అమరావతి (చైతన్య రథం): అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదంలో సంభవించిన ప్రాణనష్టం మనందరినీ తీవ్ర దుఃఖంలో ముంచెత్తిందని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఈమేరకు ఎక్స్ వేదికపై పోస్టు పెడుతూ.. ‘ప్రియమైన వారిని పొగొట్టుకుని అనేకమంది హృదయాలు విలపిస్తున్నాయి. వారికి నా సంతాపం తెలియచేస్తూ.. అపారమైన దుఃఖాన్ని భరించే శక్తిని వారు పొందాలని ప్రార్థిస్తున్నాను. మనం కోల్పోయిన వారిలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ జీ కూడా ఉన్నారు. ఆయన ప్రజలకు అంకితభావంతో సేవలు అందించిన మృదుభాషి, వినయపూర్వకమైన నాయకుడు. ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఆయనను అభిమానించే వారందరికీ నా హృదయపూర్వక సానుభూతి. మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’ అని పేర్కొన్నారు.