ఢిల్లీ (చైతన్య రథం): కేంద్ర పట్టణ వ్యవహారాల మంత్రి మనోహర్లాల్ ఖట్టర్ను సీఎం చంద్రబాబు ఢిల్లీలో కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబునాయుడు కేంద్రమంత్రితో చర్చించారు. విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులపై మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్లో ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు, ఆర్థికవృద్ధిని పెంపొందించడానికి, పట్టణాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరచడానికి ఈ ప్రాజెక్టులు కీలకమైనవి. ఈ ప్రాజెక్టులను వెంటనే ఆమోదించి, ఆర్థిక సాయం అందించండి. మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, పట్టణీకరణ సవాళ్లను పరిష్కరించడంలో ఈ ప్రాజెక్టుల ప్రాముఖ్యతను వివరిస్తూ ఒక నోట్ను కేంద్రమంత్రికి సమర్పించారు. రాష్ట్ర విభజనకు ముందు హైదరాబాద్ మెట్రో రైలు ఆమోదించారు. విశాఖపట్నం, విజయవాడ ప్రాజెక్టులు పెండిరగ్లో ఉన్నాయని సీఎం తెలిపారు. కీలక పారిశ్రామిక కేంద్రమైన విశాఖపట్నంలో రోజురోజుకు ట్రాఫిక్ రద్దీ పెరుగుతోంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చే ఏడాది జూన్నాటికి పూర్తికానుందున, అప్పట్లోగా మెట్రో కారిడార్ను జాతీయ రహదారులతో అనుసంధానించడం ముఖ్యం. మొదటి దశలో ప్రధాన పట్టణ కేంద్రాలను అనుసంధానించడం లక్ష్యం. తర్వాత విమానాశ్రయం వరకు విస్తరణ ప్రణాళిక సిద్ధం చేసినట్లు చెప్పారు.
రాజధాని అమరావతికి గేట్వేగా విజయవాడ మెట్రో వ్యవస్థ ఏర్పాటుతో ప్రాంతీయ కనెక్టివిటీని బలోపేతం చేయాలని నిర్ణయించాం. విజయవాడ పరిసరాల్లో ఆర్థికవృద్ధికి తోడ్పడటానికి ఇది అవసరం. నగరంలో పెరుగుతున్న రవాణా అవసరాలను తీర్చడానికి ఈ ప్రాజెక్టును ప్రాధాన్యమైనదిగా పరిగణించాలని ముఖ్యమంత్రి కోరారు. రాష్ట్ర విభజన తర్వాత ఆర్థిక ఇబ్బందులను ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటోంది. మెట్రో ప్రాజెక్టులను స్వతహాగా నిర్మించే పరిస్థితుల్లో లేదు. రాష్ట్రాభివృద్ధిలో కీలకమైన ఈ రెండు మెట్రో రైలు ప్రాజెక్టులకు నూరుశాతం కేంద్ర సహాయాన్ని అందించాల్సిందిగా సీఎం కోరారు. సకాలంలో ప్రాజెక్టును గ్రౌండ్ చేసేందుకు ఫేజ్-1 అనుమతులు, భూసేకరణకు కేంద్రం మద్దతు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తిచేశారు. ఈ ప్రాజెక్టులువల్ల వాయు కాలుష్యం తగ్గడమేగాక, ట్రాఫిక్ సమస్య పరిష్కారమై దీర్ఘకాలిక ఆర్థికవృద్ధికి దోహదపడుతుందని కేంద్రమంత్రి ఖట్టర్కు సీఎం చంద్రబాబు వివరించారు.