అభివృద్ధి అన్స్టాపబుల్
- వచ్చే మూడేళ్లలో అమరావతి ఇన్ఫ్రా – 2027 డిసెంబర్కు పోలవరం పూర్తి
- సాగునీటితో రాయలసీమలో కోస్తానుమించిన అభివృద్ధి
- పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు -ఎవరికీ నష్టం జరగదు
- టెక్నాలజీతో ఇంటెన్సివ్ కేర్ కాదు.. ఇంటిదగ్గరే హెల్త్ కేర్
- అమరావతిలో వే 2 న్యూస్ కాంక్లేవ్లో సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి (చైతన్య రథం): రాష్ట్రాభివృద్ధికి విజన్ కల్పన చేయటంతోపాటు.. దాన్ని సుసాధ్యం చేసే దిశగా పనిచేయాల్సి ఉందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. భవిష్యత్ తరాల కోసమే విజన్ను రూపొందించి అమలు చేస్తున్నామని.. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇది తన బాధ్యతని పేర్కొన్నారు. జాతీయస్థాయిలో వికసిత్ భారత్-2047 అమలు చేస్తుంటే.. రాష్ట్రంలో స్వర్ణాంధ్ర-2047 విజన్ సిద్ధంచేసి అమలు చేస్తున్నామన్నారు. శరీరానికి పోషకాలు ఎంత అవసరమో సమాజానికి మంచి పాలసీల అవసరం అంతే ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. వచ్చే 22 ఏళ్లలో మన రాష్ట్రం ఎక్కడ ఉండాలన్న అంశాన్ని నిర్దేశించేందుకే విజన్ రూపొందించి అమలు చేస్తున్నట్టు చెప్పారు. అమరావతిలో శుక్రవారం వే 2 న్యూస్ కాంక్లేవ్కు హాజరైన ముఖ్యమంత్రి వేర్వేరు అంశాలపై అభిప్రాయాలను వ్యక్తీకరించారు. వచ్చే దశాబ్దకాలంలో ఏపీ ఎలా ఉండబోతోందన్న అంశాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ… ‘‘రాష్ట్రంలోని స్టేక్ హోల్డర్లను భాగస్వాములను చేస్తూ ఈ తరహా కాంక్లేవ్ నిర్వహించడం మంచి పరిణామం. 25 ఏళ్ల క్రితం భారతీయులకు సరైన గుర్తింపులేని సమయంలో తెలుగు బిడ్డ పీవీ నరసింహారావు సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. అప్పటినుంచి భారతదేశం అభివృద్ధి అన్స్టాపబుల్గా మారింది. 2038నాటికి భారత దేశం నెంబర్-1 అవుతుంది. ఇందులో తెలుగువారి పాత్ర ప్రధానంగా ఉండాలని భావిస్తున్నాను. ఈ ఏడాది.. గతేడాది డబుల్ డిజిట్ గ్రోత్ సాధించగలిగాం. 2028-29నాటికి రూ.29,29,402 కోట్ల మేర జీఎస్డీపీ సాధించగలం. 2029-2034నాటికి రూ. 57,21,610 కోట్ల జీఎస్డీపీ సాధించేలా ప్రణాళికలు రూపొందించాం. దీన్ని సాధించే బాధ్యత ఎన్డీఏ కూటమి తీసుకుంటుంది. 2028-29 నాటికి తలసరి ఆదాయాన్ని రూ.5,42,985 సాధిస్తాం. 2029-2034నాటికి తలసరి ఆదాయం రూ.10.55 లక్షలకు చేరుతుంది. ఇదేమీ అసాధ్యం కాదు. నిర్థిష్టమైన ఆలోచనతోనే ప్రణాళికలు వేశాం. దీనికి సంకల్పంతోపాటు మెగా డ్రీమ్స్ ఉండాలి. విజన్ 2020 సాకారం అయ్యాక కూడా విజన్ డాక్యుమెంట్లపై ఇంకా అనుమానాలు సరికాదు. భారత్లాంటి దేశాల్లో సంక్షేమం, అభివృద్ధి రెండిరటినీ సమాతరంగా అమలు చేయాలి’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
‘‘సూపర్ సిక్స్ ద్వారా సంక్షేమం చేపట్టాం. అభివృద్ధికి అదే తరహాలో నిధులిస్తున్నాం. రాజకీయాలు అవసరమే కానీ… సమాజం గురించే ఆలోచించాలి. రాజకీయాలే ఆలోచించివుంటే హైదరాబాద్ అభివృద్ధి జరిగేది కాదు. విద్యుత్ సంస్కరణలు వచ్చేవి కావు. సీఎంగా భావితరాల కోసం ఆలోచన చేయాలి. 1994లో చాలా కఠిన నిర్ణయాలు తీసుకున్నాను. ఇప్పుడు సంపద సృష్టిస్తున్నాం. పేదలకు అందిస్తున్నాం. ప్రజలందరికీ ప్రయోజనం కలిగేలా మంచి పబ్లిక్ పాలసీలు తీసుకువచ్చాం’’ అని ముఖ్యమంత్రి వివరించారు.
