- సిఫీ ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్, ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్కు శంకుస్థాపన
- రూ.1,500 కోట్ల పెట్టుబడి, వెయ్యిమందికి పైగా ఉద్యోగాలు కల్పించనున్న సిఫీ
అమరావతి (చైతన్య రథం): కూటమి ప్రభుత్వ పాలనలో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారనున్నాయి. విశాఖ డేటా సెంటర్ల హబ్ రూపుదిద్దుకోనుంది. విశాఖలో 5 లక్షల ఐటీ ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్న విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్.. ఈ దిశగా శరవేగంగా అడుగులు వేస్తున్నారు. అక్టోబర్ 12 ఆదివారం విశాఖలో మొట్టమొదటి ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్ తోపాటు ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్కు శంకుస్థాపన చేస్తున్నారు. ఈ ఏఐ ఆధారిత డేటా సెంటర్ రాకతో భారతదేశ తదుపరి గ్లోబల్ డిజిటల్ గేట్వేగా విశాఖ రూపుదిద్దుకోవడంతోపాటు సముద్రపు కేబుల్ కనెక్టివిటీ, ఏఐ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయనుంది. రాష్ట్రంలో సాంకేతిక రంగం అభివృద్ధిలో భాగంగా విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్.. నాస్ డాక్లో నమోదైన దేశ ప్రముఖ డిజిటల్ ఐసీటీ సొల్యూషన్స్ ప్రొవైడర్ సిఫీ టెక్నాలజీస్ అనుబంధ సంస్థ సిఫీ ఇన్ఫినిట్ స్పేసెస్ లిమిటెడ్ నిర్మించబోయే 50 మెగావాట్ల ఏఐ ఆధారిత ఎడ్జ్ డేటా సెంటర్ తోపాటు ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్కు శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 3.6 ఎకరాల భూమిలో రూ.1500 కోట్ల పెట్టుబడితో రెండు దశల్లో ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్ను సిఫీ అభివృద్ధి చేయనుంది. తద్వారా వెయ్యిమందికి పైగా ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. నూతన కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ సదుపాయంవల్ల సముద్రపు కేబుల్ కనెక్టివిటీని మెరుగుపరుస్తూ.. ఎడ్జ్ స్థాయిలో ఏఐ కంప్యూటింగ్ సామర్థ్యాన్ని విస్తరించే అవకాశం కల్పిస్తుంది. భారతదేశంతోపాటు ఆగ్నేయాసియాలోని సింగపూర్, మలేషియా, ఆస్ట్రేలియా, థాయ్లాండ్ వంటి దేశాల మధ్య త్వరితగతిన డేటా ప్రాసెసింగ్ చేస్తూ విశాఖ సీఎల్ఎస్ వ్యూహాత్మక ల్యాండింగ్ పాయింట్గా పనిచేస్తుంది.