- సీఈసీతో సమావేశంలో టీడీపీ నేతల వినతి
- కేంద్ర ఎన్నికల సంఘంతో సమావేశమైన నాయకులు
- సీఈసీపై పూర్తి నమ్మకం ఉందని స్పష్టీకరణ
- పలు సూచనలు చేసిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు
న్యూఢిల్లీ (చైతన్యరథం): సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్నికల విధానాల్లో సంస్కరణలు, ఓటరు జాబితా సవరణలపై రాజకీయ పార్టీల అభిప్రాయాలను తెలుసుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం ఢల్లీిలో నిర్వహించిన అఖిల పక్ష సమావేశానికి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ తరఫున రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక శాసనసభ్యులు ప్రల్లా శ్రీనివాస రావు యాదవ్, టీడీపీ ఎంపీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాస రావు మాట్లాడుతూ, ఓటరు జాబితాల్లోని లోపాలను సరిచేయాలన్న ఎన్నికల సంఘం లక్ష్యాన్ని స్వాగతిస్తున్నామని, కేంద్ర ఎన్నికల సంఘంపై తమకు పూర్తి నమ్మకం ఉందని తెలిపారు. ఓటరు గుర్తింపులో ఆధార్ను ఏకైక ఆధారంగా పరిగణించకూడదని సూచించారు. 11 రకాల గుర్తింపు పత్రాలను అంగీకరించాలన్న ఎన్నికల సంఘం నిర్ణయాన్ని టీడీపీ స్వాగతించిందన్నారు. డూప్లికేట్ ఓటర్లను తొలగించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సహాయంతో ఆధునిక సాంకేతికతను వినియోగించాలని, ప్రతి ఓటరుకు ప్రత్యేక డోర్ నంబర్ కేటాయించడం ద్వారా డేటా చోరీని నిరోధించి, యూనిక్ ఓటర్ ఐడెంటిటీ సృష్టించవచ్చని ఆయన పేర్కొన్నారు. ఓటరు జాబితా పరిశీలనలో ఎన్నికల సంఘానికి ప్రత్యేక హక్కులు ఉన్నప్పటికీ, పౌరసత్వ నిర్ధారణ వారి అధికార పరిధిలో లేదని, 1995 సుప్రీంకోర్టు లాల్బాబు హుస్సేన్ కేసు తీర్పును ఆయన గుర్తు చేశారు. అభ్యంతరాలు లేవనెత్తిన వారే ఆధారాలు సమర్పించాలని, ఆధారాలు చూపలేకపోయినంత మాత్రాన ఓటర్ల హక్కును రద్దు చేయడం సరికాదని స్పష్టం చేశారు.
బీహార్లో ఈ ప్రక్రియ కారణంగా గందరగోళం నెలకొందని, గ్రామీణ ప్రాంతాల్లో అక్షరాస్యత తక్కువగా ఉండటం, ఆధార్ ఉన్నా ఇతర పత్రాలు లేని వారు ఎక్కువగా ఉండటం వల్ల నిజమైన ఓటర్లు తొలగింపునకు గురయ్యే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బీహార్లో సుమారు 3 కోట్ల మంది ఓటర్లను ఓటరు జాబితా నుంచి తొలగించడం ఆర్టికల్ 326కు విరుద్ధమని, గుర్తింపు పత్రాలు లేని వారు భారతీయులేనని నిర్ధారించే బాధ్యత ప్రభుత్వ సంస్థలదేనని ఆయన అన్నారు. ఓటర్లకు అన్యాయం జరగకుండా న్యాయపరమైన, పారదర్శకమైన విధానాలను అమలు చేయాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. డ్రాఫ్ట్ ఓటరు జాబితాలను అన్ని రాజకీయ పార్టీలకు అందజేయాలని, ఫీల్డ్ లెవెల్ అధికారుల నియామకంలో పారదర్శకతను నిర్వహించాలని సూచించారు.వాలంటీర్ వ్యవస్థలు, మొబైల్ వాహనాలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో పత్రాల సేకరణకు ప్రభుత్వం సహాయం అందించాలని కోరారు. వాట్సాప్ హెల్ప్లైన్లు, వార్డు స్థాయి సమస్యా పరిష్కార విధానాలు సమర్థవంతంగా పనిచేయాలని, పార్టీ బూత్ స్థాయి ప్రతినిధులను అన్ని దశల్లో భాగస్వామ్యం చేయాలని సూచించారు. ప్రతి పౌరుని ఓటు హక్కును కాపాడేందుకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బూత్ లెవెల్ అధికారులకు (బీఎల్ఓ) ప్రస్తుతం అందిస్తున్న రూ.250 ప్రోత్సాహకాన్ని పెంచాలని, బూత్ లెవెల్ ఏజెంట్లు (బీఎల్ఏ), బీఎల్ఓలు సమన్వయంతో పనిచేస్తే పని మరింత వేగంగా, సమర్థవంతంగా జరుగుతుందని ఆయన అన్నారు. ఈ సమావేశంలో తెలుగుదేశం తరుపున పల్లాతోపాటు టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎంపీలు దగ్గుమళ్ల ప్రసాదరావు, బైరెడ్డి శబరి, పార్టీ నేతలు ఎమ్మెల్యే కూన రవికుమార్, జ్యోత్స్న పాల్గొన్నారు.