మూడేళ్లలో అమరావతి ఇన్ఫ్రా పనులు.. 2027 డిసెంబర్కు పోలవరం పూర్తి
ప్రధాని మోదీ నాయకత్వంలో భారతదేశ అభివృద్ధి అన్స్టాపబుల్ అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ప్రపంచంలోని వివిధ దేశాల్లో సంక్షోభాలు వస్తున్నాయని.. నేపాల్, బంగ్లాదేశ్, ఫ్రాన్స్ ఇలా చాలా దేశాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులు చూస్తున్నామని సీఎం వ్యాఖ్యానించారు. సుస్థిరతకు, నాయకత్వానికి మారుపేరు భారతదేశమేనన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా సంస్కరణలు ప్రారంభించి అన్ని ప్రాంతాలకు అభివృద్ధిని వికేంద్రీకరించామన్నారు. దీనిపై మాట్లాడుతూ.. ‘‘విశాఖ, అమరావతి, విజయవాడ, తిరుపతివంటి నగరాల అభివృద్ధిపై దృష్టి పెడుతున్నాం. సేవల రంగం ద్వారా ఎక్కువ గ్రోత్ సాధించేలా చర్యలు చేపడుతున్నాం. అమరావతిలో ప్రారంభించిన ప్రతి పనీ రాబోయే మూడేళ్లల్లో పూర్తవుతుంది. రూ.50 వేల కోట్ల విలువైన మౌలిక వసతుల పనులు పూర్తవుతాయి. ప్రధాని చేతుల మీదుగా ఇవి ప్రారంభమవుతాయి. 2019లో గెలిచి ఉంటే 2021నాటికి పోలవరం పూర్తయ్యేది. గత ప్రభుత్వ నిర్వాకంవల్ల డయాఫ్రం వాల్ దెబ్బతింది. అధికారంలోకి వచ్చాక పోలవరంపై దృష్టి పెట్టాం. 2027 డిసెంబరు నాటికి పోలవరం పూర్తి చేస్తాం. కియా ఫ్యాక్టరీ కోసం గొల్లపల్లి రిజర్వాయరును ఒక్క ఏడాదిలో పూర్తి చేసి నీరిచ్చాం. హంద్రీ-నీవా ప్రాజెక్టు కాల్వల విస్తరణ పనులు కేవలం 100 రోజుల్లో పూర్తి చేసి నీరు ఇచ్చాం.’’ అని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు.
అమరావతి అభివృద్ధి అక్కడితో ఆగదు
‘‘అమరావతిలో మొత్తం ప్రైవేట్ భూములే. హైటెక్ సిటీ రాకముందు హైదరాబాద్లో ఎకరం రూ.లక్ష ఉండేది. ఇప్పుడు రూ.100 కోట్లకు చేరింది. పరిశ్రమలు, రహదారులలాంటి అభివృద్ధి జరిగితే భూమి విలువ పెరుగుతుంది. అమరావతి రైతుల్లో ఏ ఒక్కరికీ అన్యాయం జరగదు. అమరావతి అభివృద్ధి నిరంతరం. అభివృద్ధిని కొంత మేరకే పరిమితం చేస్తే… అమరావతి ఓ చిన్న మున్సిపాల్టీగా మిగిలిపోతుంది. హైదరాబాద్ తరహాలో అమరావతి కూడా గుంటూరు-విజయవాడ-తెనాలి తదితర ప్రాంతాలు కలిసి మహానగరంగా రూపొందుతుంది. భూములిచ్చిన వారిని ఆదుకుంటాం. విస్తరణ విషయంలోనూ ఏమాత్రం ఇబ్బంది లేకుండా అభివృద్ధి చేస్తాం. ఇప్పుడు ఉండే భూమి ఇప్పటికే సరిపోతుంది. భవిష్యత్ అవసరాల మేరకు రైతులతో మాట్లాడి అమరావతిని అభివృద్ధి చేస్తాం. అమరావతిలో 2026 జనవరికి క్వాంటం వ్యాలీ అందుబాటులోకి వస్తుంది. ఇప్పుడు క్వాంటం కంప్యూటింగ్కు అవసరమైన అనుబంధ సంస్థలు పెట్టుబడులతో ముందుకు వచ్చాయి. అలాగే జాతీయ, అంతర్జాతీయ ప్రముఖ విద్యా సంస్థలు కొన్ని ఉన్నాయి. మరికొన్ని రాబోతున్నాయి’’ అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.