- బాబా సిద్ధాంతాలకు భక్తులు అంబాసిడర్లుగా మారాలి
- సేవే పరమావధిగా సత్యసాయి బాబా ట్రస్ట్
- మూడు రాష్ట్రాల ప్రజలకు తాగునీరందించిన బాబా
- శతజయంతి ఉత్సవాల్లో సీఎం చంద్రబాబు
పుట్టపర్తి (చైతన్యరథం); లవ్ ఆల్..సర్వ్ ఆల్, ఎప్పుడూ సేవ చేస్తూనే ఉండాలి… ఎవ్వరినీ నొప్పించకూడదు అనేది శ్రీసత్యసాయిబాబా సిద్ధాంతమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింసా అనేవి సత్యసాయి బాబా ప్రవచించిన ఐదు సూత్రాలని పేర్కొన్నారు. సత్యసాయి బాబా చెప్పిన సిద్ధాంతాలు.. సూత్రాలను పాటిస్తే ప్రపంచమంతా శాంతిగా ఉంటుందన్నారు. శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో జరుగుతోన్న సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల్లో శనివారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కలిసి పాల్గొన్న సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఆంధ్రా, తమిళనాడు, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో ప్రజలకు సత్యసాయి తాగునీటి సౌకర్యాన్ని కల్పించారన్నారు. సత్యసాయి బాబాతో నాకు మంచి అనుబంధం ఉంది. తాగునీటి ప్రాజెక్టు కోసం అవసరమైతే ప్రశాంతి నిలయాన్ని తాకట్టు పెట్టాలని సత్యసాయి బాబా భావించారు. కానీ ఆయన అభిప్రాయాన్ని తెలుసుకున్న భక్తులు… పెద్ద ఎత్తున విరాళాలు సేకరించి తాగు నీటి ప్రాజెక్టులకు నిధులు సమకూర్చారు.
ఇప్పటికే అదే స్ఫూర్తిని సత్యసాయి భక్తులు కొనసాగించడం నాకు సంతోషాన్నిస్తోంది. వివిధ ప్రాణాంతక రోగాల బారిన పడిన వారిని బాబా ట్రస్టు ఆదుకుంటోంది. మానవ సేవే… మాధవ సేవ అనే సిద్ధాంతాన్ని సత్యసాయి బాబా ట్రస్ట్ అమలు చేసి చూపిస్తోంది. శాంతికి బ్రాండ్ అంబాసిడర్లుగా సత్యసాయి బాబా భక్తులు నిలుస్తారు. 7.50 లక్షల వాలంటీర్లు సత్యసాయి బాబా ట్రస్ట్ ద్వారా సేవలందిస్తున్నారు… ఏ వ్యవస్థకు ఇంతటి శక్తి లేదు. నేడు సత్యసాయి ట్రైబల్ ఉమెన్ హెల్త్ కేర్ ప్రోగ్రాం ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది. ఏవైనా ప్రకృతి వైపరీత్యాలు వస్తే సత్యసాయి బాబా స్ఫూర్తితో సేవలందిస్తారు. ధనవంతులు… ఉన్నతాధికారుల కుటుంబాలకు చెందిన పిల్లలను సైతం ప్రశాంతి నిలయానికి పంపి సేవా కార్యక్రమాలు చేయిస్తారు. 140 దేశాల్లో 2 వేలకు పైగా బ్రాంచ్లు సత్యసాయి బాబా ట్రస్టుకు ఉన్నాయి. భగవాన్ సత్యసాయి బాబా భక్తులు శాంతికి అంబాసిడర్లుగా నిలవాలి, సత్యసాయి సాయిబాబా సిద్ధాంతాన్ని సర్వత్రా వ్యాపితం చేసేలా కృషి చేయాలి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జీవితం అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్, మంత్రులు, తదితరులు పాల్గొన్నారు.














